కోటి కళ్లతో ఎదురుచూస్తున్నాం: భారతి

ఈ రోజు బెయిల్ హియరింగ్ సుప్రింకోర్టులో వుంది. రాష్ట్రంలోని కోట్లమంది ప్రజలు జగ‌న్ కోసం ఎదురుచూస్తున్నారు, పూజలు చేస్తున్నారు. ఇంట్లో పిల్లలు, అత్త, షర్మిల, నేను, అమ్మ, నాన్న అందరం కోటి కళ్లతో ఎదురుచూస్తున్నాం - న్యాయం జరుగుతుందని. ప్రార్థనలు, ఉపవాసాలు చేస్తున్నాం. బంధువులు అందరూ వచ్చి కలిసి ప్రార్థనలు చేస్తున్న తరుణంలో తెలిసింది మా సంస్థ ఆస్తులను ఇడి ‌అటాచ్ చేసిందని. ఈ ఇడి నోటీసు రావడానికి కొన్ని గంటల ముందు టిడిపి ఎంపిలు వెళ్లి ఆర్థికమంత్రి చిదంబరంగారిని కలిశారు. అది జరిగిన 2-3 గంటల వ్యవధిలో ఈ నోటీసు వచ్చింది.

ఇన్ని రోజులుగా ఎవరికన్నా డౌట్ ఉంటే తెలుసుకోండి... కాంగ్రె‌స్‌తో టిడిపికి ఎంత దగ్గరి సంబంధం వుందో అని చంద్రబాబుగారు ఈ సంఘటనతో చెప్పదలుచుకున్నారా? వీరప్ప మొయిలీ మొన్న ఎన్‌డిటివితో మాట్లాడుతూ ‘మా అస్త్రాలు మాకున్నాయి’ అన్నారు.... అంటే వాళ్ల అస్త్రాలు ఇవే కాబోలు. జగన్‌కు వ్యతిరేకంగా కేసులు వేసిన దగ్గర నుండి జగన్ బెయి‌ల్‌కు ఒకరోజు ముందు ఆస్తుల అటాచ్‌మెంట్ వరకు ఎంతగా చేతిలో చేయివేసి పని చేస్తున్నారు కాంగ్రె‌స్, టిడిపి వాళ్లు.
వయసులో, అనుభవంలో, పెద్దరికంలో అన్నింటిలో మాకంటే పెద్దవాళ్లు - ఇదేనా మీ నిజాయితీ, మీ ప్రజాసేవ? ఎందుకు ‘మీకోసం’ అంటూ జనాలను నమ్మబలికించడానికి చూస్తారు. మనకు స్వాతంత్య్రం వచ్చిన తరువాత రాజకీయాల్లో ఇంత దిగజారుడుతనాన్ని బహుశా ఎవ్వరూ చూడలేదనుకుంటా. బాబుగారు నిజంగా ప్రజల కోసం అయితే నోకాన్ఫిడెన్స్ ఎందుకు పెట్టరు - ఇన్ని సమస్యలు వుంటే? ఆయనకు కావలసింది ప్రజా సమస్యలు కాదు... జగ‌న్‌ను ప్రజలకు దూరం చేసి, తన ఇమేజ్ పెంచుకోవాలని కాంగ్రె‌స్‌తో కలిసి ఆడుతున్న నాటకం ఇది. కానీ మన చేతలు మన మాటల కంటే ఎక్కువ మాట్లాడతాయి.

ప్రజలందరికీ తెలుసు - సిబిఐ ఇన్వెస్టిగేషన్‌లో ఏమీ లేదు అని. మా సంస్థలలో పెట్టుబడులు పెట్టిన వాళ్లలాగే మా పెట్టుబడులు కూడా సంస్థలలోనే వున్నాయని. మా ఇంటికి పెట్టుబడులు పెట్టినవారి డబ్బు ఒక్క రూపాయి కూడా రాలేదని - మా పెట్టుబడికి మాకు ఎలా వాటా వుందో, వాళ్ల పెట్టుబడికి వాళ్లకు వాటా వుంది.

దేవుని ఆశీర్వాదంతో నా భర్త చేసిన ప్రతి వ్యాపారంలో పెట్టుబడి పెట్టినవారికి లాభాలే తెచ్చిపెట్టాడు. ఈనాడులాగా నష్టాలలో వున్న కంపెనీ షేర్లను కాదు మేము అమ్మింది.

అసలు నాకు ఒక్కటి తెలియాలి. ఇది 26 జీవోల గురించా, లేక జగన్ సంస్థలలోని పెట్టుబడుల కేసా? అని. ‌జీవోల కేసు అయితే మంత్రులను విచారించాలి. కేబినెట్ అంతా బయటనే వున్నారు. ప్రభావితం చేయగల పదవిలో వున్నారు. కానీ అస్సలు సంబంధం లేని జగ‌న్‌ను కేసులో ఇరికించారు. జైలులో పెట్టారు.

కానీ అన్నిటికంటే బాధ అనిపించేది ఏమిటంటే - నేను ఇది రాస్తుండగా మా చిన్నపాప వచ్చి అడిగింది - ‘ఏమిటి అమ్మా, ఇ.డి. అటాచ్ చేసింది అంటున్నారు?’ అని. ‘మా సోష‌ల్ బు‌క్‌లో మన దేశం గురించి, మన రాజ్యాంగం గురించి, మన హక్కుల గురించి ఇంత చెప్పారు కదా అమ్మా. అవన్నీ వట్టి మాటలేనా? చట్టాలు, న్యాయాలు నిజంగా వుంటే నాన్న జైలులో ఎందుకు వుంటాడమ్మా?’ అని. నాకు చాలా బాధ అనిపించింది. ఇంత చిన్న వయసులో తన మనసు మీద ఇవన్నీ వట్టిమాటలు అనే అభిప్రాయం ఏర్పడిందే అని. కానీ మన న్యాయస్థానాలు న్యాయాన్ని నిలబెడతాయి. ఈ కుమ్మక్కు అన్యాయాన్ని గమనిస్తారు... అరికడతారు. నా బిడ్డ మనసులో మన దేశంలో న్యాయం వుంది అనే భావన కలిగిస్తారు అనే నమ్మకం వుంది. దేవుడు అన్యాయాన్ని సహించడు. తప్పక న్యాయం చేస్తాడు అనే నమ్మకం వుంది.

- వైయస్ భారతి
Back to Top