'జగన్‌ను జైలులో ఉంచడం రాజ్యాంగ విరుద్ధం'

ఏలేశ్వరం (తూర్పు గోదావరి జిల్లా) : వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధ్యక్షుడు శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డిపై ఎలాంటి నేరాలూ రుజువు కాకపోయినప్పటికీ జైలులో ఉంచడం రాజ్యాంగ విరుద్ధం అని వైయస్‌ఆర్‌సిపి నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పరుపుల సుబ్బారావు పేర్కొన్నారు. శ్రీ జగన్‌కు ప్రజలలో ఉన్న ఆదరణ చూసి ఓర్వలేకనే అధికార కాంగ్రెస్, ‌ప్రధాన ప్రతిపక్షం టిడిపిలు కుమ్మక్కై కుట్రలు చేస్తున్నాయని సుబ్బారావు ఆరోపించారు. శ్రీ జగన్‌కు బెయిల్ మంజూరు కావాలని కోరుతూ ఏలేశ్వరంలో శనివారం‌నాడు 'జగన్‌ కోసం.. జనం సంతకం' కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఏలేశ్వరంలోని బాలాజీ చౌక్ వద్ద‌ దివంగత మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం సంతకాల సేకరణ చేపట్టారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డిపై జరుగుతున్న కుట్రలను ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారని పరుపుల ఈ సందర్భంగా హెచ్చరించారు. కాంగ్రెస్‌, టిడిపి కుట్రలను తీవ్రంగా ఖండిస్తూ ప్రజలు కోటి సంతకాల కార్యక్రమంలో స్వచ్ఛందంగా  పాల్గొంటున్నారని అన్నారు. పార్టీ నేతలు వరుపుల రాజబాబు, బంటుపల్లి పోతన్న, శిడగం వెంకటేశ్వరరావు, అలమండ చలమయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Back to Top