న్యూఢిల్లీ : వైయస్ జగన్మోహన్రెడ్డి బెయిల్ పిటీషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. జస్టిస్ అఫ్తాబ్ ఆలం, జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్తో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. క్విడ్ప్రో కో కేసులో బెయిల్ కోసం వైయస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు బెయిల్ తోసిపుచ్చుతూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. జగన్ బెయిల్ పిటిషన్ సెప్టెంబర్ 14న ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. సీబీఐ కౌంటర్ పరిశీలించాల్సి ఉందంటూ జడ్జిలు విచారణను సెప్టెంబర్ 28కు వాయిదా వేశారు. ఈ కేసులో సీబీఐ రెండోసారి తన న్యాయవాదులను మార్చడంతో సీబీఐ విజ్ఞప్తి దృష్ట్యా కేసును అక్టోబర్ 5కు ధర్మాసనం వాయిదా వేసింది. సీబీఐ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్, సీనియర్ న్యాయవాది అశోక్ బాన్ వాదించగా... జగన్ తరపున గోపాల్ సుబ్రహ్మణ్యం, విశ్వనాథన్ ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. జగన్ను అక్రమంగా అరెస్టు చేశారనీ, సీబీఐ ఈ కేసులో ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు చూపలేదనీ న్యాయవాది గోపాల్ సుబ్రహ్మణ్యం వాదించారు. సాక్షులను తారుమారు చేస్తారంటూ బెయిల్ ను అడ్డుకోవటం సరికాదన్నారు. సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ కూడా విచారణకు హాజరయ్యారు. అంతకు ముందు ఆస్తుల కేసు విచారణకు మరింత గడువు కావాలని సీబీఐ చేసిన వినతిని సుప్రీం కోర్టు మన్నించింది. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీలోపు విచారణను ముగించాలని కోరింది. విదేశాల్లో విచారణ చేపట్టాల్సి ఉందని సీబీఐ సుప్రీ కోర్టుకు తెలిపింది. విచారణలో తాము ఇంతవరకూ ఒక్కరోజు కూడా వృధా చేయలేదని పేర్కొంది. సీబీఐ వాదన విన్న సుప్రీం కేసును ఒక్క ఛార్జి షీటులోనే దాఖలు చేయాలని ఆదేశించింది. బెయిలు కోసం మళ్ళీ మార్చి 31 తర్వాతే పిటిషన్ వేసుకోవచ్చని జగన్ లాయర్లకు సూచించింది. కేసు దర్యాప్తు పూర్తయ్యాక బెయిలు కోరవచ్చంది.