- బాబు ఓ నరహంతక ముఖ్యమంత్రి
- క్యాబినెట్ లో హంతకులున్నారు
- మా నాయకులను, కార్యకర్తలను పొట్టనబెట్టుకుంటున్నారు
- ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ఇద్దరూ కలిసి నారాయణరెడ్డిని హత్య చేశారు
- అవినీతి, అరాచక ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయండి
- నరహంతక ప్రభుత్వం నుంచి ప్రజలకు విముక్తి కల్పించండి
- గవర్నర్ కు తమ్మినేని సీతారాం విజ్ఞప్తి
శ్రీకాకుళంః చంద్రబాబు నరహంతకుడని, ఆయన ప్రభుత్వం ఓ నరహంతక ప్రభుత్వమని పార్టీ అధికార ప్రతినిధి, హై పవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం నిప్పులు చెరిగారు. బాబు క్యాబినెట్ లో నరహంతకులు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వైయస్సార్సీపీకి చెందిన 15మంది ముఖ్య నాయకులను హత్య చేశారని తమ్మినేని సీతారాం అన్నారు. అవన్నీ ప్రభుత్వ హత్యలేనని పేర్కొన్నారు. పోలీసులు పచ్చచొక్కాలు వేసుకొని, టీడీపీ నాయకులు ఖాకీ చొక్కాలేసుకొని వైయస్సార్సీపీ నాయకులను తెగనరుకుతుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. వైయస్సార్సీపీ నాయకుల్లో భయభ్రాంతులు సృష్టించి రాబోయే ఎన్నికల్లో మీరు ప్రభుత్వానికి రావాలనుకుంటున్నారా అని బాబుపై మండిపడ్డారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఐఏఎస్ లు అంతా అయ్యా.. ఎస్ అని బాబు దగ్గర చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో తమ్మినేని సీతారాం మాట్లాడారు.
బాబు ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో విజయవాడలో కలెక్టర్ల సమావేశం పెట్టి మా వాళ్లు ఏం చేసినా లా అండ్ ఆర్డర్ ప్రయోగించొద్దని చెప్పినప్పుడే ఆయన నిజస్వరూపం బయటపడిందన్నారు. ఓ ముఖ్యమంత్రిగా మీరు అలా మాట్లాడవచ్చా..? నీ అనుభవం ఇందుకేనా అని తమ్మినేని బాబుపై ధ్వజమెత్తారు. టీడీపీ నేతల కేసులను మాఫీ చేసేందుకు ఏకంగా 132 జీవోలు విడుదల చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. చంద్రబాబు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు ఎంత సేపు మళ్లీ అధికారంలోకి ఎలా రావాలన్న ఆలోచనే తప్ప ప్రజలను పట్టించుకున్న పాపాన పోవడం లేదని తమ్మినేని మండిపడ్డారు. రాగద్వేశాలకతీతంగా పాలన సాగిస్తానని రాజ్యంగబద్ధంగా ప్రమాణస్వీకారం చేసిన నీవు...ఇవాళ చేస్తున్నదేమిటి బాబు అని తూర్పారబట్టారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రభుత్వంలో ముద్దాయిగా ఎఫ్ఐఆర్ లో చేరాడంటే ఇంతకన్నా ఘోరం ఇంకేముందని బాబుపై విరుచుకుపడ్డారు. నారాయణరెడ్డి, ఆయన అనుచరుడు సాంబశివుడిని ఉపముఖ్యమంత్రి కొడుకు ప్లాన్ చేసి ఇంత ఘోరంగా చంపుతుంటే ఏం చేస్తున్నావ్..?నీవు నరహంతక ముఖ్యమంత్రివి అంటూ తమ్మినేని బాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ నేతలు కేశినేని, బోండా, దేవినేని ఉమ, బుద్ధా వెంకన్నలు ట్రాన్స్ పోర్టు కమిషనర్ ను నడిరోడ్డుపై నిలబెట్టి బండబూతులు తిడితే...మీరు రాజ్యాంగనికి ఇచ్చిన విలువేముందని బాబును నిలదీశారు. రాష్ట్రంలో సాండ్ , ల్యాండ్, వైన్స్, మైన్స్ మాఫియాల ఆగడాలు శృతిమించిపోయాయన్నారు. ఇక ప్రజాస్వామ్యం ఎందుకు..ముఖ్యమంత్రులు, మంత్రులు ఎందుకు ...వచ్చే ఎన్నికల్లో నేరగాళ్లు, మాఫియాగాళ్లకు టిక్కులు పెట్టి టికెట్ లు ఖరారు చేసి నామినేషన్ వేయించుకో బాబు అంటూ చురక అంటించారు. ఎమ్మార్వో అధికారిని వనజాక్షిని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కొడితే ఆయన్ను దగ్గరకు తీసుకొని బాబు ముద్దుపెట్టుకోవడం వల్లే రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయన్నారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి అందరూ కలిసి పథకం ప్రకారం నారాయణరెడ్డిని హత్యను చేశారని తమ్మినేని అన్నారు. ముద్దాయిలు ఎంతటివారైనా సరే నీ నిజాయితీని రుజువు చేసుకోవాలనుకుంటే సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బాబు రాజీనామా చేయాలన్నారు. బాబు బెదిరింపులకు భయపడేది లేదన్నారు. అవినీతి, అరాచక, హంతక ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి ప్రజలకు విముక్తి కల్పించాలని గవర్నర్ ను కోరారు.