సారీ చెబితే స‌రిపోతుందా?

  • ముఖ్య‌మంత్రి అండ‌తోనే ఐఏఎస్ అధికారి బాలసుబ్రమణ్యంపై దాడి 
  • ఎంపీ నాని, ఎమ్మెల్యే బోండాపై  క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

  • విజయవాడ: రాష్ట్రంలో అధికారయంత్రాంగంపై జరిగే దాడులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. అధికారుల‌పై దాడులు చేసి సింపుల్‌గా సారీ చెబితే స‌రిపోతుందా అని ప్ర‌శ్నించారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం రాష్ట్ర ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల మీటింగ్‌లో వారికి తప్పుడు సంకేతాలిచ్చారని గుర్తు చేశారు. రూల్స్‌ ప్రకారం పోతే కుదురదు, తెలుగుదేశం పార్టీ నాయకుల మాటలను వినాలి, మా ప్రయోజనాలను కాపాడాలని మాట్లాడితే ఎలాంటి సంకేతాలు టీడీపీ నేతల్లోకి వెళతాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి బాధ్యతారహితమైన మాటల వల్లే నాడు ఎమ్మార్వో వనజాక్షి దాడి నుంచి నేడు ఐఏఎస్‌ అధికారి బాలసుబ్రమణ్యం దాడి వరకు దారితీసిందన్నారు.  ఒక మహిళ మీద అత్యాచర ప్రయత్నం చేస్తే రౌడీ షీట్‌ ఓపెన్‌ చేసి జైలుకు పంపిస్తారా లేదా? ఒక సారీ చెప్పించి సమస్య ముగిసిపోయిందనడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. ఐఏఎస్‌ అధికారి బాలసుబ్రమణ్యం, ఆయన సెక్యూరిటీ గార్డుపై దుర్భాషలాడి దాడులకు పాల్పడిన తెలుగుదేశం పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో మరోసారి ఇలాంటి పరిణామాలు జరగకుండా చూడాలని హితబోధ చేశారు. 

    మీ గుట్టుబయటపడుతోందని సారీ చెప్పించారా?
    అధికారి బాలసుబ్రమణ్యం నోరు విప్పితే మీ గుట్టురట్టు అవుతోందని క్షమాపణ చెప్పించారా చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చురకంటించారు. నేను నోరు విప్పితే చాలా నిజాలు బయటకొస్తాయని బహిరంగంగా అధికారి మీడియా ముందు చెప్పారని స్పష్టం చేశారు. మీ రంగు బయటపడుతుందని సారీ చెప్పించారా లేక పశ్చ్యాతాపంతో చెప్పించారా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ నేతలు సెక్యూరిటీ గార్డుపై దాడి చేస్తున్నా ఖాకి యూనిఫాం వేసుకున్న డీఎస్పీ బాలరాజు కనీసం స్పందించకపోవడం బాధాకరమన్నారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు అండగా ఉంటేందుకు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చి న్యాయం కోసం పోరాడితే ఆయనపై నాన్‌ బెయిలబుల్‌ కేసు పెట్టారు మరి ట్రావెల్స్‌ మాఫియా దందా నడుపుతున్న తెలుగుదేశం పార్టీ ఎంపీ ఐఏఎస్‌ అధికారిపై దాడులకు పాల్పడితే ఈ రోజు వరకు కేసు లేదంటే ఎలాంటి సంకేతాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. రాష్ట్రంలో లాండ్‌ ఆర్డర్‌ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తక్షణమే టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
Back to Top