<strong>ఓరుగల్లులో వైఎస్సార్సీపీ ప్రచార హోరు</strong><strong>రాజన్న బిడ్డకు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు..</strong><br/>వరంగల్ః ఓరుగల్లులో వైఎస్సార్సీపీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ వరంగల్ లోక్ సభ సెగ్మెంట్లలో ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. గ్రామగ్రామన ప్రజలు వైఎస్ జగన్ కు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరిస్తూ, కరచాలనం చేస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజలు జననేతకు నీరాజనం పలికారు. వైఎస్ జగన్ వెంట వైఎస్సార్సీపీ అభ్యర్థి సూర్యప్రకాష్ , ఖమ్మం ఎంపీ, పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.<br/>పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్ గెలుపే లక్ష్యంగా వైఎస్ జగన్ జిల్లాలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తొలిరోజు పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుంచి జనగాం మీదుగా పాలకుర్తి చేరుకున్న వైఎస్ జగన్.. దద్దేపల్లి, కొండాపురం, ఒగులాపూర్, జఫర్ గడ్, దమ్మన్నపేట, వర్ధన్నపేట, నందనంల్లో రోడ్ షోలు నిర్వహించారు. వర్ధన్నపేట సమీపంలోని పొలాల్లోకి వెళ్లి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా వుండాలని, మంచి రోజులు వస్తాయని జగన్ రైతులకు భరోసా ఇచ్చారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నల్లా సూర్యప్రకాష్ ను గెలిపించాలని ఓటర్లను కోరారు.