నంద్యాల జిల్లా: జూపాడుబంగ్లా మండలంలో కేసీ కెనాల్ పరిధిలో సాగు చేసిన పంటలకు తక్షణమే సాగునీరు అందించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. శనివారం నందికొట్కూరులోని పార్టీ కార్యాలయంలో ఎస్ఈసీ సభ్యులు, జెడ్పిటిసి పోచా జగదీశ్వర రెడ్డి , వైయస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధికార ప్రతినిధి కేశవరెడ్డి నాగార్జున రెడ్డి , యువ నాయకుడు కోసిక తరుణ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. నందికొట్కూరు నియోజకవర్గం పరిధిలోని నందికొట్కూరు, పగిడ్యాల, జూపాడుబంగ్లా, పాములపాడు మండలాల వ్యాప్తంగా దాదాపు 20 వేల ఎకరాల కెసీ కెనాల్ ఆయకట్టు ఉందని వారు తెలిపారు. గత ఖరీఫ్ సీజన్లో తుఫాన్లు, గిట్టుబాటు ధరలు లేకపోవడం, వాతావరణం అనుకూలించకపోవడం వల్ల రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారని పేర్కొన్నారు. ఇప్పటికే రబీ సీజన్లో అరకొరగా సాగు చేసిన పంటలకైనా నష్టం వాటిల్లకుండా తక్షణమే సాగునీరు అందించాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యంగా మొక్కజొన్న, కంది, మినుము, వరి వంటి పంటలకు అత్యవసరంగా నీరు విడుదల చేయాలని కోరారు. గతంలో వైయస్ఆర్సీపీ ప్రభుత్వం ముచ్చుమర్రి లిఫ్ట్ నుంచి నీటిని విడుదల చేసి కెసీ కెనాల్ ఆయకట్టు రైతులను ఆదుకున్న విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. అయితే హంద్రీ–నీవాకు 40 టీఎంసీలు నీరు విడుదల చేశామని సంబరాలు చేసుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి , శ్రీశైలం ప్రాజెక్టు నీటితో కళకళలాడుతున్న సొంత జిల్లాలో ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా కెసీ కాలువకు నీటిని విడుదల చేయించలేకపోవడం సిగ్గుచేటని వారు మండిపడ్డారు. ఇంకా రెండు రోజులలో కేసీ కెనాల్కు సాగునీరు విడుదల చేయకుంటే రైతులు తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రైతులతో కలిసి భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వైయస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు.