శ్రీ సత్యసాయి జిల్లా: పెనుకొండ నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో దర్గా సర్కిల్ ప్రాంతంలో ‘కాఫీ విత్ క్యాడర్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కె.వి. ఉషశ్రీచరణ్ పాల్గొని వార్డు ప్రజలను ప్రత్యక్షంగా పలకరించారు. పెనుకొండ మునిసిపాలిటీ పరిధిలోని 06, 07వ వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జగనన్న ప్రభుత్వం ఉన్న సమయంలో పార్టీలకు అతీతంగా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించిందని గుర్తు చేశారు. ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పని చేసిన నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారేనని అన్నారు. రైతులకు ప్రతి ఏడాది రైతు భరోసా అందిస్తూ, పంట బీమా కల్పించి ఆర్థికంగా అండగా నిలిచిన ఏకైక నాయకుడు జగనన్నగారేనని ఆమె పేర్కొన్నారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను నిరాశపరిచిందని విమర్శించారు. ఈ విషయాలను ప్రతి గడపకు వెళ్లి ప్రజలకు వివరించారు. కార్యక్రమం భాగంగా వార్డు కమిటీ సమావేశం నిర్వహించి స్థానిక సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ మండల, పట్టణ ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, కోనాపురం గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.