విభజన బిల్లుపై చర్చకు గడువు పెంచండి

హైదరాబాద్ :

రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై ఎమ్మెల్యేలంతా తమ అభిప్రాయాలు చెప్పేందుకు గడువును మరింత పొడిగించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వై‌యస్ఆర్‌సీఎల్పీ నాయకురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ విజ్ఞప్తి చేశారు. సభ్యులందరి అభిప్రాయాలు వెల్లడించేందుకు ఫిబ్రవరి 28వరకు గడువు పొడిగించాలని కోరారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి బుధవారం‌ ఆమె లేఖ రాశారు. పార్టీ శాసనసభాపక్ష ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆ లేఖను విడుదల చేశారు.

‘సమైక్యాంధ్ర ప్రదేక్‌కే కట్టుబడి ఉన్న మా పార్టీ రాష్ట్రాన్ని యథావిధిగా కొనసాగించాలని, అసెంబ్లీలో ఓటింగ్ నిర్వహించాలని కోరుతూ రూ‌ల్ నంబర్ 77, 78ల కింద డిసెంబ‌ర్ 12న స్పీక‌ర్‌కు నోటీసు ఇచ్చింది. మా విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోకుండానే స్పీకర్ సభలో బిల్లుపై చర్చ ప్రారంభించారు. మా తీర్మానం తర్వాత చర్చ జరపాలని కోరినప్పటికీ పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో మా పార్టీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేల్లో ఏడుగురు సభ్యులు చర్చలో ‌పాల్గొని విభజనను వ్యతిరేకిస్తూ అభిప్రాయాలు తెలిపారు. మొత్తం 279 మంది ఎమ్మెల్యేలలో 85 మంది మాత్రమే సభలో మాట్లాడారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఫిబ్రవరి 28 వరకు గడువును పొడిగించండి’ అని శ్రీమతి విజయమ్మ ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.

తమ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడే కాంగ్రెస్, టీడీపీ శాసనసభ్యులు పదవులు వదిలిపెట్టి ఉంటే విభజన ప్రక్రియ ఇంత  దూరం వచ్చేదే కాదన్నారు.

Back to Top