కర్నూలు: రాష్ట్రంలో, దేశంలోనూ ఏ క్షణంలోనైనా ఎన్నికలు రావచ్చా. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి అభిప్రాయాన్ని చూస్తుంటే అది సంభవమని భావించాల్సి వస్తోంది. దేశంలోను, రాష్ట్రంలోను నెలకొన్న తాజా పరిస్థితులను గమనిస్తుంటే ఏ క్షణంలో అయినా ఎన్నికలు రావచ్చని ఆయన అంటున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో మంగళవారంనాడు మేకపాటి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె.నాగులాపురం సమీపంలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు మారెప్పతో కలిసి మేకపాటి విలేకరులతో మాట్లాడారు.ప్రస్తుత ప్రభుత్వ పనితీరుతో అటు దేశంలోను, ఇటు రాష్ట్రంలోను ప్రజలు విసిగెత్తి పోయారని మేకపాటి వ్యాఖ్యానించారు. మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను సక్రమంగా అమలు చేయడం ఒక్క జగన్తోనే సాధ్యం అవుతుందని ప్రజలంతా విశ్వసిస్తున్నారని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.