చంద్రబాబుకు ఆత్మగౌరవం ఇప్పుడు గుర్తొచ్చిందా?

గుంటూరు, 20 ఆగస్టు 2013:

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే చాలా సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించిన తర్వాత మాత్రమే ఆ అంశాన్ని లేవనెత్తాలని, ‌తరువాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలి తప్ప ఇప్పట్లో ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడం సబబు కాదనే మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి శాసనమండలిలో తెలిపారని వైయస్ఆర్‌ కాంగ్రెస్ నాయకుడు దాడి వీరభద్రరావు తెలిపారు. అప్పట్లో తామంతా కూడా సభలో ఉ‌న్నామని చెప్పారు. ఇందుకోసం రోశయ్య కమిటీని కూడా నియమించారన్నారు. కేంద్రంలో ప్రణబ్ కమిటీని వేస్తే.. ఇక్కడ రోశయ్య కమిటీని వేసినట్లు చెప్పారు. సమన్యాయం చేయాలంటూ గుంటూరులో శ్రీమతి వైయస్ విజయమ్మ‌ చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షా వేదిక నుంచి మంగళవారంనాడు దాడి వీరభద్రరావు మాట్లాడారు.

శాసనసభలో టిఆర్ఎస్ ‌సభ్యులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే తెలుగుతల్లిని తిట్టడానికి మీకు దమ్ము ఎక్కడుంది, మీకు బుద్ధి చెప్పే రోజులొస్తాయని హెచ్చరించిన ఏకైక ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డేనని దాడి అన్నారు. అయితే.. ఆయన చెప్పిన మాటలకు వక్రభాష్యం చెప్పి, శాసనసభలో తెలంగాణ కోసం తీర్మానం కూడా చేశారంటూ అవాస్తవాలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు.

‌హైదరాబాద్‌ ట్యాంక్బం‌డ్ మీద ఎన్టీఆర్ హయాంలో ఏర్పాటుచేసిన మహనీయుల విగ్రహాలను టిఆర్ఎస్ వారు కూల్చేస్తే, ఆ విగ్రహాలను చూడ్డానికి కూడా చంద్రబాబు వెళ్లలేకపోయారని, తెలుగువారి ఆత్మగౌరవానికి ఆయనిచ్చే మర్యాద, ఆత్మాభిమానం అదేనని దాడి ఎద్దేవా చేశారు. విగ్రహాలను చూడ్డానికి రమ్మంటే రాను పొమ్మన్నారని, తెలంగాణ వాళ్లు ఏమనుకుంటారో అన్నదే ఆయన భయపడిపోయిన చంద్రబాబుకు ఇవాళ ఆత్మగౌరవం గుర్తుకు వచ్చిందని దాని విమర్శించారు.

ఏనాడూ తెలంగాణ వారి చర్యలను, దాడులను ఖండించలేదని, విభజనకు ఏకపక్షంగా కారకుడైన చంద్రబాబు చర్యలను ఈ రాష్ట్రం హర్షించదని, ఆయన వల్ల రాష్ట్ర ప్రజలంతా చాలా నష్టపోవాల్సి వస్తోందని దాడి వీరభద్రరావు విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోనే ఉన్న ఉద్యోగావకాశాలను‌ సీమాంధ్ర యువత కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటులో ప్లకార్డు పట్టుకుని మరీ తాము సమైక్యాంధ్రకు మద్దతు పలుకుతున్నట్లు చెప్పి పోరాడిన ఏకైక తెలుగు నాయకుడు శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి మాత్రమేనని వీరభద్రరావు తెలిపారు.

Back to Top