బలిదానాలు వద్దు, తెలంగాణను నిలబెడదాం!


పుల్లూరు (ఆలంపూర్ నియోజకవర్గం) 22 నవంబర్ 2012 : బలిదానాలు వద్దనీ, దేవుడిచ్చిన ప్రాణంతో తెలంగాణను నిలబెడదామనీ షర్మిల పిలుపు ఇచ్చారు. ప్రాణాలు తీసుకోబోమంటూ తనకు మాట ఇవ్వాలని ఆమె కోరారు. తెలంగాణ అమరులకు ఆమె 'సలాం' చేశారు. 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్రలో భాగంగా తెలంగాణలోకి అడుగుపెట్టిన షర్మిల గురువారం సాయంత్రం పాలమూరు జిల్లా పుల్లూరు వద్ద ఒక భారీ బహిరంగసభలో ప్రసంగించారు. రాజన్నకూ, జగనన్నకూ తెలంగాణ అంటే ప్రాణమని, రెండు రూపాయల కిలో బియ్యం, పావలా వడ్డీ ఆరోగ్య శ్రీ వంటి పలు పథకాలను వైయస్ తెలంగాణ నుండే ప్రారంభించారనీ ఆమె గుర్తు చేశారు.
నా సలాం...
"ఉద్యమం కోసం తెలంగాణ బిడ్డలు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. వారందరికీ నా సలాం. వారందరూ నా అన్నదమ్ములే. కానీ దేవుడిచ్చిన ప్రాణంతో తెలంగాణను నిలబెడదాం. మీ చెల్లెలిగా, మీ అక్కగా మిమ్మల్నందరినీ ఒక మాట అడుగుతున్నా. మీ ప్రాణాలివ్వద్దండి! మనందరమూ కలిసి తెలంగాణను బ్రతికించుకుందాం. నా పాదం తాకిన పవిత్రమైన తెలంగాణ ధూళి మీద ఒట్టేసి చెబుతున్నా...జగనన్నకు, రాజన్నకు తెలంగాణ అంటే ప్రాణం. ప్రతి తెలంగాణ ఇంట్లో ఉన్న కన్నీళ్లను జగనన్న తుడుస్తాడు. ప్రతి తెలంగాణ ఇంటినీ సంతోషంతో నింపుతాడు." అని షర్మిల అన్నారు.
"రాజన్నపై అభిమానంతో, జగనన్న మీద ప్రేమతో తరలి వచ్చిన తెలంగాణవాసులందరికీ మీ రాజన్న కూతురు, మీ జగనన్న చెల్లెలు మనస్ఫూర్తిగా నమస్కరిస్తోంది" అంటూ షర్మిల తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత విద్యుత్తు ఫైలుపై తొలి సంతకం చేసిన వైయస్ 24 లక్షల ఉచిత విద్యుత్తు కనెక్షన్లలో 15 లక్షలు తెలంగాణకే ఇచ్చారని గుర్తు చేశారు. రాజశేఖర్ రెడ్డిగారికే కాదు,  నాన్నగారంటే తెలంగాణవాసులకూ అంతే ప్రేమ అన్నారు. నాన్నగారు చనిపోయినప్పుడు తట్టుకోలేక 660 గుండెలు ఆగిపోతే అందులో ఎక్కువ శాతం మంది తెలంగాణకు చెందినవారేనన్నారు. తెలంగాణవాసులంటే జగనన్నకు, రాజన్నకు ప్రాణమన్నారు. రాజశేఖర్ రెడ్డిగారు తెలంగాణను అభివృద్ధి పరచి వెనుకబాటుతనాన్ని తొలగించాలని 'జలయజ్ఞం'లో తెలంగాణకే పెద్దపీట వేశారన్నారు.
రాజశేఖర్ రెడ్డిగారు చనిపోయినప్పుడు తెలంగాణవారే ఎక్కువమంది చనిపోగా, వారినెవరినీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని షర్మిల విమర్శించారు.

వైయస్ పేరును ఉచ్చరించే అర్హత కూడా వీరికి లేదు ...

"చనిపోయినవారంతా కాంగ్రెస్‌వారే. ఆ కుటుంబాలన్నీ కాంగ్రెస్‌కు ఓటు వేసినవే. కానీ ఇప్పటివరకూ ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ కుటుంబాలను పట్టించుకున్న పాపాన పోలేదు. రాజశేఖర్ రెడ్డిగారు ఎంత పెద్ద మనసున్న నేతో తెలిసి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అవమానిస్తోంది. రాజశేఖర్ రెడ్డిగారి పేరుని ఎఫ్ఐఆర్‌లో దోషిగా చేర్చింది ఈ కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర్ రెడ్డిగారు అధికారమిస్తే, పదవులిస్తే అనుభవిస్తున్నవారు, ఇప్పుడున్న రాజ్యసభ సభ్యులు, మంత్రులకు ఆయన పేరును ఎఫ్ఐఆర్‌లో చేరుస్తుంటే చీమకుట్టినట్లైనా లేకపోయింది. ఆ మనిషి ఇప్పుడు లేడే, సమాధానం చెప్పుకోలేడేనని కూడా ఆలోచించకుండా కనీస మానవత్వం లేకుండా ఆయన పేరును ఎఫ్ఐఆర్‌లో  చేర్చారు. దీన్నంతా వేడుక చూసినట్లు చూశారు తప్ప ఒక్కరంటే ఒక్కరు కూడా గొంతెత్తి నిలదీయలేదు. రాజశేఖర్ రెడ్డిగారిని అభిమానిస్తున్నామంటున్నారే కానీ, పెదాలకు మాత్రమే పరిమితమయ్యే అభిమానం అభిమానమౌతుందా? రాజశేఖర్ రెడ్డిగారిని ఎఫ్ఐఆర్‌లో చేర్చిన ఈ కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా రాజశేఖర్ రెడ్డిగారు మళ్లీ మా మనిషేనంటున్నది. నిజానికి వారికి రాజశేఖర్ రెడ్డి పేరు ఉచ్చరించే అర్హత కూడా లేదు." అని షర్మిల మండిపడ్డారు.
"జగనన్న నాన్నగారు పోయినప్పుడు రాష్ట్రప్రజలంతా అనాథలై పోయారని తండ్రిలాగే వాళ్ల కష్టాలలో పాలుపంచుకున్నాడు. చేనేతలు, విద్యార్థుల వంటి వివిధ వర్గాల పక్షాన నిలచి పోరాటాలు చేశాడు. మీ మనసుల్లో జగనన్న స్థానం సంపాదించుకుంటే తమ దుకాణాలు మూసేసుకోవాల్సి వస్తుందని కాంగ్రెస్, టిడిపి కలిసిపోయి కుట్ర పన్ని జగనన్నను బెయిలు కూడా రానివ్వకుండా జైలు పాలు చేశారు" అని ఆమె ఆరోపించారు.

నిజం చెబితే చంద్రబాబు తల వేయిముక్కలు!
"చంద్రబాబు ఇప్పుడు తన పాదయాత్రలో పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నాడు.నిజం చెబితే తల వెయ్యి ముక్కలౌతుందని చంద్రబాబుకు ఒక మునీశ్వరుడి శాపం ఉందని నాన్నగారు చెప్పిన ఒక కథ గుర్తుకు వచ్చింది. ఫీ-రీ ఇంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు చేస్తాడట చంద్రబాబు. అవన్నీ రాజశేఖర్ రెడ్డిగారు ఇప్పటికే చేసి చూపించారు. రాజన్నకూ, జగనన్నకూ ఉన్నది విశ్వసనీయత. అందుకే  ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీని వదలి జగనన్న పక్షం చేరుతున్నారంటే అది జగనన్న విశ్వసనీయత" అని షర్మిల అన్నారు.
"ఈ ప్రభుత్వ, అసమర్థ ప్రధాన ప్రతిపక్షాల ఘోర వైఫల్యాలను, కుమ్మక్కై జగనన్నకు వీరు చేస్తున్న అన్యాయాలను దేవుడు చూస్తున్నాడు. ఉదయించే సూర్యుడిని ఎవ్వరూ ఆపలేనట్లే జగనన్నను ఎవ్వరూ ఆపలేరు. జగనన్న బయటకు వచ్చి రాజన్నరాజ్యం దిశగా నడిపిస్తాడు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచండి!" అని షర్మిల కోరారు.
అంతకు ముందు ప్రసంగించిన వైయస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తాను షర్మిలను మీ చేతుల్లో పెడుతున్నానంటూ అశేష జనావళిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కొండా సురేఖ, జిట్టా బాలకృష్ణారెడ్డి, కె.కె.మహేందర్ రెడ్డి, రవీంద్ర నాయక్, జూపూడి ప్రభాకర్ రావు తదితరులు సభలో పాల్గొన్నారు.

Back to Top