<strong>ప్రజాక్షేత్రంలో ఎన్నికలు ఎదుర్కోలేమనే భయమా..?</strong><strong>రాజీనామాలు చేస్తే మోడీ మీ అవినీతిని బయటపెడతారనా?</strong><strong>ప్రజలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలి</strong><strong>హోదాపై చిత్తశుద్ధి ఉంటే వైయస్ఆర్ సీపీతో కలిసిరావాలి</strong><strong>వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి</strong><br/><strong>విజయవాడ</strong>: ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరుగార్చడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. పార్లమెంట్ సభ్యులతో రాజీనామాలు చేయించి కేంద్రానికి తప్పనిసరి పరిస్థితులు సృష్టిద్దామని వైయస్ఆర్ సీపీ చెబుతుంటే.. చంద్రబాబు రాజీనామాలు ఎందుకని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. హోదా సాధించాలనే చిత్తశుద్ధి బాబులో ఏ కోశనా లేదన్నారు. ఎంపీలతో రాజీనామా చేయిస్తానని వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్ ప్రకటిస్తే... చంద్రబాబు తన పాట్నర్ పవన్తో ఒరిగేదేమిటని చెప్పిస్తున్నారన్నారు. ప్రత్యేక హోదాపై టీడీపీ అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిపై పార్థసారధి మండిపడ్డారు. శుక్రవారం విజయవాడలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. <br/><strong>బాబు యూటర్న్కు వైయస్ జగన్ కారణం..</strong><br/>ప్రత్యేక హోదా ఆంధ్రరాష్ట్రానికి సంజీవని అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పోరాడుతుందని పార్థసారధి గుర్తు చేశారు. హోదా అంటే జైల్లో పెడతానని బెదిరించిన చంద్రబాబు సైతం హోదా అని యూటర్న్ తీసుకున్నారంటే దానికి కారణం ప్రతిపక్ష నేత వైయస్ జగన్ అన్నారు. హోదా కోసం ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని చెప్పుకుంటున్న చంద్రబాబు ఎంపీలతో రాజీనామాలకు ఎందుకు సిద్ధపడడం లేదని ప్రశ్నించారు. ఏం సాధిద్దామని పార్లమెంట్లో కొనసాగుతారని నిలదీశారు. రాష్ట్ర ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వాలని, ‘మా ఎంపీలు రాజీనామా చేయరు.. ఎన్నికల్లో ప్రజలు విధించే శిక్షకు కట్టుబడిఉంటామని చెప్పాలన్నారు. రాజీనామా చేయడానికి ఎందుకు భయపడుతున్నారో కూడా చెప్పాలన్నారు. నాలుగేళ్లు నిధులు స్వాహా చేసిన విధానాన్ని కేంద్రం బయటపెడుతుందనా..? లేక తప్పుడు యూసీలతో మీరు జేబులు నింపుకున్న విధానాన్ని ఎంక్వైరీ వేసి ప్రజల ఎదుట దోషిగా నిలబెడుతుందని భయపడుతున్నారా అని ప్రశ్నించారు. లేక ఓటుకు కోట్ల కేసు, కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై చర్యలు తీసుకుంటారని జంకుతున్నారా బాబూ అని విరుచుకుపడ్డారు. <br/><strong>ఇంటికే పరిమితం చేస్తారనే భయంతో...</strong><br/>ప్రజలు టీడీపీని ఇంటికే పరిమితం చేస్తారనే భయంతో చంద్రబాబు రాజీనామాలకు సిద్ధపడడం లేదని పార్థసారధి విమర్శించారు. ప్రజా క్షేత్రంలో ఎన్నికలు ఎదుర్కోలేమనే భయంతో చంద్రబాబు వెనక్కు తగ్గుతున్నారన్నారు. తెలంగాణ ప్రాంత వాసులు ఏ విధంగా ఉద్యమాలు చేసి రాష్ట్రం సాధించుకున్నారో ఆ విధమైన రాజీనామాల ఉద్యమం జరగాలన్నారు. కానీ బాబు రాజీనామాలతో ఒరిగిందేమీటీ అని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా సాధించాలనే చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా మోసం ఆపాలని చంద్రబాబుకు సూచించారు. ప్రజలు, ప్రతిపక్షంపై అభియోగాలు మోపి సమయం వృథా చేయకుండా వైయస్ఆర్ సీపీతో రాజీనామాలకు కలిసి రావాలన్నారు. లేని పక్షంలో ఎందుకు భయపడుతున్నారో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు.