దెందులూరు (పశ్చిమగోదావరి) : పశ్చిమ గోదావరి జిల్లా లో మహిళా సర్పంచ్ మీద టీడీపీ నాయకులు దౌర్జన్యం చేశారు. దెందులూరు మండలం మేదినరావు గ్రామంలో వైఎస్సార్సీపీ సర్పంచ్ సీతారావమ్మ నీరు చెట్టు పథకం పనుల్ని పరిశీలించారు. అక్కడ ఆగిరిగుంట చెరువు తవ్వే కార్యక్రమాన్ని సర్పంచ్ కు తెలియ చేయకుండా టీడీపీ నేతలతో కలిసి అధికారులు చేయిస్తున్నారు. ఈ విషయం మీద సర్పంచ్ అధికారుల్ని ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ఆమె మీద చేయి చేసుకొనేందుకు ప్రయత్నించటంతో భర్త వెంకటేశ్వర రావు అడ్డుకొన్నారు. ఆయన మీద కూడా దాడికి దిగారు. దీంతో సర్పంచ్ సీతారావమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.