చంద్ర‌బాబును న‌మ్మితే ప్ర‌జ‌ల జీవితాలు గోవిందా..గోవిందా..!

చోడ‌వ‌రం ఎన్నిక‌ల ప్ర‌చారంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 

జ‌గ‌న్‌కు ఓటేస్తే ప‌థ‌కాల‌న్నీ కొన‌సాగింపు

పొర‌పాటున బాబుకు ఓటేస్తే ప‌థ‌కాల‌న్నీ ముగింపే

చంద్ర‌బాబుకు ఓటేస్తే మ‌ళ్లీ మోస‌పోవ‌డ‌మే

మ‌ళ్లీ మోసం చేసేందుకు సాధ్యం కానీ హామీల‌తో వ‌స్తున్నారు

బాబును నమ్మితే కొండచిలువ నోట్లో తలపెట్టినట్టే..
 
ఈ ఎన్నిక‌లు వ‌చ్చే ఐదేళ్ల భ‌విష్య‌త్‌ను నిర్ణ‌యించేవి

పేద‌ల వ్య‌తిరేకుల‌ను ఓడించేందుకు మీరంతా సిద్ధ‌మేనా? :  సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

 జనసంద్రంగా మారిన చోడ‌వ‌రం కొత్తూరు జంక్షన్‌

విశాఖ‌:  చంద్ర‌బాబును న‌మ్మితే ప్ర‌జ‌ల జీవితాలు గోవిందా..గోవిందా..! అని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు.  సూపర్ 6.. సూపర్‌ 7.. బెంజ్ కార్ హామీలు నమ్మితే.. కొండచిలువ నోట్లో తలపెట్టినట్టే.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్య‌మంత్రి హెచ్చరించారు. బాబు అధికారంలోకి వస్తే వర్షాలు రావు.. రిజర్వాయర్లు ఖాళీ అవుతాయని వ్యాఖ్యానించారు. వైయ‌స్ జగన్ కు ఓటేస్తే పథకాలు అన్నీ కొనసాగింపు.. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు అన్నీ ముగింపు అని వార్నింగ్ ఇచ్చారు. ఇది చంద్రబాబు గత పాలన చెప్పిన సత్యం.. 

బిందెడు పన్నీరు తీసుకెళ్లి బూడిదలో పోస్తే ఏమౌతుంది.. గోవిందా.. గోవిందా..!! మనం చెప్పే గోవిందా.. గోవిందా..!! చంద్ర బాబును నమ్మితే ఎలా మోసపోతామో చెప్పే గోవిందా.. గోవిందా..!! వేర్వేరు అన్నారు.. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు దొరికిపోవడంతో ఉమ్మడి రాజధాని హైదరాబాద్ గోవిందా.. గోవిందా..!ఢిల్లీలో రాజీపడ్డంతో ప్రత్యేక హోదా.. విభజన హామీలు గోవిందా.! అన్ని హంగులు వున్న వైజాగ్ వదిలేసిన చంద్రబాబు.. గ్రాఫిక్స్ రాజధాని చూపించాడు.. అది కూడా గోవిందా..! అంటూ ఎద్దేవా చేశారు.

 చంద్రబాబు ప్రవేశ పెట్టిన ఒక్క స్కీమ్ ప్రజల్లో లేవు .. దోచుకున్న డబ్బులు తో ఓటుకు 2 వేలు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధం అయ్యారు. ఓటుకు రూ.3 వేల నుంచి రూ. 5 వేలు ఇవ్వడానికి కూడా సిద్ధం అయ్యారు. చంద్రబాబు ఓటుకు డబ్బులు ఇస్తే తీసుకోండి.. అది మన దగ్గర దోచేసిందే.. ఓటుకు డబ్బులు తీసుకుని.. ఓటు వేసేటప్పుడు మాత్రం ఆలోచించి ఓటు వేయండి.. వైయ‌స్ జగన్ అధికారంలోకి వస్తేనే పథకాలు అన్నీ వస్తాయి అని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా అనకాపల్లి జిల్లా చోడవరంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొన్నారు. జనసంద్రంగా మారిన కొత్తూరు జంక్షన్‌లో ప్రజలను ఉద్దేశించి వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడారు. 

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఏమ‌న్నారంటే..

 మన చోడవరం సిద్ధమేనా.. ఇంతటి మండుటెండలో కూడా ఇంతటి అభిమానంతో ఈ సభకు వచ్చి ఆత్మీయతలను పంచిపెడుతున్న నా ప్రతి అక్కకూ, నా ప్రతి చెల్లెమ్మకూ, నా ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ, నా ప్రతి సోదరుడికీ, స్నేహితుడికీ పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు.
 
పేద కుటుంబాల భవిష్యత్తును మార్చే ఎన్నికలివి
కేవలం మరో రెండు వారాల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగనుంది. ఈ జరగబోతున్న ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. మనం వేసే ఓటుతో రాబోయే 5 ఏళ్లలో మీ ఇంటింటి అభివృద్ధిని, పేద కుటుంబాల భవిష్యత్తును, పేదల తలరాతలను నిర్ణయించబోయే ఎన్నికలు ఇవి అని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. 

బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..
ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవటమే. 
ఇదీ చంద్రబాబు గత చరిత్ర చెబుతున్న సత్యం. ఇదే మళ్లీ మోసం చేసేందుకు సాధ్యం కాని హామీలతో ఇప్పుడు చంద్రబాబు మేనిఫెస్టో ద్వారా చెబుతున్న సత్యం. ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగమని కోరుతున్నాను. బాబును నమ్మటం అంటే కొండచిలువ నోట్లో తలకాయపెట్టినట్లే అన్నట్టుగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. 

పేదల వ్యతిరేకులను ఓడించేందుకు మీరు సిద్ధమా ?
మరి మన చోడవరంలో మీరంతా మీ ఇంటింటి భవిష్యత్తును రక్షించుకునేందుకు, ఆ పేదల వ్యతిరేకులను ఓడించేందుకు మీరంతా సిద్ధమేనా?.. 
పేదలకు జై కొడుతున్న ఓ అవ్వ, ఓ అక్క, ఓ అన్నా.. మీరంతా చెప్పాలి.. ఓ బిందెడు పన్నీరు తీసుకెళ్లి బూడిదలో పోస్తే ఏమవుతుంది? ఆ బిందెడు పన్నీరు కాస్తా గోవిందా గోవింద.. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కూడా ఆ గోవిందా గోవింద గురించే. ఈ తిరుపతిలో ఏడుకొండలుపై ఉన్న స్వామికి చెప్పే గోవింద నామం కాదు ఈ గోవిందా గోవింద ఏంటో తెలుసా? మన చంద్రబాబును నమ్మితే ప్రజల జీవితాలు ఏమవుతాయో, గతంలో ప్రజలు ఎలా చెడిపోయారో, ఆయన మోసానికి ప్రజల బతుకులు ఎలా అతలాకుతలం అయ్యాయో చెప్పే గోవిందా గోవింద. 

మరి చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రజల్ని నమ్మించి ఏమేమి గోవిందా గోవింద చేశాడో చూద్దామా? ఒకసారి గుర్తుకు తెచ్చుకుందామా? సిద్ధమేనా?
ఇది గుర్తుందా? అక్కా, అన్నా ఇది గుర్తుందా? (పాంప్లెట్ చూపిస్తూ) 2014లో ముఖ్యమైన హామీలంటూ ఇదే పెద్దమనిషి చంద్రబాబు నాయుడు గారు తాను స్వయానా సంతకం పెట్టి ఇప్పటి కూటమిలో ఉన్న ఈ ముగ్గురు వ్యక్తులతో వాళ్ల ఫొటోలు పెట్టి ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే మోడీగారి ఫొటోతో తాను స్వయంగా సంతకం పెట్టి ప్రతి ఇంటికీ పంపించిన ఈ పాంప్లెట్ మీ అందరికీ గుర్తుందా? చంద్రబాబు సంతకం కనిపిస్తోందా? 

చంద్రబాబును నమ్మి ఓటేస్తే.... 
ఇది 2014 ఎన్నికలకు ముందు జాబు రావాలంటే బాబు రావాలన్నాడు. ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఈ చంద్రబాబు వచ్చే దాకా.. ఎన్నికలు వచ్చేదాకా... ఎన్నికలు అయిపోయేదాకా ఈ చంద్రబాబు అన్న మాటలేమిటి? జాబు రావాలంటే బాబు రావాలి. ఒకవేళ జాబు ఇవ్వకపోతే ఏమన్నాడు. ఇంటింటికీ రూ.2వేల నిరుద్యోగభృతి అన్నాడా లేదా? మరి 5 ఏళ్లు, ప్రతి ఇంటికీ నెలనెలా రూ.2 వేలు అంటే 60 నెలల్లో రూ.1.20 లక్షలు ఏమైంది? నమ్మిన ఆ పిల్లలు, ఓటేసిన ఆ తల్లిదండ్రులూ ఏమైంది? చంద్రబాబును నమ్మి ఓటేశారు ఏమైంది? గోవిందా గోవింద. 

ముఖ్యమైన హామీలంటూ ఇంకా ముందుకు పోదామా ఆయన ఏం చెప్పాడో? రూ.87,612 కోట్లు రైతు రుణాల మాఫీ అని కూడా మొదటి సంతకంతోనే మాఫీ అన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తానన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం రావాలి అంటే బాబు రావాలి అన్నాడు. నా రైతన్నలు 2014లో ఈ మాటలు నమ్మి చంద్రబాబుకు ఓటు వేసి గెలిపించారు. ఏమైంది అక్కా తర్వాత. ఏమైందన్నా తర్వాత. గోవిందా గోవింద. 
ఇంకా ముందుకు పోదామా.. ముఖ్యమైన హామీలంటూ రూ.14,205 కోట్లు డ్వాక్రా సంఘాలకు సంబంధించిన రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు ఇదే పెద్దమనిషి చంద్రబాబు. ఎన్నికలు అయ్యాయి. నా అక్కచెల్లెమ్మలు చంద్రబాబు నాయుడుని నమ్మారు. అప్పట్లో ఓటు వేశారు. ఓటు వేసిన తర్వాత ఏమైంది? గోవిందా గోవింద. 

అప్పటి దాకా ఇస్తున్న సున్నా వడ్డీ కూడా గోవిందా గోవింద. మళ్లీ ముందుకు పోదామా.. ఇంకా ముఖ్యమైన హామీలు. ఇదే చంద్రబాబు ముఖ్యమైన హామీలు గుర్తున్నాయా అన్నా. ఇంకా ఏం రాశాడో తెలుసా? ఆడబిడ్డ పుడితే మీ బ్యాంకు అకౌంట్లలో రూ.25 వేలు డిపాజిట్ చేస్తామన్నాడు ఎన్నికలకు ముందు. ఎన్నికలు అయ్యాయి. నా అక్కచెల్లెమ్మలు వాళ్ల కుటుంబాలన్నీ చంద్రబాబును నమ్మారు. ఓటు వేశారు. ఓటు వేసిన తర్వాత ఏమైంది? ఒక్క రూపాయి అయినా మీ బ్యాంకు అకౌంట్లలో వేశాడా? మరి ఏమైంది? అన్నా, తమ్ముడూ ఏమైంది? గోవిందా.. గోవింద. 

మహాలక్ష్మి పథకం కింద దేవతల పేరు పెట్టి కూడా మోసం చేసిన వ్యక్తి ఈ చంద్రబాబు ఇదే పెద్దమనిషి చంద్రబాబు నాయుడు గారు2014లో ముఖ్యమైన హామీలంటూ ఇచ్చిన ఇంకొక హామీ. ప్రతి పేదవాడికీ 3 సెంట్ల స్థలం. కట్టుకునేందుకు పక్కా ఇళ్లు అన్నాడు. నా అక్కచెల్లెమ్మలు, కుటుంబాలు ఈ మాట నమ్మారు. నమ్మి 2014 ఎన్నికల్లో ఇదే పెద్దమనిషి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే ఏమైందక్కా తర్వాత. ఏమైందన్నా తర్వాత. గోవిందా.. గోవింద. 
కనీసం ఏ పేదవాడికైనా ఒక్కటంటే ఒక్క సెంటు స్థలమైనాగానీ కట్టుకునేందుకు ఇంటికి ఇచ్చాడా? అని అడుగుతున్నాను. 

హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సింది బాబు వచ్చాక ఏమైంది? ఓటుకు కోట్లు కేసులో అడ్డగోలుగా దొరికిపోయి మన ఉమ్మడి రాజధాని గోవిందా.. గోవింద. బాబును నమ్మి ఓటు వేసినందుకు ఢిల్లీతో రాజీపడి ప్రత్యేక హోదాను ఏం చేశాడు. దాన్నీ గోవిందా.. గోవింద. గోవిందా.. గోవింద. పైగా ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినియా అని చెప్పి బరితెగించి కూడా మాట్లాడాడు ఈ పెద్దమనిషి. ప్రత్యేక ప్యాకేజీ గోవిందా. విభజన హామీలూ గోవిందా. సింగపూర్ కు మించిన రాజధాని అన్నాడు ఇదే పెద్దమనిషి చంద్రబాబు. పక్కనే అన్ని హంగులతో కనిపిస్తున్న వైజాగ్ ను వదిలేశాడు. సింగపూర్ కు మించి రాజధాని అన్న ఈ వ్యక్తి మన విశాఖపట్నం అన్ని హంగులతో కనిపిస్తున్నా వదిలేశాడు. పోనీ ఆ గ్రాఫిక్స్ రాజధాని ఏమైంది అంటే అదికూడా గోవిందా.. గోవింద. 

    
బాబును నమ్మితే కొండ చిలువ నోట్లో తలపెట్టినట్టే.
ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు. మరి మీ చోడవరంలో ఏమైనా కనిపిస్తోందా అని అడుగుతున్నాను. అది కూడా గోవిందా.. గోవింద. అందరూ ఆలోచన చేయమని అడుగుతున్నాను. ప్రతి ఒక్కర్నీ ఆలోచన చేయమని అడుగుతున్నాను. మరి 2014లో ముఖ్యమైన హామీలంటూ మీ ప్రతి ఇంటికీ ఈయన సంతకం పెట్టి, వీళ్ల ముగ్గురి ఫొటోలతో ప్రతి ఇంటికీ పంపించిన చంద్రబాబు ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చాడా? మరి ఈ పెద్దమనిషిని నమ్మవచ్చా అని అడుగుతున్నాను. నమ్మవచ్చా అన్నా, తమ్ముడూ, అమ్మా.. నమ్మవచ్చా? 
సూపర్ సిక్స్ అంటున్నాడు నమ్మవచ్చా? సూపర్ సెవెన్ అంటున్నాడు నమ్మవచ్చా? ఇంటింటికీ కేజీ బంగారం అంటున్నాడు, బెంజ్ కారు అంటున్నాడు నమ్మవచ్చా? నమ్మితే ఏమవుతుంది? కొండచిలువ నోట్లో తలకాయ పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. 

బాబు అధికారంలోకి వస్తే పథకాలు గోవిందా.. వర్షాలు గోవిందా...
బాబు అధికారంలోకి వస్తే వర్షాలు గోవిందా. బాబు కుర్చీ ఎక్కితే రిజర్వాయర్లలో నీళ్లు గోవిందా. బాబు మాటలు నమ్మితే అంతే గోవిందా.. గోవింద. అందరూ ఆలోచన చేయమని కోరుతున్నాను. మీ అందరితో ఆలోచించండి అని మరొక్కమారు కోరుతున్నాను. మరో ముఖ్యమైన విషయం మీ అందరి దృష్టికీ తీసుకొస్తున్నాను. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశానంటాడు. ఆయన 3 సార్లు సీఎంగా చేశాను అని కూడా చెబుతాడు. మరి ఈ పెద్దమనిషి చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటైనా గుర్తుకు వస్తుందా? అని అడుగుతున్నాను. ఆయన చేసిన స్కీము ఒక్కటంటే ఒక్కటైనా గుర్తుకు వస్తుందా? అని అడుగుతున్నాను. 

దోచుకుని.. పంచుకునే దుష్ట చతుష్టయం. 
మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఈ వ్యక్తి, ఏ పేదవాడికీ ఏ మంచీ చేయని ఈ వ్యక్తి. తన హయాంలో తాను చేసిందేమిటి అంటే జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే చంద్రబాబుకు ఇంత, దత్తపుత్రుడికి ఇంత, ఓ రామోజీ ఈనాడుకు ఇంత, ఆంధ్రజ్యోతికి, టీవీ5కి ఇంత అని వీళ్లంతా కలిసి రాష్ట్రాన్ని దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం.. ఇదీ చంద్రబాబు గారు తన 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా 3 సార్లు సీఎంగా ఉంటూ తాను చేసిన పని ఇదీ. ప్రతి ఒక్కర్నీ ఆలోచన చేయమని అడుగుతున్నా. చంద్రబాబు దగ్గర అలా దోచుకున్న సొమ్ము చాలా ఉంది. అక్కా, అన్నా, తమ్ముడూ నేను చెప్పేది బాగా వినండి. 

చంద్రబాబు దోచుకున్న డబ్బు ఇస్తే వద్దనొద్దు..
మీ బిడ్డ ఈరోజు బటన్ నొక్కితే రూ.2.70 లక్షల కోట్లు, నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా వెళ్లిపోతోంది. కానీ ఇదే పెద్దమనిషి చంద్రబాబు నాయుడుగారి హయాంలో ఆయన చేసిందేమిటి అంటే అక్కచెల్లెమ్మల కుటుంబాలకు డబ్బు ఇవ్వలేదు. ఆ డబ్బంతా ఆయన దోచుకుని పంచుకున్నారు. ఆ దోచుకుని పంచుకున్న డబ్బుల్లో చాలా డబ్బులు చంద్రబాబు దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈసారి ఎన్నికలు వచ్చే సరికే ఏం చేస్తాడు? ఆ డబ్బులోంచి మీలో ప్రతి ఒక్కరికీ ఓటుకు రూ.2వేలు అంటాడు. ఓటుకు రూ.3 వేలు అంటాడు. కొన్ని కొన్ని చోట్ల ఓటుకు రూ.4 వేలు, రూ.5 వేలు అంటాడు. ఇక్కడే మీ అందరికీ చెబుతున్నాను. చంద్రబాబు డబ్బు ఇస్తే వద్దు అనొద్దండి. డబ్బు తీసుకోండి. ఎందుకంటే ఆ డబ్బు మనదే. మనల్ని దోచేసిన డబ్బే అదంతా. కాబట్టి వద్దు అనకండి. ఆ డబ్బు తీసుకోండి. కానీ తీసుకున్న తర్వాత ఓటు వేసే ముందు మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. 

ఎవరి వల్ల మనకు మంచి జరిగింది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి. ఎవరు అధికారంలో ఉంటే మనకు మంచి జరుగుతుంది? కొనసాగుతుంది అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నాను. మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూర్చొని, ఆలోచన చేసి నిర్ణయం తీసుకుని ఆ తర్వతనే ఓటు వేయండి అని కోరుతున్నాను.

మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్లీ ఓ పెంచిన అమ్మ ఒడి, మళ్లీ ఓ చేయూత, మళ్లీ ఓ సున్నా వడ్డీ, మళ్లీ ఇళ్ల స్థలాలు, మళ్లీ ఇల్లు కట్టించే కార్యక్రమం. మీ జగన్ అధికారంలో ఉంటేనే ఓ కాపు నేస్తం, ఓ ఈబీసీ నేస్తం, మళ్లీ ఓ వాహనమిత్ర, మళ్లీ ఓ నేతన్న నేస్తం, మళ్లీ ఓ మత్స్యకార భరోసా, మళ్లీ ఓ తోడు, చేదోడు, లా నేస్తం.. ఈ పథకాలన్నీ రావాలి అంటే మళ్లీ మీ జగన్ అధికారంలో ఉంటేనే పూర్తి ఫీజులతో విద్యాదీవెన, వసతి దీవెన, నా అక్కచెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఓ కల్యాణమస్తు, షాదీ తోఫా, రైతన్నలకు మంచి జరుగుతుంది. రైతన్నలకు సున్నా వడ్డీకే పంట రుణాలు, ఉచిత పంటల బీమా, ఏ సీజన్ లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే పంట నష్టపరిహారం చెల్లించే ఇన్ పుట్ సబ్సిడీ, రైతన్నలకు పెంచిన పెట్టుబడి సాయంగా రైతు భరోసా. చెయ్యి పట్టుకుని నడిపిస్తున్న ఆర్బీకే వ్యవస్థలు. ఇవన్నీ జరగాలంటే, కొనసాగాలంటే మళ్లీ మీ జగన్ అధికారంలో ఉంటేనే జరుగుతాయి. మీ జగన్ అధికారంలో ఉంటేనే ఒక విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఓ ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే విలేజ్ క్లినిక్, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్, ఇంటింటికీ ఆరోగ్య సురక్ష.. ఇవన్నీ కూడా మీ జగన్ అధికారంలో ఉంటేనే జరుగుతాయన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని అడుగుతున్నాను. 

మీ జగన్ అధికారంలో ఉంటేనే ఇంటికే వచ్చే రూ.3 వేల పెన్షన్, మళ్లీ పెంచనున్న పెన్షన్, ఇంటి ముంగిటకే రేషన్, పౌర సేవలన్నీ, పథకాలన్నీ ఇంటికే వచ్చే కార్యక్రమం మళ్లీ మీ జగన్ ముఖ్యమంత్రి అయితేనే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడూ జరగని విధంగా నేను చెప్పిన ప్రతి స్కీమూ, పథకం కూడా గతంలో ఎప్పుడూ జరగని విధంగా జరుగుతున్నాయి. ఏ నెలలో ఏ పథకం మీకు వస్తుందన్నది కూడా సంవత్సరం ముందే క్యాలెండర్ ఇచ్చి మరీ ఆ నెల తప్పకుండా ఆ పథకాలన్నీ మీ ఇంటికే, మీ చేతికే, మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్తున్నాయి. ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా నా అక్కచెల్లెమ్మల ఇంటికే ఈరోజు ఈ పథకాలన్నీ వస్తున్నాయంటే ఆలోచన చేయమని అడుగుతున్నాను. గతానికి భిన్నంగా జరుగుతున్న ఈ పాలనను ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతున్నాను. మరి మీరంతా కూడా సిద్ధమేనా? అని అడుగుతున్నాను. 

పేదవాడి భవిష్యత్తు మారాలంటే ఫ్యాను గుర్తుపై ఓట్లేసి గెలిపించండి.
వాలంటీర్లు మళ్లీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, అవి ఇంటికే రావాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, మన బడులు బాగుపడాలన్నా, మనవ్యవసాయం, మన హాస్పిటల్లు మెరుగుపడాలన్నా.. ఇవన్నీ జరగాలంటే రెండు బటన్లు ఫ్యాను మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు. సిద్ధమేనా?..

చోడవరంలో మార్పు చూడండి.
ఈరోజు ఇదే చోడవరంలో కూడా మీకు మార్పు కనిపిస్తుంది. ఈ చోడవరం షుగర్ ఫ్యాక్టరీ గతంలో చంద్రబాబు హయాంలో ఎలా ఉండేది? ఇప్పుడు మీ బిడ్డ వచ్చిన తర్వాత మార్పులేమిటో మీరంతా చూస్తున్నారు కదా. మంచి చేస్తున్న మీ ప్రభుత్వానికి తోడుగా, అండగా ఉంటూ ఫ్యాను గుర్తు మీద రెండు ఓట్లు వేయమని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను.  

మన గుర్తు ఫ్యాను.. అక్కా మన గుర్తు, అవ్వా మనగుర్తు అవ్వా ఇది. ఇక్కడ అవ్వా బ్లూ చీర కట్టుకున్నఅవ్వా ఫ్యాను. అక్కా మన గుర్తు ఫ్యాను, అవ్వా మన గుర్తు ఫ్యాను. అక్కడున్న అన్నలూ మన గుర్తు ఫ్యాను. తమ్ముళ్లూ మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాను ఎక్కడుండాలి? ఇంట్లో ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడుండాలి? ఇంటి బయట ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుండాలి? సింక్ లో ఉండాలి. అందరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతూ, ఫ్యాను గుర్తుపై కచ్చితంగా రెండు ఓట్లు వేయాలని కోరుతూ మీ బిడ్డ సెలవు తీసుకుంటున్నాడు. అక్కా మన గుర్తు ఫ్యాను అక్కా. అక్కడ బిల్డింగ్ ల మీద ఉన్న అక్కలూ మన గుర్తు ఫ్యానక్కా. అన్నా ఫ్యాను అన్నా. ఫ్యాను అమ్మా అని తెలియజేస్తూ సీఎం శ్రీ వైయస్.జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.

Back to Top