తొక్కిస‌లాట ఘటనకు టీటీడీనే బాధ్యత వహించాలి

టీటీడీ మాజీ చైర్మ‌న్‌, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

అమరావతి: తిరుపతిలో తొక్కిసలాట ఘ‌ట‌న‌కు టీటీడీ బాధ్య‌త వ‌హించాల‌ని మాజీ చైర్మ‌న్‌, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండు చేశారు. అధికారుల నిర్ల‌క్ష్యం కార‌ణంగా ఆరుగురి మృతి చెందడంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కోరారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ..తిరుప‌తి ఘటన అత్యంత దారుణమన్నారు. భ‌క్తుల మ‌ర‌ణంపై టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు మాటలు ఆందోళన కల్గించాయని చెప్పారు. లక్షలమంది భక్తులు వస్తారని తెలిసి కూడా సరైన ఏర్పాట్లు చేయలేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కనీసం సమీక్షలైనా నిర్వహించారా? అని ప్ర‌శ్నించారు. వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం.. కాబట్టే ఏ ప్రమాదం జరగలేదు.  నేనే స్వయంగా వెళ్లి క్యూ లైన్లనను పరిశీలించేవాడిని. సమస్యలు ఎక్కడ ఉన్నాయో స్వయంగా తెలుసుకునేవాడిని. ఇప్పుడు ఆ పరిస్థితి కనపడలేదు. అధికారులతో‌ టీటీడీ సరిగా పనిచేయించలేదు. మృతుల కుటుంబాలను టీటీడీ ఆదుకోవాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాల‌ని వైవీ సుబ్బారెడ్డి కోరారు.  

Back to Top