తిరుమలలో విజిలెన్స్ వ్య‌వ‌స్థ‌ నిద్ర‌పోతుందా?

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి, మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి ఫైర్‌ 

తిరుప‌తి: తిరుమ‌ల ప‌విత్రత‌ను కాపాడ‌టంతో టీటీడీ పాల‌క మండ‌లి పూర్తిగా వైఫ‌ల్యం చెందింద‌ని టీటీడీ మాజీ చైర్మ‌న్‌, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి భూమన కరుణాకరరెడ్డి మండిప‌డ్డారు. తిరుమ‌ల‌కు నిషేధిత తినుబండారాలతో భ‌క్తులు వ‌స్తున్నా టీటీడీ విజిలెన్స్ వ్య‌వ‌స్థ‌ నిద్ర పోతుందా అని ఆయ‌న ప్ర‌శ్నించారు.  తిరుమలలో మాంసాహారం క‌ల‌క‌లంపై భూమ‌న తీవ్రంగా స్పందించారు. తిరుమల విషయంలో గత ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేసిన కూటమి ప్రభుత్వం..ఇప్పుడు ఏం చేస్తుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తిరుమలలో విజిలెన్స్ నిఘా పూర్తిగా  వైఫల్యం చెందింద‌ని, చంద్రబాబు  పాలనలో మద్యం, మాసం తిరుమలలో పట్టుబడుతున్నాయ‌ని ధ్వ‌జ‌మెత్తారు. శ్రీవారి ఆలయానికి సమీపంలో  గుడ్డు బిర్యాని పట్టుబడింది అంటే టిటిడి వైఫల్యం మరోసారి బుట్టదాఖలైన‌ట్లు కాదా అని నిల‌దీశారు. కొండ‌పైకి మారణాయుధాలు తో వచ్చిన పట్టించుకోలేని పరిస్థితి కి తీసుకువచ్చార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వంలో ఎల్లో మీడియా ద్వారా అబద్ధపు ప్రచారాలు చేశారు..ఇప్పుడేమో నోరు మెద‌ప‌డం లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. టిడిపి నాయకులు సేవలో టిటిడి చైర్మన్ పనిచేస్తున్నారు, భక్తులను పట్టించుకోవడం లేద‌ని విమ‌ర్శించారు. తిరుమల కొండపై ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తూ 4సార్లు పట్టు బడ్డారు, 40 సార్లు పట్టుబడకుండా తప్పించుకు తిరిగి ఉంటార‌ని అనుమానం వ్య‌క్తం చేశారు. లడ్డు ప్రసాదం విషయం లో మాపై నింద మోపారు, మాపై నేరారోపణలు చేశారని త‌ప్పుప‌ట్టారు. సనాతన హిందూ ధర్మం ప‌రిర‌క్ష‌ణ‌కు పీఠాధిపతులు, హిందుత్వ సంఘాలు  ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్ర‌శ్నించాల‌ని భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి కోరారు.

Back to Top