విశాఖపట్నం: ఏప్రిల్లోపే విశాఖపట్నం నుంచి పరిపాలన సాగించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వైయస్ఆర్ సీపీ రీజనల్ కోఆర్డినేటర్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. గతంలో చెప్పినట్టుగానే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా న్యాయపరమైన సమస్యలను తొలగించుకొని పరిపాలన రాజధానిగా విశాఖ నుంచే పాలన సాగించాలనే నిర్ణయానికి వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం, సీఎం వైయస్ జగన్ కట్టుబడి ఉన్నారన్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. విశాఖలో వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలు చాలా ఉన్నాయని, అవసరమైతే ప్రైవేట్ బిల్డింగ్స్ అద్దెకు తీసుకోవచ్చన్నారు. భీమిలి రోడ్డులో ప్రభుత్వానికి చెందిన ఐటీ బిల్డింగ్ చాలా వరకు ఖాళీగా ఉన్నాయని, ప్రస్తుతం ఐటీ కంపెనీలు లిమిటెడ్గా ఉన్నాయి కాబట్టి ఆ బిల్డింగ్లను వినియోగించుకోవచ్చని చెప్పారు. వీఎంఆర్డీఐ బిల్డింగ్స్లో కూడా కొన్ని ఆఫీసులు పెట్టుకోవచ్చని చెప్పారు. విశాఖ ఒక్కటే అన్ని విధాలుగా అభివృద్ధి నగరం కాబట్టే గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నట్టు వివరించారు.