సవాల్‌ విసిరి పారిపోవడం కాదు.. నీ ద‌మ్మెంతో నిరూపించుకో..

మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి వ్యతిరేకంగా ఉదయగిరిలో వైయస్‌ఆర్‌ సీపీ ఆందోళన

నెల్లూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెక్కల కష్టంతో గెలిచి.. పార్టీపై, సీఎం వైయస్‌ జగన్‌ ఆరోపణలు చేస్తున్న మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే ఉదయగిరి రావాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. ఉదయగిరి బస్టాండ్‌ సెంటర్‌లో బైఠాయించారు. చంద్రశేఖర్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సవాల్‌ విసిరి పారిపోయారని, ఉదయగిరి వచ్చి తన దమ్ము ఏంటో నిరూపించుకోవాలని సవాల్‌ విసిరారు. 

ఈ సందర్భంగా వైయస్‌ఆర్‌ సీపీ నేత మూలే వినయ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబుకు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అమ్ముడుపోయాడన్నారు. ఎమ్మెల్యేగా గెలిపించిన పార్టీకి ద్రోహం చేయడమే కాకుండా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌పై, ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. నిన్న వెయ్యి మంది కార్యకర్తలతో మేకపాటి చంద్రశేఖరరెడ్డికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ చేపట్టామని, ఈరోజు ఉదయం నుంచి బస్టాండ్‌ సెంటర్‌లో బైఠాయించి ఆందోళన చేపడుతున్నామన్నారు. మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఉదయగిరి నియోజకవర్గం వెళ్లిపోవాలన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తమకు రోల్‌ మోడల్‌ అని, సీఎం మాట తమకు శాసనమన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ ఎంతో నిజాయితీ, నిబద్ధత కలిగిన నాయకుడని, అలాంటి నాయకుడిపై చంద్రశేఖర్‌రెడ్డి చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top