తాడేపల్లి: స్థానిక ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు కావాలనే గొడవలు సృష్టిస్తున్నారని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి మండిపడ్డారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించి లబ్ధి పొందాలని టీడీపీ కుట్రలు చేస్తుందన్నారు. మాచర్లకు టీడీపీ నేతలను ఎందుకు పంపించారో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్పై దుర్భాషలాడితే నాలుకలు చీరేస్తామని పార్థసారధి హెచ్చరించారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగు దేశం పార్టీ నాయకులను మాచర్లకు ఎందుకు పంపించారో చంద్రబాబు సమాధానం చెప్పాలి. అరాచకాలు సృష్టించి ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు. మాచర్లలో టీడీపీ నాయకులు అతివేగంతో కార్లు నడుపుతూ..ఓ దివ్యాంగుడిని ఢికొట్టారు. టీడీపీ నేతలు ఆ దివ్యాంగుడిని ఆసుపత్రిలో చేర్చకుండా పారిపోతున్న పరిస్థితుల్లో వాళ్ల వాహనాలను అడ్డగించారు. దివ్యాంగుడిని ఢీకొట్టడంతో కోపోధ్రికులైన స్థానికులు కార్లను అడ్డగిస్తే..దానికి రాజకీయ రంగు పులిమి టీడీపీ నాయకులు మాట్లాడటం సిగ్గు చేటు. దీనికి, ఎన్నికలకు ఏం సంబంధం ఉంది?. ఎవరు వాహనాన్ని నడుపుతున్నారో లేదో తెలియదు. వారు ఏ కండీషన్లో ఉన్నారో తెలియదు. ఒక ఐపీఎస్ అధికారిపై చేయి చేసుకున్న మాజీ ఎమ్మెల్యేను మాచర్లకు ఎందుకు పంపించారో సమాధానం చెప్పాలి. గుంటూరు జిల్లాలో చాలా మంది సీనియర్లు ఉన్నారు. వాళ్లని కాదని విజయవాడ నుంచి బొండా ఉమా, బుద్దా వెంకన్న ఎందుకు వెళ్లారు. చంద్రబాబు ప్రతి ఎన్నికల్లో ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. గ్రామాల్లో ఉన్న పరిస్థితులను బట్టీ ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు జరుగుతుంటాయి. వాటిని ప్రభుత్వం నివారించే చర్యలు తీసుకుంటున్నా..అక్కడక్కడ కొన్ని జరుగుతుంటాయి. ఇలాంటి వాటిని సామరస్యంగా పరిష్కరించాల్సింది పోయి రాజకీయం చేయడం తగదు. టీడీపీకి అభ్యర్థులు దొరకట్లేదు..! టీడీపీ ఖాళీ అవుతోందని చంద్రబాబు భయపడుతున్నారని పార్థసారధి పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీకి అభ్యర్థులు దొరకడం లేదు. టీడీపీ బలహీనతను, చంద్రబాబు ఓటమిని అంగీకరించలేక ప్రభుత్వంపై బురదజల్లుతున్నారు. ‘ మాచర్ల ఘటనను అడ్డుపెట్టుకుని దిగజారి మాట్లాడుతున్నారు. కోడ్ అమలులో ఉన్నప్పుడు పోలీసుల అనుమతి లేకుండా బుద్దా వెంకన్న, బోండా ఉమా ర్యాలీగా మాచర్లకు ఎందుకు వెళ్లారు?. గొడవలు చేసి అరాచకాలు సృష్టించాలనుకుంటున్నారు. టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేదా? దాదాపు 9636 ఎంపీటీసీ స్థానాలకు 33,600 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇందులో అందరూ వైయస్ఆర్సీపీ నేతలేనా? టీడీపీ అభ్యర్థులు లేరా?. 652 జెడ్పీటీసీ స్థానాలకు 4 వేలకు పైగా నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో టీడీపీ అభ్యర్థులు లేరా?. ఎక్కడో జరిగిన చిన్న సంఘటనను కూడా వైయస్ఆర్సీపీపై బురద జల్లుతున్నారు. ఇదే గుంటూరు జిల్లాలో ముప్పాళ్ల అధ్యక్ష పదవికి ఎన్నిక జరుగుతుంటే..మా పార్టీ సభ్యులను బస్సులో తీసుకెళ్తుంటే ఆ రోజు టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారు. అప్పట్లో మా ఎమ్మెల్యేలు ముస్తఫా, అంబటి రాంబాబు కార్లపై దాడి చేశారు. గతంలో చంద్రబాబు ఎప్పుడైనా డబ్బులు, మద్యం లేకుండా ఎన్నికలు నిర్వహించాలని ఆలోచన చేశారా? దౌర్జన్యం చేయాల్సిన అవసరం మాకు లేదు. వైయస్ జగన్ రిఫామ్స్ తెస్తున్నారు. డబ్బు ప్రభావం ఉండకూడదని, మద్యం ఉండకూడదని సీఎం పదే పదే చెబుతున్నారు. కేవలం చంద్రబాబు పన్నిన కుట్ర. భయందోళన వాతావరణం సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. మీ చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైయస్ జగన్పై దుర్భాలాడితే మీ నాలుకలు చీల్చేస్తాం. ఇలాంటి పదాలు ఉపయోగించడానికి బాధగా ఉంది. ఇప్పటికైనా మీ భాష మార్చుకోకపోతే ప్రజలు మిమ్మల్ని శాశ్వతంగా చీకొట్టడం ఖాయనమి పార్థసారధి హెచ్చరించారు.