ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అన‌ర్హ‌త వేటు వేయాలి

లోక్‌సభ స్పీకర్‌ కు వైయ‌స్ఆర్  కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు ఫిర్యాదు 

 న్యూఢిల్లీ: ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డ్డార‌ని,  ఆయ‌న‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు డిమాండు చేశారు. ఈ మేర‌కు పార్టీ ఎంపీల బృందం లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మాట్లాడుతూ.. ర‌ఘురామ‌కృష్ణ‌మ‌రాజు నైతిక విలువలు కోల్పోయారని , వైయ‌స్ఆర్‌సీపీలో ఉంటూనే ప్రతిపక్షాలతో మంతనాలు జరుపుతూ రఘురామకృష్ణంరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని తెలిపారు. పార్టీ నేతలను దూషిస్తూ ప్రతిపక్షాలతో లాలూచీపడినట్లుగా ప్రవర్తించారు. ఆయనకు ఏమైనా అనుమానాలుంటే పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చించి ఉండాల్సింది. ఇబ్బందులు ఏమైనా ఉంటే పార్టీ అధ్యక్షుడికి తెలియజేయాలి. పార్టీ నియమావళి, క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలున్నాయి. ఊహాజనితమైన విషయాలను ఊహించుకుని దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీ తరఫున ఎంపీగా ఉన్నారో ఆ పార్టీపైనే ఆరోపణలు చేస్తున్నారు. ఏవో లాభాలను ఆశించే ఇతర పార్టీలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మనసా, వాచా అతను వైయ‌స్ఆర్‌సీపీతో లేరు. స్వపక్షంలో విపక్షంలా రఘురామకృష్ణంరాజు వ్యవహరించారు’అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని  వెల్లడించారు. ఆయనపై చర్యలు తీసుకుంటామని స్పీకర్‌ హామీ ఇచ్చార‌ని తెలిపారు. 

ర‌ఘురామ‌కృష్ణ‌మ‌రాజు వ్యాఖ్య‌లు దుర‌దృష్ట‌క‌రం:  మిథున్‌రెడ్డి
టీటీడీ భూముల వివాదంపై చైర్మన్‌తో గానీ, ఈఓతోగానీ రఘురామకృష్ణంరాజు చర్చించలేద‌ని ఎంపీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు.
రఘురామకృష్ణంరాజుకు సీఎం వైయ‌స్‌ జగన్‌ అధిక ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. టీటీడీ వివాదంపై చైర్మన్‌తో గానీ, ఈఓతోగానీ రఘురామకృష్ణంరాజు చర్చించనిదే... టీటీడీ భూముల అమ్మకాలు జరిగిపోయినట్లుగా మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు. ఆయన ఇచ్చిన వివరణలో నిజాయితీ లేదని స్పష్టం చేశారు. 

కుంటిసాకులు మానుకోవాలి: న‌ందిగం సురేష్‌
రఘురామకృష్ణంరాజు కుంటిసాకులు మానుకోవాలని ఎంపీ నందిగం సురేష్‌ అన్నారు. ధైర్యం ఉంటే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్‌ చేశారు. 

ఎవరి ఫొటోకు వ్యాల్యూ ఉందో తెలుస్తుంది:  ఎంపీ మార్గాని భ‌ర‌త్‌
రాఘురామ‌కృష్ణ‌మ‌రాజు త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తే..రాబోయే ఉపఎన్నికల్లో ఎవరి ఫొటోకు వ్యాల్యూ ఉందో ఆయ‌న‌కు తెలుస్తుందని ఎంపీ మార్గాని భరత్‌ అన్నారు. ‘మీ పిల్లలు ఇంగ్లీష్‌ మీడియంలో చదవాలి. బడగు బలహీనవర్గాల ప్రజలు తెలుగు మీడియంలో చదవాలా?’అని ఎంపీ భరత్‌ రఘురామకృష్ణంరాజును ప్రశ్నించారు.

Back to Top