ఓటమికి సాకులు వెతికే పనిలో తండ్రీకొడుకులు

ఓటర్లకు పెద్ద మొత్తంలో డబ్బులు పంపిణీ చేస్తున్న టీడీపీ

కుప్పంలో అరాచకాలు సృష్టించింది బాబు, లోకేషే

వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి

కుప్పం: చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలోనే ఓటర్లకు పెద్ద మొత్తంలో డబ్బులు పంచుతున్నాడంటే.. కుప్పంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. కుప్పంలో ఎలాగైనా గెలవాలని చంద్రబాబు, లోకేష్‌ ప్రలోభాల పర్వానికి దిగారని, పెద్ద ఎత్తున డబ్బులు పంచుతున్నారంటే.. కుప్పాన్ని బాబు ఎంత నిర్లక్ష్యం చేశారో చెప్పడానికి నిదర్శనమన్నారు. ఎంపీ మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గత రెండు వారాలుగా కుప్పంలో తెలుగుదేశం పార్టీ అరాచకాలు సృష్టిస్తుందని, గొడవలు చేయండి అని లోకేష్‌ పబ్లిక్‌గానే చెప్పడం టీడీపీ నీచ రాజకీయాలకు  నిదర్శనమన్నారు. 

కుప్పం ప్రజలకు, నియోజకవర్గ అభివృద్ధికి చంద్రబాబు చేసిందేమీ లేదని, టీడీపీ ఐదేళ్ల పాలనలో కుప్పానికి చంద్రబాబు వెయ్యి ఇళ్లు ఇస్తే.. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 9,000 ఇళ్లు మంజూరు చేశారన్నారు. కేవలం కుప్పం మున్సిపాలిటీకే 5,000 కొత్త ఇళ్లను సీఎం ఇచ్చారని ఎంపీ మిథున్‌రెడ్డి గుర్తుచేశారు. వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేసి కుప్పానికి నీరు తీసుకువచ్చారన్నారు. కుప్పం ప్రజలంతా వైయస్‌ఆర్‌ సీపీ వెంటే ఉన్నారని, పంచాయతీ ఎన్నికల్లో 85 శాతం వైయస్‌ఆర్‌ సీపీని గెలిపించారని చెప్పారు. కుప్పం మున్సిపాలిటీలోనూ వైయస్‌ఆర్‌ సీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ చంద్రబాబు, లోకేష్‌ ఓటమికి సాకులు వెతుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. 
 

Back to Top