తాడేపల్లి: అకాల వర్షాలతో పంట నష్టపోయిన ప్రతి రైతన్నను ప్రభుత్వం ఆదుకుంటుందని, తడిసిన, రంగుమారిన, మొలకలు వచ్చిన ధాన్యాన్ని సైతం గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధికారులను స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. పంట నష్టంపై అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారని చెప్పారు. 35 లక్షల మెట్రిక్ టన్నులు అయినా సరే.. పూర్తిస్థాయిలో తడిచిన, రంగు మారిన, మొలకలు వచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ భరత్రామ్ విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ భరత్ ఏం మాట్లాడారంటే..
వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు కాదా..? ఉచిత కరెంటు ఇస్తామని మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి చెబితే.. ఆ కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలని చెప్పిన వ్యక్తి చంద్రబాబు కాదా..? బషీర్బాగ్ ఘటనను ఇప్పటి వరకు దేశ ప్రజలు ఎవరూ మర్చిపోలేదు. రైతులను ఒక హంతకుడిలా చంద్రబాబు షూట్ చేయించాడు. ఏ మొహం పెట్టుకొని రైతాంగం గురించి చంద్రబాబు మాట్లాడుతున్నాడు. ఎక్కడో ఒక డ్రామా క్రియేట్ చేసి దానితో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు.
తమిళనాడు యాక్టర్ రజనీకాంత్ను పిలిపించుకొని పొగిడించుకుంటున్నాడు. హైదరాబాద్ అభివృద్ధి చంద్రబాబు చేశాడా..? ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి అమరావతిలో చేసిన అభివృద్ధి గురించి రజనీకాంత్తో ఎందుకు పొగిడించుకోలేదు..? ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి అమరావతి ప్రాంతాన్ని ఏ మేరకు అభివృద్ధి చేశావ్..? నీ ఇంట్లోనే ప్యాన్ ఇండియా స్టార్ జూ.ఎన్టీఆర్ను ఎందుకు బయటకు తీసుకురావడం లేదు..? ఎందుకంటే నీ కుమారుడు లోకేష్కు పోటీగా వస్తాడని భయం. సీఎం వైయస్ జగన్ కాలిగోటి వెంట్రుకకు కూడా లోకేష్ సరిపోడు.
రైతన్న పండించిన ప్రతి ధాన్యం గింజకు సీఎం బాధ్యత తీసుకుంటున్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఆర్బీకే లాంటి గొప్ప వ్యవస్థను చంద్రబాబు ఎందుకు తీసుకురాలేకపోయాడు..? సీఎం వైయస్ జగన్ తీసుకువచ్చిన ఆర్బీకే వ్యవస్థలో కౌలు రైతుల రిజిస్ట్రేషన్ కూడా పూర్తిస్థాయిలో జరుగుతుంది. కౌలు రైతులకు కూడా న్యాయం చేసే ప్రభుత్వం ఇది. వైయస్ఆర్ రైతు భరోసా–పీఎం కిసాన్ కింద సుమారు 54 లక్షల మంది రైతులకు ప్రతి సంవత్సరం రూ.13,500 అందిస్తున్నాం. చంద్రబాబు ఎందుకు రైతులకు పంట పెట్టుబడిసాయం చేయలేకపోయాడు..? ఇన్పుట్ సబ్సిడీల గురించి చంద్రబాబు పట్టించుకున్నాడా..?
నీట మునిగిన పంటలను పరిశీలించి అధికారులు అంచనాలు వేస్తున్నారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందిస్తుంది. రాజమండ్రిలో టీడీపీ నేతలు శవ రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు శవాల మీద పేలాలు ఏరుకోవడానికి చంద్రబాబు తయారవుతున్నాడు’’ అని ఎంపీ మార్గాని భరత్ ధ్వజమెత్తారు.