కాకినాడ: పవన్ కల్యాణ్ నారాహి వాహనమెక్కి ద్వారంపూడి జపం చేస్తున్నాడని, పవన్కు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచే స్క్రిప్టు వస్తుందని, చంద్రబాబు, లోకేష్ ఆదేశాలతోనే కాకినాడకు చెడ్డపేరు తెచ్చేలా పవన్ మాట్లాడుతున్నాడని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి ధ్వజమెత్తారు. లేనిపోని మాటలు, నిందలు వేయడం టీడీపీ నేతల్లాగే పవన్కు కూడా అలవాటైందన్నారు. పవన్కు దమ్ముంటే కాకినాడలో నాపై పోటీ చేయాలని సవాల్ విసిరితే తోకముడిచి వెళ్లిపోయాడన్నారు. కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంజాయి హబ్, రైస్ అక్రమ రవాణా అంటూ కాకినాడ పట్టణానికి చెడ్డపేరు తీసుకువచ్చేలా పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. గతంలో చంద్రబాబు లాంటి కుక్క మొరిగినట్టుగా పవన్ మొరుగుతున్నాడన్నారు. దేశంలోనే బెస్ట్ లివింగ్ సిటీగా కాకినాడకు గతంలో తన హయాంలో తొమ్మిదో స్థానం దక్కిందని, ప్రస్తుతం బెస్ట్ లివింగ్ సిటీగా దేశంలోనే కాకినాడకు నాల్గవ స్థానంలో వచ్చిందన్నారు. దయచేసి కాకినాడ పేరును చెడగొట్టేలా మాట్లాడొద్దని, సౌమ్యులైన కాకినాడ ప్రజలు తిరగబడితే తట్టుకోలేవని పవన్ను హెచ్చరించారు. వ్యక్తిగతంగా తనపై కక్ష ఉంటే ఎన్నికల్లో ఫేస్ టు ఫేస్ తేల్చుకుందామని మరోసారి పవన్కు ఎమ్మెల్యే ద్వారంపూడి సవాల్ విసిరారు. నిన్న తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్ష అనంతరం వైయస్ఆర్ సీపీ నాయకులంతా తనను ఆశీర్వదించారని ఎమ్మెల్యే ద్వారంపూడి చెప్పారు. పవన్కు ఆశీర్వాదాలు చంద్రబాబు పెదనాన్న, లోకేష్ తమ్ముడు ఇవ్వాలని, వారితో మాట్లాడుకొని పర్మిషన్ తీసుకొని కాకినాడలో తనపై పోటీ చేయాలన్నారు. లేనిపోని అభూత కల్పనలు సృష్టించి కాకినాడపై నిందలు వేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.