తాడేపల్లి: రాష్ట్రంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అమలవడం లేదని... లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతోందని వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ అధ్యక్షుడు రవిచంద్ర మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చైతన్యది అక్రమ అరెస్టు అని, ఇలాంటి అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని తేల్చిచెప్పారు. ఫీజులు చెల్లించాలని అడిగితే పోలీసులతో పిడిగుద్దులు, అక్రమ అరెస్టులు చేయిస్తూ... ఫాసిస్ట్ పాలన సాగిస్తున్న చంద్రబాబుకు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... విద్యార్థులపై పోలీసుల కర్కశత్వం... పెండింగ్ లో ఉన్న రూ.7,800 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్పులు తక్షణమే విడుదల చేయాలంటూ డిసెంబరు 8న సాంఘిక సంక్షేమశాఖ కార్యాలయం వరకు వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విద్యార్ధులతో ఒక ర్యాలీ నిర్వహించాం. ఈ సందర్భంగా విద్యార్ధులంతా కలిసి సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్ కి వినతి పత్రం సమర్పించాలని భావించాం. తాడేపల్లి లో ర్యాలీ ప్రారంభించి... సాంఘిక సంక్షేమశాఖ కార్యాలయలం వరకు ర్యాలీగా వెళ్తున్న క్రమంలో సర్వీసు రోడ్డు వద్దే పోలీసులు మిమ్మల్ని అడ్డుకున్నారు. అత్యంత శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా ర్యాలీ నిర్వహిస్తుంటే... పోలీసులే బారికేడ్లుతో అడ్డగించి... ర్యాలీలో పాల్గొన్న విద్యార్ధులను లాఠీలతో నెట్టివేసి, పిడిగుద్దులు గుద్దుతూ అమానుషంగా, కర్కశంగా వ్యవహరించారు. సోషల్ వెల్ఫేర్ కార్యాలయంలోకి ఒక ప్రతినిధి బృందం వెళ్లి, డైరెక్టర్ ని కలిసి... రాష్ట్రంలో విద్యార్ధులకు రావాల్సిన ఫీజురీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్పుల బకాయిలు చెల్లించాలని ఒక వినతిపత్రం ఇస్తామని పోలీసులను కోరాం. కానీ పోలీసులు మేము లోపలకి వెళ్లడానికి వీల్లేదని... మిమ్మల్ని, మా నాయకుల్ని కాళ్లతో తంతూ, చేతులో గుద్దుతూ వ్యాన్లలో కుక్కారు. వైయస్ఆర్సీపీ విద్యార్ధి విభాగం అధ్యక్షుడు చైతన్యని అరెస్టు చేసి... జైలుకు పంపించింది. అరెస్టు చేసిన విద్యార్ధులను ఏ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తున్నారో కూడా చెప్పలేదు. ముందు తాడేపల్లి అని చెప్పి అక్కడ నుంచి ఏపీఎస్పీ బెటాలియన్ కు అక్కడ నుంచి తెనాలి, ఆ పై దుగ్గిరాల పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్లారు. అక్కడ ఉదయం 11.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్భంధించి అక్కడ నుంచి తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్తున్నామని చెప్పి.. మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తీసుకుని వచ్చారు. మా దగ్గర ఉన్న సెల్ ఫోన్లు అన్నింటినీ కూడా బలవంతంగా లాక్కున్నారు. అక్కడ నుంచి తాడేపల్లి దగ్గరకు తీసుకుని వచ్చి, ఆధార్ కార్డులు, సంతకాలు తీసుకుని మరలా మంగళిగిరి పోలీస్ స్టేషన్ అని చెప్పి. కోర్టుకు తీసుకుని వచ్చారు. అక్కడ నుంచి రాత్రి 11.30 గంటలకు న్యాయమూర్తి గారి ఇంటికి తీసుకుని వెళ్లి సరండర్ చేశారు. రాష్ట్రంలో నడుస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం... వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు, ఇతర విద్యార్ధులను అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గం. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడవడం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతుంది. మా విద్యార్థి విభాగం నాయకులు ఏం తప్పు చేశారు? అధికారం చేపట్టి 18 నెలలు కావస్తున్నా... ప్రభుత్వం తాను బకాయిపడ్డ ఫీజులు చెల్లించాలనడం తప్పా? ఒక్క రూపాయి కూడా విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వలేదు... దానిమీద ప్రశ్నించడం తప్పా? అందుకోసం శాంతియుతంగా ర్యాలీ చేసి, వినతిపత్రం ఇవ్వాలనుకోవడం తప్పా? ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్పులు చెల్లించకుండా బకాయిలు పెట్టడంతో... కాలేజీలు సెమిష్టర్ పరీక్షలకు విద్యార్ధులను అనుమతించడం లేదు, కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్ధులు ఫీజు బకాయిలు ఉన్నవాళ్లకు సర్టిఫికేట్లు మంజూరు చేయడం లేదు. సర్టిఫికేట్లు చేతికి రాకపోతే ఉన్నత చదువులుకు ఎలా వెళ్లగలుగుతారు? వీటన్నింటిపై వినతిపత్రం సమర్పించడానికే సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ ని కలవడానికి వెళ్తుంటే అరెస్టు చేయడం అన్యాయం, పైగా నిరసన కార్యక్రమంలో అరెస్టైన వారికి స్టేషన్ బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉన్నా కూడా కావాలనే రిమాండ్ కు పంపించడం చంద్రబాబు ఫాసిస్ట్ దమనకాండకు నిదర్శనం. నిరసన వ్యక్తం చేసే హక్కు కూడా లేకుండా అరెస్టు చేసి, రిమాండ్ కు పంపించడం దుర్మార్గం. విద్య, వైద్యకు వైయస్.జగన్ హాయంలో విశేష ప్రాధాన్యత... విద్య, వైద్యం ప్రభుత్వ ప్రాధామ్యాలుగా ఉండాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినదాన్ని తూచ తప్పకుండా అమలు చేయడానికి దాన్ని ప్రారంభించింది దివంగత నేత డాక్టర్ వైయస్.రాజశేఖర్ రెడ్డి అయితే... దాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లింది వైయస్.జగన్ ప్రభుత్వం. 100 శాతం ప్రతి విద్యార్ధికి పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించిన ఘనత వైయస్.జగన్ కే దక్కుతుంది. 2024 తొలి త్రైమాసికం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి ఫీజు రీయింబర్స్ మెంట్ వైయస్.జగన్ హయాంలో చెల్లించకుండా ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించి చంద్రబాబు అడ్డుకున్నాడు. ఆ రోజు ఫీజులు ఇవ్వకుండా అడ్డుకున్న చంద్రబాబు... ఇవాళ తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్పులు చెల్లించకుండా విద్యార్ధులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రూ.2.50 లక్షల కోట్లు అప్పు- అయినా చెల్లించని ఫీజు బకాయిలు.. దాదాపు రూ.2.50 లక్షల కోట్లు అప్పు చేసిన కూటమి ప్రభుత్వం.. విద్యార్ధుల ఫీజు బకాయిలు.. రూ.7800 కోట్లు చెల్లించలేరా? చట్టబద్దంగా, శాంతియుతంగా ప్రభుత్వం బకాయిలు పడ్డ ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించాలని ర్యాలీ చేస్తే... విద్యార్థి నాయకులను, విద్యార్ధులను అరెస్టు చేసి రిమాండుకు పంపించిన ఘటన దేశంలోనే కాదు, ప్రపంచంలోనూ ఎక్కడా జరగలేదు. ఈ ప్రభుత్వ ఫాసిస్ట్ పాలనలో శాంతియుత ర్యాలీ చేపట్టినా అరెస్టులు చేసి, రిమాండ్ కు పంపించింది అంటే... ప్రభుత్వం ఎంత అభద్రతాభావంలో ఉందో ఇట్టే అర్ధం అవుతుంది. నాతో సహా నలుగురికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించి... చైతన్యను మాత్రం రిమాండ్ కు పంపించింది అంటే ప్రభుత్వం ఎంత అభద్రతాభావంలో ఉందో అర్ధం చేసుకోవచ్చ. మీరు ఎంతమందిని ఆరెస్టు చేసినా.. ఈ ఉద్యమాన్ని ఆపాలనుకున్నా ఆగేది లేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర, రాష్ట్ర ఉపాధ్యకుడు నరేంద్ర రెడ్డి ,గుంటూరు జిల్లా నాయకులు నవీన్ కుమార్, రవిలకు నోటీసులు ఇచ్చి పంపించింది. అయితే శాంతియుత ర్యాలీ చేపడుతున్నా కూడా చైతన్యలాంటి విద్యార్ధి సంఘ నేతను అరెస్టు చేయడం వంటి ఘటనలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు మరెక్కడా జరగలేదు. అరెస్టులుతో విద్యార్థి ఉద్యమం ఆగదు.. మా ర్యాలీని అడ్డుకున్నా, మా నేతలను అరెస్టు చేసినా ఈ ఉద్యమం ఆగదు. మీరెంత అణిచివేయాలని చూసినా... రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం. మీ ప్రభుత్వ పతనం తప్పదు. ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకుండా, ఫీజులివ్వాలని కోరిన విద్యార్థి సంఘాల నేతలను జైలుకు పంపంచిన నీచమైన సంస్కృతి కూటమి ప్రభుత్వానిదే. స్టేషన్ బెయిలిచ్చే కేసుల్లోనూ అరెస్టు చేశారు. వైయస్.జగన్ రూ.4,200 కోట్లు ఫీజు బకాయిలు పెట్టారని నారా లోకేష్ దుష్ప్రచారం చేశారు. ఇది ముమ్మాటికీ తప్పు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించే వరకు మా పోరాటం ఆగదు. అరెస్టు ద్వారా ఉద్యమాన్ని ఆపలేరు. ● నరేంద్రరెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు. రాష్ట్రంలో పాలిచ్చే ఆవుని వదిలి.. తన్నే దున్నను తెచ్చుకున్నట్టైంది. కూటమి ప్రభుత్వం విద్యార్ధులను, యువకులను లక్ష్యంగా చేసుకుంది. గతంలో వైయస్.జగన్ హాయంలో ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ఫీజులు సకాలంలో చెల్లిస్తే... చంద్రబాబు ప్రభుత్వం 18 నెలలైనా ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించలేదు. ఇది ప్రభుత్వానికి సిగ్గుచేటు. అధికార పార్టీ నేతలకు చెందిన విద్యా సంస్థల్లోనే పిల్లలు ఫీజులు కట్టడం లేదని కాలేజీలకు కూడా రానివ్వడం లేదు. ఇంత దారుణంగా పరిస్థితి ఉంటే.. తక్షణమే ఫీజు బకాయిలు చెల్లించాలని శాంతియుతంగా వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరపున ర్యాలీ చేస్తుంటే దాన్ని కూడా అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా అత్యంత దారుణంగా పోలీసులతో కొట్టించి, అరెస్టు చేయించడం దారుణం. ప్రభుత్వం ఎంతమందని అరెస్టు చేసినా, ఫీజు బకాయిలు చెల్లించేవరకు మా పోరాటం ఆగదు.