తాడేపల్లి: ‘నందమూరి బాలకృష్ణా... నువ్వే సైకోవు.. కాబట్టే ఇంటికి వచ్చిన స్నేహితుడిపై కాల్పులు జరిపావు. నువ్వు సైకోవు కాబట్టే నీకు మెంటల్ సర్టీఫికెట్ ఇచ్చారు. మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుని బయట తిరుగుతున్నావు.’ అని పలువురు వైయస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డిపై ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ నిన్న రెచ్చిపోయారు. మాజీ సీఎం వైయస్ జగన్తో పాటు మెగాస్టార్ చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ అనుచితంగా మాట్లాడడంపైనా వైయస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. నోరు అదుపులోకి పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరిస్తున్నారు. బాలకృష్ణ మానసిక స్థితిని పరీక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీకి, సినిమా ఫంక్షన్కు తేడా తెలియకుండా మాట్లాడారు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు మీదున్న కోపాన్ని వైయస్ జగన్ మీద చూపిస్తే ఎలాగంటూ ప్రశ్నించారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన బుద్ధి చెబుతామంటూ హెచ్చరించారు. బాలకృష్ణ వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్సీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బాలకృష్ణ సొంత నియోజకవర్గం హిందూపురంలో శవ యాత్ర నిర్వహించి,ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాలకృష్ణ మానసిక స్థితిని పరీక్షించుకోవాలి: ఎస్వీ సతీష్రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తన మానసిక పరిస్థితిని పరీక్షించుకోవాలని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్రెడ్డి సూచించారు. అసెంబ్లీకి, సినిమా ఫంక్షన్ కు తేడా తెలియకుండా నిన్న సభలో బాలకృష్ణ మాట్లాడారని ఫైర్ అయ్యారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు మీదున్న కోపాన్ని వైయస్ జగన్ మీద చూపించడం దుర్మార్గమన్నారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన బుద్ధి చెబుతామంటూ ఆయన హెచ్చరికలు. బాలకృష్ణ.. నీ ఇంట్లో గన్ ఫైర్ ఘటన మరిచిపోయావా అంటూ ధ్వజమెత్తారు. నాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి నీపై వ్యవహరించిన తీరు మరిచిపోయావా? అని నిలదీశారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి సినీ పరిశ్రమ పట్ల స్పందించిన తీరును స్వయాన చిరంజీవి లేఖ రూపం లో తెలిపారని గుర్తు చేశారు. నాడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చిరంజీవి పై ఎంత ఆప్యాయంగా వ్యవహరించారో అందరికి తెలుసు అన్నారు. సినీ ఇండస్ట్రీ నీ ఇంటికి పిలిచి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమస్యలను పరిష్కరించారని తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డిని అప్రతిష్టపాలు చేసేలా కూటమి నాయకులు విమర్శించే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఒక అబద్ధాని నిజం చేస్తూ వైయస్ జగన్ ను కించపరిచేలా ఎల్లో మీడియా చూపిస్తుందని ఆక్షేపించారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ శుక్రవారం విజయవాడ నగరంలోని బాడవపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వైయస్ఆర్సీపీ శ్రేణుల ఆందోళన కార్యక్రమం చేపట్టారు. బాలకృష్ణకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి వినూత్న నిరసన చేపట్టారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ , డిప్యూటీ మేయర్లు బెల్లందుర్గ , అవుతు శైలజారెడ్డి పాల్గొన్నారు. జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన నాయకుడు వైయస్ జగన్: దేవినేని అవినాష్ వైయస్ జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వెంటనే క్షమాపణలు చెప్పాలని ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. అసెంబ్లీలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజానికి సిగ్గుచేటు అన్నారు. కోట్లాది మంది పేదలకు మంచి చేసిన వ్యక్తి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్, వైయస్ఆర్ అంటే మాకు దైవ సమానమన్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపై కూడా మాకు గౌరవం ఉండేదన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలతో మాకు వారి పట్ల ఉన్న గౌరవం పోయిందని పేర్కొన్నారు. ఏనాడైనా .. ఒక్క పథకానికైనా చంద్రబాబు ఎన్టీఆర్ పేరు పెట్టారా అని ప్రశ్నించారు. కనీసం ఏనాడైనా ఆ ఆలోచన చంద్రబాబుకు వచ్చిందా అని నిలదీశారు. మా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన దమ్మున్న నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. `ఐదేళ్లలో మీ సినిమాలకు అడ్డు చెప్పలేదు. మీ బసవతారకం ఆసుపత్రికి సహకరించారు. మంచి చేసిన వారిని తూలనాడటం బాలకృష్ణకు అలవాటు. బెజవాడ సాక్షిగా మోదీ తల్లిని తిట్టి...మళ్లీ వాటేసుకున్న వ్యక్తి బాలకృష్ణ. బాలకృష్ణ వ్యాఖ్యలు ఆయన దిగజారుడు తనానికి నిదర్శనం. సభలో లేని...అసలు సంబంధం లేని చిరంజీవిని కూడా తూలనాడారు. చిరంజీవిని తూలనాడినా.. కనీసం ఖండించలేని స్థితిలో జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మంత్రి కందుల దుర్గేష్ కనీసం బాలకృష్ణ వ్యాఖ్యలను వ్యతిరేకించలేక పోయారు. ఎందుకు ఇంకా మీకు ఇంతటి బానిసత్వం. నిండు సభలో చిరంజీవిని అవమానిస్తే ఏమైపోయారు మీరంతా?. మేమూ బాలకృష్ణను అనగలం...కానీ మా నాయకుడు మాకు సంస్కారం నేర్పారు. కూటమి ఎమ్మెల్యేలకు మంచి బుద్ధిని ప్రసాదించాలని అంబేద్కర్ ను కోరుకున్నాం. బాలకృష్ణ తక్షణమే వైయస్ జగన్ మోహన్ రెడ్డికి క్షమాపణ చెప్పాలి` అని దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. కామినేని చెప్పినవన్నీ అబద్ధాలే: మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నిన్న అసెంబ్లీలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు, అసత్యాలేనని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. శాసన సభలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సమాజం తలదించుకునేలా ఉన్నాయని ఆయన తీవ్రంగా ఖండించారు. శాసనసభలో గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా కూటమి నేతలకు లేదని ఫైర్ అయ్యారు. బాలకృష్ణకు అసెంబ్లీ హాల్లోకి వచ్చేముందు వైద్య పరీక్షలు చేయించాలని డిమాండ్ చేశారు. ఏ స్థితిలో ఉండి బాలకృష్ణ శాసన సభకు వస్తున్నాడో అనుమానాలు ఉన్నాయన్నారు.ఆయన మానసిక పరిస్థితి బాగోలేదు కాబట్టే నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సినీ పరిశ్రమను, సినీ పరిశ్రమ పెద్దలను గౌరవించారని తెలిపారు. బాలకృష్ణ అఖండ సినిమా నిర్మాత పేర్నినాని కలిస్తే ... వారికి ఏం కావాలో చూడాలని చెప్పిన మంచి నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి, నిస్సిగ్గుగా లేని మాటలను తెరపైకి తెచ్చి పబ్బం గడుపుకుంటున్నారని ఆక్షేపించారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి తమను ఎలా చూశారో చిరంజీవి నిన్న ఒక పత్రికా ప్రకటన ఇచ్చారని, ఆ రోజు జరిగినటువంటి వాస్తవాలను చిరంజీవి చెప్పారని వివరించారు. చిరంజీవి ప్రకటన తర్వాత బాలకృష్ణ, కామినేని వాళ్ల తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారోనని ప్రశ్నించారు. బాలకృష్ణ చేసిన దిగజారుడు వ్యాఖ్యలను ప్రజలంతా ముక్తఖంఠంతో ఖండిస్తున్నారని మల్లాది విష్ణు తెలిపారు. వైయస్ జగన్పై బాలకృష్ణ వాఖ్యలు సిగ్గుచేటు: మురళీకృష్ణంరాజు వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ వైయస్ఆర్సీపీ పరిశీలకుడు మురళీకృష్ణంరాజు ఖండించారు. బాలకృష్ణ తన ఇంట్లో కాల్పులు జరిగితే ఆ కేసు నుండి మెంటల్ సర్టిఫికేట్ తో బయటపడ్డారని గుర్తు చేశారు. బాలకృష్ణ ప్రజలతోను, అభిమానులతో ఏలా ప్రవర్తిస్తాడో అందరికి తెలిసిందే అన్నారు. బాలకృష్ణ తన తీరు మార్చుకోకపోతే ప్రజలే రాబోయే రోజుల్లో సమాధానం చెబుతారని మురళీకృష్ణంరాజు హెచ్చరించారు. హిందూపురం, అనంతపురంలో శవయాత్ర బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో వైయస్ఆర్సీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. నిన్న అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలపై శవయాత్ర నిర్వహించారు. అలాగే అనంతపురం టవర్ క్లాక్ వద్ద వైయస్ఆర్సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టి బాలకృష్ణ దిష్టిబొమ్మను దహనం చేశారు. బాలకృష్ణ ను పిచ్చాసుపత్రికి తరలించాలని వైయస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. చంద్రబాబు స్క్రిప్ట్..బాలకృష్ణ యాక్షన్: నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి చంద్రబాబు స్క్రిప్ట్తోనే నిన్న అసెంబ్లీలో బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారని వైయస్ఆర్సీపీ నేత నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. వైయస్ జగన్ పై నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకోమని, బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయన హెచ్చరించారు. ఒకప్పుడు హరికృష్ణను అడ్డం పెట్టుకొని చంద్రబాబు కథ నడిపాడు, నేడు బాలకృష్ణ వంతు వచ్చిందని పేర్కొన్నారు. తన కుమారుడు లోకేష్ కు లైన్ క్లియర్ చేయడంలో జనసేన అడ్డు తొలగింపే బాబు లక్ష్యమన్నారు. మా నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే మూల్యం చెల్లించిక తప్పదన్నారు. చంద్రబాబు స్క్రిప్ట్ తోనే జనసేన మంత్రి కందుల దుర్గేష్ ను టార్గెట్ చేశారని ఆక్షేపించారు. గతం మరచిపోయావా బాలయ్య: రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సూటి ప్రశ్న గతంలో బాలకృష్ణ ఇంట్లో గన్ ఫైర్ ఘటనలో నిన్ను కాపాడింది వైయస్ రాజశేఖరరెడ్డి అని మరిచిపోయావా..? అంటూ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. వైయస్ జగన్ సినీ పరిశ్రమ పట్ల స్పందించిన తీరును స్వయాన చిరంజీవి లేఖ రూపంలో తెలిపారు. నాడు వైయస్ జగన్ చిరంజీవి పై ఎంత ఆప్యాయంగా వ్యవహరించారో అందరికి తెలుసు అని గుర్తు చేశారు. సినీ ఇండస్ట్రీ నీ ఇంటికి పిలిచి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమస్యలను పరిష్కరించారని చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డిని అప్రతిష్టపాలు చేసేలా కూటమి నాయకులు విమర్శించే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. బసవతారక క్యాన్సర్ ఆసుపత్రికి కోట్ల రూపాయలు సిఎం సహాయానిది డబ్బులు మంజూరు చేసింది వైయస్ జగన్ కాదా అని నిలదీశారు. సంస్కారం లేని వ్యక్తి బాలకృష్ణ: గుడివాడ అమర్నాథ్ బాలకృష్ణ సంస్కారం లేని వ్యక్తి అంటూ వైయస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. బాలకృష్ణ మందు తాగి అసెంబ్లీ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన తీవ్రంగా ఖండించారు. చిరంజీవి తనతో సమానమని బాలకృష్ణ అనుకుంటారని, చిరంజీవి కాలిగోటికి కూడా పనికిరాడని విమర్శించారు. స్వశక్తితో చిరంజీవి హీరోగా ఇండస్ట్రీలో స్థానం సంపాదించుకున్నారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ మీద చంద్రబాబు చెప్పులు వేయించిన రోజే బాలకృష్ణ చచ్చిపోయారని వ్యాఖ్యానించారు. బాలకృష్ణను కాల్పుల ఘటనలో కాపాడింది వైయస్ఆర్ అన్నది మర్చిపోవద్దని హితవు పలికారు. బాలకృష్ణ సినిమాలుకు రేట్లు పెంచమని ఆదేశాలు ఇచ్చింది వైయస్ జగన్ కాదా అని నిలదీశారు. విశ్వాసం లేని వ్యక్తి బాలకృష్ణ..మెంటల్ సర్టిఫికెట్ ఉన్నవాళ్లకి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదని అభిప్రాయపడ్డారు. చిరంజీవి ప్రకటన ద్వారా బాలకృష్ణ చెప్పిందంతా అబద్ధమని తేలిపోయిందని, ఆ రోజు చిరంజీవి దంపతులను వైయస్ జగన్ దంపతులు ఎంతో గౌరవించారని చెప్పారు. చిరంజీవి పై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై జనసేన ఎలా స్పందిస్తుందో చూడాలని అమర్నాథ్ కామెంట్స్ చేశారు. బాధ్యతారహితంగా మాట్లాడటం బాధాకరం: వంగా గీతా చట్టసభల్లో సభ్యులు బాధ్యతారహితంగా మాట్లాడటం బాధాకరమని వైయస్ఆర్సీపీ నాయకురాలు, మాజీ ఎంపీ వంగా గీతా అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై కూటమి ఎమ్మెల్యేలు బాలకృష్ణ, కామినేని చేసిన వాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ అనేది ఎంతో పవిత్రమైన స్ధలమని, కేలవం 175 మందికి మాత్రమే ఆ పవిత్రమైన స్ధలంలోకి వెళ్ళే అవకాశం వస్తుందని పేర్కొన్నారు. చంద్రబాబు హయంలో టిడిపి అధికారంలోకి వచ్చాకా..ఎన్టీఆర్ పేరును ఒక జిల్లాకైనా పెట్టారా?, వైయస్ జగన్ మాత్రమే ఎన్టీఆర్ పేరును ఒక జిల్లాకు పెట్టారని గుర్తు చేశారు. వైయస్ జగన్ కు ప్రజలంటే పిచ్చి..అభిమానమన్నారు. చిరంజీవి చాలా సౌమ్యమైన వ్యక్తి, ఎప్పుడు ఒక్క అడుగు తగ్గే ఉంటారని చెప్పారు. వైయస్ జగన్ , చిరంజీవి ఆ ఇద్దరు అసమానులని, ఎవర్ని తక్కువ చేయాలనుకునే వ్యక్తులు కాదన్నారు. అలాంటి ఆ ఇద్దరు వ్యక్తులను చాలాతేలికగా మాట్లాడుతున్నారని, ఇది చాల తప్పు అని ఆమె ఆక్షేపించారు. పవన్ ఎందుకు ఖండించడం లేదు: బైరెడ్డి సిద్దార్థ రెడ్డి అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ చిరంజీవిపై ఇంత ఘోరంగా మాట్లాడితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు ఖండించడం లేదని వైయస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ప్రశ్నించారు. పవన్కు అధికారమే ముఖ్యమని, అన్నను ఏమన్నా ఫర్వాలేదన్న రీతిలో వ్యవహరిస్తున్నారని , ఆయన పూర్తిగా చంద్రబాబుకు లొంగిపోయాడని విమర్శించారు. బాలకృష్ణ మానసిక పరిస్థితి బాగాలేదని ఆక్షేపించారు. వైయస్ఆర్ చేసిన సహాయానికి బాలకృష్ణ చనిపోయే వరకు గుర్తు పెట్టుకోవాలని సూచించారు. తన పేరు లిస్ట్ లో 9 వ నెంబర్ లో పెట్టాడనే కోపంతో చంద్రబాబును, పవన్ కళ్యాణ్ను ఏమి అనలేక వైయస్ జగన్, చిరంజీవిలపై బాలకృష్ణ విమర్శలు చేశారన్నారు. తనకు ఎటువంటి అవమానం జరగలేదని చిరంజీవి చెప్పారు... అయినా అవమానం జరిగిందని టీడీపీ, జనసేన ఎందుకు మొత్తుకుంటుందో అర్థం కావడం లేదన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ని హీరో లు, ప్రోడ్యుసర్లు కలుస్తున్నారు... అంతమాత్రాన రేవంత్ రెడ్డి వారిని అవమానించినట్లా అని ప్రశ్నించారు. జూనియర్ ఎన్టీఆర్ తమకు మద్దతుగా లేడని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని తెలిపారు. బాలకృష్ణ ఇంత ఘోరంగా మాట్లాడితే... ఎందుకు చర్యలు లేవని నిలదీశారు. వాడేవడో చెప్తే...వాడేవడో ప్రశ్నోస్తే గత ముఖ్యమంత్రి దిగొచ్చాడని బాలకృష్ణ అన్నాడు... వాడేవడో అని చిరంజీవిని అన్నాడని, తన అన్నను ఇంత ఘోరంగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ మాట్లాడడం లేదని తప్పుపట్టారు. తన తల్లి ని అవమానించిన చంద్రబాబు, లోకేష్ ను మోకాళ్ళ పై కూర్చోబెడతా అన్న పవన్.. ఇప్పుడు ఆయనే చంద్రబాబు ముందు మోకాళ్ళ పై కూర్చున్నాడని ఎద్దేవా చేశారు. టీడీపీ ఎమ్మెల్యే లు, జనసేన మంత్రులను టార్గెట్ చేసినా పవన్ మౌనంగా నే ఉంటారని వ్యాఖ్యానించారు. టీడీపీ, జనసేన పని అయిపోయింది... అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బైరెడ్డి మండిపడ్డారు.