చంద్రబాబు తానా.. పవన్‌ తందానా  

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌పై అంబటి విమర్శలు

 అమారావతి : క్షమించరాని తప్పులు చేసిన చంద్రబాబును ప్రశ్నించని పవన్‌ కల్యాణ్‌ ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం వైయస్‌ జగన్‌పై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. చంద్రబాబు తానా అంటే పవన్‌ తందానా అంటున్నారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై నోరువిప్పని పవన్‌.. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వైఎస్‌ జగన్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి మాట్లాడుతూ.. ‘గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఇసుకను ఇష్టానుసారంగా తవ్వేశారు. అందుకనే గ్రీన్‌ ట్రిబ్యునల్‌ రూ.100 కోట్ల జరిమానా కూడా వేసింది. దీనిపై పవన్‌ ఎప్పుడైనా బాబును విమర్శించారా. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నూతన ఇసుక విధానం తెచ్చాం. వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక ప్రాజెక్టులన్నీ నిండాయి. వరదల వల్ల ఇసుక తీయలేని పరిస్థితి నెలకొంది. వరదలు తగ్గాక కావాల్సినంత ఇసుక లభిస్తుంది. భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే బాబు పనిగా పెట్టుకున్నారు. చావుతో రాజకీయాలు చేసే వ్యక్తి ఒక్క చంద్రబాబు మాత్రమే.

దాచేపల్లి ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు. సొంతపార్టీ నేతలు తప్పు చేసినా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చంద్రబాబు కోసమే పవన్‌ కల్యాణ్‌ రాజకీయాలు చేస్తున్నారు. పవన్‌ ప్రకాశం జిల్లాలో ఎందుకు ప్రకాశించలేకపోయారు.  నెల్లూరు జిల్లాలో ఎందుకు నేలమట్టమయ్యారు. మాకు చిరంజీవి, నాగబాబు, పవన్‌ కల్యాణ్‌ అంటే గౌరవం ఉంది. పవన్‌ మా అధినేతపై పనిగట్టుకుని విమర్శలు చేయొచ్చా’అని అంబటి ప్రశ్నించారు.

 

Read Also: ఆరోగ్య ప్రదాత..సీఎం వైయస్‌ జగన్‌

Back to Top