వేకెన్సీ రిజర్వ్ పేరుతో ఉద్యోగుల‌కు వేధింపులు

పోస్టింగులు, జీతాలు చెల్లించకుండా కక్ష సాధింపు..

వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో తమకు నచ్చని అధికారులపై వేధింపులు..

ప్రభుత్వ తీరుపై మండిపడ్డ వైయ‌స్ఆర్‌సీపీ ఎంప్లాయిస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు న‌ల‌మారు చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి.

వీఆర్ లో ఉన్న పోలీసులు, అధికారులు, సిబ్బందికి పోస్టింగులు ఇవ్వాలి..

మీ కింద సిబ్బందిని ఆదుకోవాల్సిన బాధ్య మీదే..

డీజీపీకి విజ్ఞప్తి చేసిన నలమారు చంద్రశేఖర్ రెడ్డి

పీ-4 పేరుతో ఉద్యోగుల వేధింపు సరికాదు..

పేదిరికం రూపుమాపే విధానం ఇది కాదు చంద్రబాబు గారూ..

మీ పార్టీ సంపన్నులు, ఎమ్మెల్యేలు దత్తత తీసుకొండి..

తేల్చి చెప్పిన చంద్రశేఖర్ రెడ్డి

ఉద్యోగులకు అబద్దపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు..

15 నెలలైనా ఉద్యోగుల సంక్షేమం ఊసే లేదు..

మీ మర్యాదకు భంగం రానీయమని చెప్పారు..

ఏకంగా ఎమ్మెల్యేలే వేధింపులకు దిగుతున్నారు..

మహిళా అధికారితో రాత్రి వీడియో కాల్ ఏంటి..?

ఇవి కచ్చితంగా లైంగిక వేధింపులే..

ఎమ్మెల్యే కూన రవికుమార్ మీద చర్యలు తీసుకొండి..

ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన చంద్రశేఖర్ రెడ్డి.

తాడేపల్లి: తమకు నచ్చని అధికారులను వేకెన్సీ రిజర్వు పేరుతో నెలల తరబడి పోస్టింగు లేకుండా, జీతాలివ్వకుండా వేధించడం సరికాదని  వైయ‌స్ఆర్‌సీపీ ఎంప్లాయిస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు న‌ల‌మారు చంద్ర‌శేఖ‌ర్‌ రెడ్డి కూటమి పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... పీ- 4 పేరుతో ఉద్యోగుల పేద కుటుంబాలని దత్తత తీసుకోవాలనడం సరికాదన్నారు. కావాలంటే టీడీపీలో ఉన్న సంపన్నులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు వందమందిని దత్తత తీసుకోవాలని సూచించారు. ఉద్యోగులకు అబద్దపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో నేడు అడుగడుగునా వారిపై దాడులు చేయడంపై మండిపడ్డారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకా ఏమన్నారంటే...

నచ్చని అధికారులే లక్ష్యంగా కక్షసాధింపు:

గతంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పనిచేసిన తమకు నచ్చని అధికారులను లక్ష్యంగా చేసుకున్న కూటమి ప్రభుత్వం.... వారిని వేకెన్సీ రిజర్వ్ (వీఆర్ ) పేరుతో పక్కన పెట్టింది. ఈ విధంగా వివిధ కేటగిరీలలో ఉన్న  సుమారు 199 మందిని ఈ విధంగా వీఆర్ లో పెట్టింది. 20 మందికి పైగా ఐపీఎస్ అధికారులు, ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, డియస్పీ, సీఐతో పాటు హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ వరకు 100 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టింగులు లేకుండా గాల్లో ఉంచింది. గతంలో చాలా ప్రభుత్వాలు, పార్టీలు వచ్చినా... రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను పరిరక్షించాల్సిన కీలకమైన పోలీస్ వ్యవస్ధలో కీలకమైన అడిషనల్ డీజీ, ఐజీ, డీఐజీ, ఎస్పీ కేడర్ లో ఉన్న అధికారులను పక్కనపెట్టి.. వారికి జీతాలు ఇవ్వకుండా వారిని పక్కనపెట్టారు.
మొన్నటికి మొన్న వీఆర్ లో ఉన్న అధికారులను హెడ్ క్వార్టర్స్ కి రండి అంటే..... పోస్టింగ్స్ వస్తాయని ఆశపడి వచ్చిన అధికారులను చాలా చిన్నచూపు చూస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న అధికారులను వీఆర్ పేరుతో హెడ్ క్వార్టర్స్ కి పిలిపించుకుని ఇక్కడే రోజూ వచ్చి సంతకాలు పెట్టాలని చెబుతున్నారు. ఇప్పటికే ఏదో ఒక జిల్లాలో పనిచేస్తున్న అధికారి తన కుటుంబం, పిల్లల చదువులు కోసం ఇప్పటికే అక్కడ ఇళ్లు తీసుకుని ఉంటారు. ఇప్పుడు మరలా ఇక్కడ జీతం లేకుండా పోస్టింగ్ లేకుండా మరో ఇళ్లు తీసుకుని ఉండాలా? వీఆర్ అంటే డ్యూటీలో ఉన్నట్టే అంటున్నారు. మరి ఎందుకు వీఆర్ లో ఉన్న అధికారులకు జీతాలు ఇవ్వడం లేదు ? దీనిపైనే పోలీస్ శాఖలో ఉన్నతస్ధాయి అధికారి మీద తిరుగుబాటు చేసి ప్రశ్నించారు. ఎంత పెద్ద అధికారి అయినా నిబంధలకు విరుద్దంగా వేధిస్తుంటే ఎవరైనా ఎంతకాలం భరిస్తారు? ఉద్యోగులమీద కేవలం కక్షసాధింపు చర్యలు చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే వీఆర్ లో ఉన్న ఉద్యోగులకు పోస్టింగులతో పాటు జీతాలు చెల్లించి వారి కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి, డీజీపీకి విజ్ఞప్తి చేస్తున్నాం.  రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారిగా తన కింద పనిచేసే సిబ్బంది సంక్షేమం కూడా చూడాల్సిన బాధ్యత డీజీపీపైన ఉంది. తోటి ఉద్యోగులను వీఆర్ పేరుతో నెలల తరబడి వేధించడం సరికాదు. భారతదేశంలో  మరే రాష్ట్రంలోనూ ఈ తరహా వేధింపులు లేవు. 

పీ-4 పేరుతో చిన్న ఉద్యోగులపై భారమా ?

మరోవైపు ప్రభుత్వం పీ-4 పేరు స్కీం పేరుతో బంగారు కుటుంబాలను గుర్తించి వాళ్లను దత్తత తీసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తుంది. పేదరికాన్ని రూపు మాపే విధానం ఇది కాదు.  పీ-4 పేరుతో ఉద్యోగులను వేధించడం సరికాదు. పేదరికంలో ఉన్న వారిని బంగారు కుటుంబాలుగా గుర్తించి వారిని దత్తత తీసుకునే మార్గదర్శక కుటుంబాలు ప్రభుత్వం నుంచి ఏమీ ఆశించకుండా ఎందుకు పేదరికంలో ఉన్న వారికి సాయం చేస్తారు ? అంటే డబ్బులున్నవారు,  పారిశ్రామికవేత్తలు, సంపన్నులు  దత్తత తీసుకుని వారు రూ.1  లక్ష సాయం చేస్తే.. వారికి ప్రభుత్వ నుంచి రూ.10 కోట్లు సాయం చేసినప్పుడు ఎవరూ ఆక్షేపించకుండా ఉండడానికే ఇలా చేస్తున్నారా ?

మీరు, మీ పార్టీ ఎమ్మెల్యేలు దత్తత తీసుకొండి: 

ఇక రాష్ట్రంలో ఉద్యోగులకు తమ బతుకే భారంగా ఉంటే వాళ్లను మరలా దత్తత తీసుకోవాలని వాళ్లను బలవంతం పెట్టడం ఎంతవరకు సమంజసం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇప్పటికే కొంతమందిని దత్తత తీసుకున్నట్టు తెలిసింది. మీలాగే మీ పార్టీకి సంబంధించిన రాజకీయనేతలు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు వంద మందినో, వేయిమందినో దత్తత తీసుకొండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ దయచేసి ఉద్యోగులను మాత్రం వేధించవద్దు. 
బంగారు కుటుంబాలకు ఏం కావాలో తెలుసుకొండి అంటూ దఫ,దఫాలుగా సర్వేల పేరుతో గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల మీద ఒత్తిడి తీసుకున్నారు. వారిని రాత్రి, పగలు తేడా లేకుండా ఇబ్బంది పెడుతున్నారు. గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పదోన్నతులు లేకుండా, ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు చెల్లించకుండా, పీ-4 పేరుతో సతాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పీ-4 కు సంబంధించి టార్గెట్లు విధిస్తున్న ప్రభుత్వం...  అధికంగా బంగారు కుటుంబాలను గుర్తిస్తే వారికి పదోన్నతులలో అదనపు పాయింట్లు ఇస్తామని చెబుతున్నారు. ప్రతి ఉద్యోగికి తన విధులేంటో... జాబ్ ఛార్టులో పొందుపరిచే ఉంటుంది.  అది కాకుండా పీ-4 పేరుతో ప్రభుత్వం రోజుకొకపనిచెబితే అది చేయాలో ఉద్యోగులకు అర్ధం కావడం లేదు. ప్రభుత్వం ఈ విషయాన్ని అర్ధం చేసుకోవాలి. పీ-4 కావాలంటే ప్రభుత్వం ప్రయివేటు వ్యక్తుల ద్వారానూ, పార్టీలో ఉన్న బడా పారిశ్రామిక వ్యక్తుల ద్వారా ఫండ్ రెయిజింగ్ చేసి ఈ కార్యక్రమాన్ని చేసుకోవాలి. 
ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం.. అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు రూ.1500 నెలకు ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీ గురించి అడిగితే మాట్లాడకుండా.. ప్రతిదానికి పీ-4 కి లింక్ పెడుతున్నారు. ఉద్యోగులపై ఈ రకమైన ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం.

ఎమ్మెల్యే రవికుమార్ పై చర్యలు తీసుకోవాలి: 

కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే ఉద్యోగుల మర్యాదకు భంగం కలగకుండా చూసుకుంటాం. అవమానాలు జరగనీయం అని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అడుగడుగునా అవమానాలే. కిందస్ధాయి నాయకుడు నుంచి పైస్దాయి వరకు అందరికీ అవమానాలే. ఎమ్మెల్యే ఆ నియోజకవర్గ ప్రజలు సంక్షేమం చూడాలి. ఎవరికైనా కష్టం వస్తే వారికి అండగా నిలబడాలి. ఒక ఒంటరి, దళిత మహిళా అధికారిని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులకు పాల్పడ్డం దుర్మార్గం. మహిళా అధికారిని పార్టీ కార్యాలయంలో రాత్రి పదిగంటల వరకు ఉండమని చెప్పడం, వీడియో కాల్స్ లోనే మాట్లాడతానని చెప్పడం ఏంటి ? మీరు గతంలోనూ ఉద్యోగుల మీద నోరు పారేసుకున్నారు. జాగ్రత్త రవి కుమార్ గారూ ? రాత్రి సమయంలో మహిలా ఉద్యోగులతో వీడియో కాల్స్ మాట్లాడాలి అని చెప్పడం ఖచ్చితంగా లైంగిక వేధింపు చర్యలే. మీరేమి ఎమ్మెల్యే ? తెలుగుదేశం పార్టీ  ఇలాంటి ఎమ్మెల్యేను తక్షణమే తొలగించాలి. మహిళా ఉద్యోగి ఆవేదనపై తక్షణమే విచారణ చేయించాలి. చర్యలు తీసుకోవాలి. ఉద్యోగుల పేరుతో అబద్దాలు చెప్పి, ఓట్లు వేయించుకుని మీరు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామన్న విషయాన్ని మర్చిపోవద్దు చంద్రబాబు గారూ? మీరు చెప్పింది ఒక్కటీ చేయడం లేదు? ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, రాయితీలు ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే మంచి పీఆర్సీ ఇస్తామన్నారు. ఇంతవరకూ ఆ ప్రక్రియే చేపట్టలేదు. నాలుగు డీఏలు పెండింగ్ లో ఉన్నాయి, ఒక్కటీ చెల్లించలేదు. డీఏ ఎరియర్స్, జీపీఎఫ్ లోన్, రిటైర్ మెంట్ బెనిఫిట్స్, మెడికల్ బిల్స్ , వాళ్లు దాచుకున్న సొమ్ముతో సహా దాదాపు రూ.25వేల కోట్లు బకాయిలు పెండింగ్ లో పెట్టిందీ కూటమి ప్రభుత్వం. ఉద్యోగుల కోసం ఒక మీటింగ్ పెట్టమని 14 నెలలుగా అడిగితే ఒక్కటంటే ఒక్క సమావేశం మాత్రమే ఏర్పాటు చేశారు.

ఇచ్చిన హామీలను నిలబెట్టుకొండి:

ఉద్యోగులకిచ్చిన ఒక్క హామీని అమలు చేయలేదు. ఒకటో తేదీన జీతాలు అని గొప్పగా చెప్పారు. ఓ వందమందికి ఇచ్చి.. చేతులు దులుపుకుంటున్నారు. ఉద్యోగుల హెల్త్ స్కీమ్ కూడా సక్రమంగా అమలు జరగడం లేదు. ప్రభుత్వం వైపు నుంచి చెల్లించాల్సిన కంట్రిబ్యూషన్ సకాలంలో చెల్లించకపోవడం వల్ల ట్రీట్మెంట్ సక్రమంగా జరగడం లేదు. జీపీఎస్ ని, సీపీఎస్ ని సమీక్షించి మంచి ఆమోదయోగ్యమై నపెన్షన్  స్కీం తెస్తామన్నారు.. దానికి సంబంధించి ఒక మీటింగ్ కూడా పెట్టలేదు. దీనిపై సుమారు మూడు లక్షల మంది ఉద్యోగులు వచ్చేనెల ఒకటో తేదీన బ్లాక్ డే గా పరిగణించి చలో విజయవాడ కార్యక్రమం చేపడుతున్నారు. వారికిచ్చిన వాగ్ధానం ఏమైంది. నిరుద్యోగభృతి ఏమైందో తెలియదు? ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాల భర్తీ అన్నారు. అదీ లేదు. గత ప్రభుత్వం కొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసింది. ఎన్నికల కోడ్ కారణంగా అది నిలిచిపోవడంతో సుమారు 7 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు.. రెగ్యులరైజేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీల కోసం వేచి చూసిన ఉద్యోగులు అవి అమలు చేయకపోవడంతో రగిలిపోయి ఉన్నారు, వారు కచ్చింతగా ఆందోళన బాట పట్టడం తధ్యమని చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా మహిళా ఉద్యోగులపై జరుగుతున్న అఘాయిత్యాలు, వేధింపులను నిరోధించే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Back to Top