అసెంబ్లీ: పరవాడ మండలంలో ఎన్టీపీసీని అనుకుని ఉన్న గ్రామాలు పిట్టవానిపాలెం, స్వయంభూవరం గ్రామాలు పొల్యూషన్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాయని, పొల్యూషన్ నుంచి ఈ రెండు గ్రామాలను కాపాడాలని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అదీప్రాజు సంబంధిత మంత్రిని కోరారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే అదీప్రాజు మాట్లాడుతూ.. ``పరవాడ మండలంలో ఎన్టీపీసీ ఉంది. దాన్ని అనుకుని ఉన్న గ్రామాలు పిట్టవానిపాలెం, స్వయంభూవరం గ్రామాలు. ఈ రెండు గ్రామాలు పొల్యూషన్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. పంటలు నాశనం అవుతున్నాయి. పాస్ఫరస్, పొటాషియం భూమిలో ఇంకిపోయాయని, సోడియం కార్బోనెట్ అత్యధికంగా పంట భూములను ఎఫెక్ట్ చేస్తోందని భూసార పరీక్షల్లో వెల్లడైంది. మెడికల్ హెల్త్ డిపార్ట్ మెంట్ వారు సర్వే చేసి ఇచ్చిన రిపోర్టులో కిడ్నీ సంబంధిత వ్యాధులు, కేన్సర్, చర్మ వ్యాధులు, ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపారు. కనుక ఈ ప్రాంత వాసులను పొల్యూషన్ బారి నుండి కాపాడేందుకు ఒక కమిటీవేసి తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత మంత్రిని కోరుతున్నాను.
సింహాచలం పెనుగాడి రోడ్డు నిర్మాణానికి 7.132కి.మీ 13.92 కోట్లు ఎన్డీపీ ద్వారా ఫేజ్-1లో మంజూరయ్యాయి. నగరం నుంచి చాలా నియోజకవర్గాలకు కనెక్టివిటీ ఉన్న రహదారి ఇది. పెందుర్తితో పాటు మాడుగుల, నర్సీపట్నం, పాడేరు, చోడవరం నియోజకవర్గాలకు వెళ్లడానికి ఇది మెయిన్ అప్రోచ్ రోడ్డు. పెందుర్తికే కాదు విశాఖకు ముఖద్వారంలా ఉన్న ప్రాంతం ఇది. ఈ రోడ్డు ఎన్డీపీలో ఉండటం వల్ల ఆర్ అండ్ బీ నుంచి కానీ జీవీఎంసీ నుంచి కానీ చిన్న ప్యాచ్ వర్క్ కూడా చేయలేని పరిస్థితిలో ఉంది. ఫస్ట్ ఫేజ్ లో ఉన్నా ఈ రోడ్డును కాంట్రాక్టర్ ఇంకా పనులు కూడా మొదలు పెట్టలేదు. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వేగంగా ఈ పనులు ప్రారంభం అయ్యేలా చూడాలని కోరుకుంటున్నాను.