తాడేపల్లి: కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన నలుగురు కూలీలు మృతి చెందడంపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని శ్రీనివాసపురం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన నలుగురు కూలీలు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం అందిందని, క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వైయస్ జగన్ కోరారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలని సూచించారు.