హైదరాబాద్: రాష్ట్రానికి మంచి చేసే దిశగా మీ సహకారాన్ని ఆశిస్తున్నానని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం రాష్ట్రంలోని తటస్థులు, మేధావులు, సమాజ సేవలో ఉన్న పలువురితో వైయస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి నుంచి వైయస్ జగన్ సలహాలు, సూచనలు స్వీకరించారు. ఆయా ప్రాంతాల్లో వారు చేస్తున్న విభాగాల్లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనేక అంశాలపై విపులంగా మాట్లాడిన వైయస్ జగన్ ఎలాంటి స్వార్థం లేకుండా సమాజానికి సేవచేస్తున్న మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి జిల్లాలోనూ మీలాంటి వాళ్లను కలుస్తానని పేర్కొన్నారు. నా జీవితం అంతా మీతో సంబంధం కొనసాగించాలన్నది నా ఆలోచన: అని స్పష్టం చేశారు. రాష్ట్రానికి మంచి చేసేదిశగా నేను చేస్తున్న పోరాటానికి మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలోని హామీల అమలులో బీజేపీ, టీడీపీలు విఫలమయ్యాయన్నారు. చట్టప్రకారం విశాఖపట్నానికి రైల్వే జోన్ రావాలన్నారు. దాదాపు అన్ని రాష్ట్రాలకూ రైల్వే జోన్ ఉందని, మనకు లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఇందు కోసం వైయస్ఆర్సీపీ పోరాటం కొనసాగుతుందన్నారు. రైల్వేజోన్ అంశంపైన నాకు పూర్తి అవగాహన ఉందన్నారు. కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదని, హంగ్ వచ్చే అవకాశాలున్నాయని సర్వేలు చెప్తున్నాయన్నారు. ఇదే జరిగితే రాష్ట్రాని కచ్చితంగా మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 25కి 25 ఎంపీ సీట్లు మన పార్టీకి వస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, విభజన చట్టంలోని హామీలు అమలు చేయించుకోవచ్చు అన్నారు. ఎన్నికలకు ముందు ఎవ్వరితోనూ పొత్తులు పెట్టుకోమని వైయస్ జగన్ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం సంతకం పెట్టిన తర్వాతనే కేంద్రంలో మద్దతిస్తామని వెల్లడించారు. మాటలు నమ్మి ఎన్నికలకు ముందు పొత్తులుపెట్టుకుంటే మోసపోతామన్నారు. కాపీ బాబును నమ్మకండి చంద్రబాబు సొంతంగా ఒక పథకం కూడా ప్రవేశపెట్టలేదని వైయస్ జగన్ విమర్శించారు. తాను ప్రకటించిన నవరత్నాల పథకాలను కాపీ కొడుతున్నారని ధ్వజమెత్తారు. పింఛన్ రూ.2 వేలు పెంచడం, రూ.10 వేలు పసుపు-కుంకుమ పేరుతో ఇస్తామని మభ్యపెడుతున్నారన్నారు. ఇన్నాళ్లు అధికారంలో ఉండి ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. కాపీ కొట్టడం చంద్రబాబుకు కొత్తేమి కాదన్నారు. గతంలో ఎన్టీఆర్ రూ.2లకు కిలోబియ్యం ఇస్తానంటే.. కోట్ల విజయభాస్కర్రెడ్డి రూ.1.90 పైసలకు ఎన్నికలకు 6 నెలల ముందు ప్రకటించారన్నారు. అప్పుడు మాదిరిగా ఇప్పుడు చంద్రబాబు కూడా చేస్తున్నారన్నారు .అప్పట్లో ప్రజలు ఎన్టీఆర్కే పట్టం కట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు చంద్రబాబు విషయంలోనూ అంతే జరుగుతుందన్నారు . ఒక పిల్లాడు కష్టపడి పదోతరగతి పరీక్షరాస్తాడని, పక్కనే ఉన్న ఇంకో పిల్లాడు అస్సలు చదవడు, మోసాలు చేసి కాపీకొడతాడు, చివరకు ఎంతైనా కాపీ కొడతాడన్నారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అంతేనని వైయస్ జగన్ వివరించారు. ఈ సందర్భంగా మేధావులు, తటస్థులు వైయస్ జగన్కు మద్దతుగా ఉంటామని పేర్కొన్నారు.