సంక్షేమం..అభివృద్దే అంతిమలక్ష్యం.. సాధించితీరుతాం

సుధృడ సంకల్పంతో ముందడుగులు
 

ప్రజలదే అంతిమ విజయం. సామాన్యులదే విజయగీతం. ప్రజాస్వామిక గాలుల్ని స్వేచ్చగా పీల్చాలని జనబాహుళ్యం కోరుకుంటున్న సమయమిది. నేలవిడిచి సాముచేసే రాజకీయాలకన్నా... అందరి ప్రభుత్వం, ప్రజలందరి ప్రభుత్వం కావాలనుకుంటున్న కాలమిది. నాయకులు కావాలనుకుంటున్నవారు, నిజమైన ప్రజాసేవకులుగా వుండాలని ప్రజలు బలంగా కోరుకుంటున్న కొత్తరాజకీయాల కాలమిది. ఇప్పుడు నాయకుడు వట్టిమాటలతోనే నెట్టుకురాలేరు. గట్టిమేల్‌ తలపెట్టందే నెట్టుకురాలేరు. ప్రజలిప్పుడు చూస్తున్నారు. అర్థం చేసుకుంటున్నారు. తమ జీవితాల్లో వస్తున్న మార్పులకు కారణాలను పసిగట్టగలుగుతున్నారు. ఆ దిశలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త చైతన్యంతో కదం తొక్కుతోంది. ప్రజాసంక్షేమం, రాష్ట్రాభివృద్ది విషయంలో రాజీపడని ధోరణిలో దృఢంగానూ...వడివడిగానూ అడుగులు ముందుకు వేస్తున్నది.

దేశంలో ఇప్పుడు ఒక ప్రయోగశాలలాగా కనిపిస్తున్న ఆంధ్రప్రదేశ్‌లో వైయస్‌ జగన్‌ నాయకత్వంలోని ప్రభుత్వం...అపరభగీరధ ప్రయత్నాలతో అద్భుతఫలితాలు సాధించాలని ఒక దీక్ష చేపట్టినట్టు పాలన సాగిస్తోంది. వైయస్‌ జగన్‌ పాదయాత్ర రాష్ట్రభవిష్యత్‌ దశాదిశను నిర్దేశిస్తూ, ఓ రూట్‌మ్యాప్‌ గీసేసింది. అప్పుడు పడ్డ ఆ అడుగులు... ఇప్పుడు ఆచరణలో అద్భుతఫథకాలు రూపుదిద్దుకునేలా చేస్తున్నాయి.
ఎన్నికల్లో వైయస్సార్‌సీపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కనివినీ ఎరుగని రీతిలో అఖండవిజయాన్ని అందించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మొదటిరోజునుంచే వైయస్‌ జగన్‌ అనితరసాధ్యమైన రీతిలో తనదైన రీతిలో ప్రజాపాలన సాగిస్తున్నారు. పట్టుమని ఎనిమిది నెలల కాలం కూడా కాకముందే, ఎన్నెన్నో  సంక్షేమ పథకాలు పేదల ఇళ్లముందుకు వచ్చాయి. వారి గడపల్లోకి అడుగుపెట్టాయి. ఆ ఇళ్లలో ...బతుకుజీవుడా అని ఇన్నాళ్లు ఎదురుచూసిన  ఆ కళ్లల్లో వెలుగులు నింపుతున్నాయి. ఆ మొహాల్లో నవ్వులు మెరిపిస్తున్నాయి. ప్రజలకు ఉపయోగపడుతుందని ఆలోచన రావడం ఆలోస్యం, ఓ మంచి పథకానికి రూపకల్పన జరిగిపోయినట్టే. అంతేవేగంగా అది ఆచరణలోకి వచ్చినట్టే.

అధికారపార్టీ తన మేనిఫెస్టోలో చెప్పినట్టే...తు.చ.తప్పకుండా ప్రతి హామీని నెరవేర్చేప్రయత్నం చేస్తోంది. ఆ దిశలో ఇప్పటికే తొంభైశాతం హామీలను ప్రజాజీవనంలో పట్టాలెక్కించింది.
మేనిఫెస్టోలో చెప్పినట్టే, నవరత్నాలు ఒక్కొక్కటిగా అందాయి. మిగిలిన ఒకటీరెండు త్వరలో అందబోతున్నాయి. చాలా పథకాలు ఐదేళ్లపాటు ప్రజలకు అందేవి. సంక్షేమపథకాలు స్వచ్చమైన వెలుగుల్లా ఆంధ్రప్రదేశ్‌లోని కోట్లాది సామాన్యజనం జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. రైతుభరోసా పథకం నుంచి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ఉపయోగపడే పథకాల వరకు, చేనేతలకు చేయూత నుంచి, ఆరోగ్యశ్రీ వరకు ఒక్కొక్కటిగా...ప్రజలను అబ్బురపరుస్తూనే వున్నాయి. ఆనందాన్ని కలిగిస్తూనే వున్నాయి. గడ్డు పరిస్థితుల రాష్ట్రంలో ఆశల చివుళ్లు తొడుగుతున్నాయిప్పుడు. ప్రజాజీవితానికి ఒక భరోసా దొరికిందిప్పుడు. పెద్దల బతుకులకు, పిల్లల భవిష్యత్తుకు ఓ గ్యారంటీ కార్డులా కనిపిస్తోందిప్పుడు రాష్ట్రప్రభుత్వం. మద్యపాననిషేధం విషయంలో చిత్తశుద్దితో కూడిన అడుగులు, మహిళా సంరక్షణ విషయంలో సాహసిక నిర్ణయాలతో పాటు, ప్రజాజీవితాన్ని అపారంగా ప్రభావితం చేసే, విద్యావైద్యరంగాల్లో ప్రభుత్వం ఆలోచనలు కానీ, నిర్ణయాలు కానీ విప్లవాత్మకమైనవి.

నిస్సందేహంగా ఇప్పుడు ఏపీలో నడుస్తోంది సామాన్యుడి ప్రభుత్వం. అయితే అసామాన్యమైన ఆలోచనలతో ముందుకు సాగుతున్నది. ప్రజలకు సంతోషాన్ని కలిగించేది, వారి జీవితాలకు ఉపయోగపడేది అనిపించిన ప్రతి అవసరాన్ని తీర్చడం ప్రభుత్వం కర్తవ్యంగా భావిస్తోంది. అదే సమయంలో భావితరాల భవిష్యత్తుకు, వారి చదువులకు, ఉపాధికి సంబంధించిన ఈ ప్రభుత్వం ఆలోచనలు ఎన్నదగినవి. ప్రశంసించదగ్గవి.
సంక్షేమపథకాల విషయంలోనే కాదు, రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ది విషయంలోనూ సవ్యమైన ఆలోచనలే చేస్తున్నారు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి. అటు నీటిపారుదల రంగం గురించి, ఇటు విద్యుత్‌ రంగం గురించి, మరోవైపు పెట్టుబడులు, పరిశ్రమలు ఉపాధివరకు ఆయనకు స్పష్టమైన ఆలోచనలే వున్నాయి. వాటిని సాధించే పట్టుదలా వుంది. సరైన దిశానిర్దేశం చేయగలిగే సామర్ధ్యం వుంది. తగిన ప్రణాళికలు తయారుచేసే దార్శనికతా కనిపిస్తోంది. రాష్ట్రం ఇప్పుడు  ఓ పాలకుడి చేతుల్లో భద్రంగా వుంది. ఆయనే తరచూ చెబుతున్నట్టు...దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు, ప్రేమాభిమానాలు అందినంతకాలమూ అనుకున్న లక్ష్యాలు సాధించడం పెద్ద కష్టం కాదు. అందుకు తగ్గ చిత్తశుద్ది వున్న నాయకుడు ఏపీ సీఎం వైయస్‌ జగన్‌.

Back to Top