విజయవాడ: ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఇంద్ర కీలాద్రి దసరా ఉత్సవాలకు రావాలని ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆహ్వానించారు. ఈ మేరకు తాడేపల్లి నివాసంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిని మంత్రి వెలంపల్లి, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఆలయ ఈవో సురేష్ కుమార్, ఆలయ వేదపండితులతో కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. ఉత్సవాలలో అమ్మవారికి జరిగే ప్రత్యేక సేవలను సీఎంకు మంత్రి వివరించారు. దసరా ఉత్సవాలకు విశేష సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఆలయ అధికారులు, పోలీసులు సమన్వయం చేసుకొని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.