వ‌చ్చే నెల‌లో ఏకాంతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు   

టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి 
 

తిరుమల:సెప్టెంబర్ 19 నుంచి 28 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న‌ట్లు టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. అధిక మాసం సందర్భంగా ఈఏడాది రెండు బ్రహ్మోత్సవాలు నిర్వ‌హిస్తున్నామ‌న్నారు.  కరోనా ఉధృతి తగ్గితే అక్టోబర్‌లో బ్రహ్మోత్సవాలు వెలుపల నిర్వ‌హిస్తామ‌న్నారు. టీటీడీ పాల‌క మండ‌లి స‌మావేశం శుక్ర‌వారం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు.  ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలలో 214 గదుల వసతి గృహ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో విడతల వారిగా హాస్టల్ నిర్మాణం చేపట్టాలని బోర్డు  సూచించింది. టీటీడీ బంగారు నగలు, డిపాజిట్లతోపాటు పలు విషయాలపై పాలకమండలి శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షార్ట్‌ టర్మ్‌ డిపాజిట్‌ చేయడం వల్ల తక్కువ వడ్డీ వస్తుందని, లాంగ్ టర్మ్ డిపాజిట్ చేస్తే ఎక్కువ వడ్డీ వస్తుందన్న సభ్యులు తెలిపారు. అలాగే హుండీ ద్వారా రద్దయిన నోట్లు వస్తున్నాయని, ఇప్పటి వరకు రూ.50 కోట్లు పాత నోట్లు వచ్చినట్లు తెలిపారు. ఈ విషయంపై రిజర్వు బ్యాంకుకు అనేకసార్లు లేఖ రాసినట్లు పాలకమండలి సభ్యులు వెల్లడించారు. మరోసారి కేంద్రం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు.  

బంగారు డిపాజిట్ పై చర్చించిన సాలక మండలి వాటిని 12 సంవత్సరాలు లాంగ్ టర్మ్ డిపాజిట్ చెయ్యాలని  నిర్ణయించారు. పాలకమండలి సభ్యుడు పార్థసారథి అభ్యర్థన మేరకు విజయవాడ, పోరంకిలో కళ్యాణమండపం నిర్మాణానికి  ఆమోదం తెలిపారు. అలాగే తిరుమలలో పేరుకుపోయిన వ్యర్థాలపై చర్చించారు.  తిరుమలలో పెరుకుపోయినట్లు 7 టన్నులు వ్యర్థాలను  తరలించడానికి టీటీడీ బోర్డు సభ్యురాలు సుధా నారాయణమూర్తి ఆర్థిక విరాళం అందించారు. వీటితోపాటు  టీటీడీ ఎలక్రికల్ విభాగంలో పని చేస్తున్న 53 మంది కార్మికుల కాంట్రాక్టు మరో రెండు సంవత్సరాల పెంపుకు ఆమోదం తెలిపింది. సింగరాయకొండ ఆలయం ప్రాంగణంలో టీటీడీ కళ్యాణమండపం నిర్మాణానికి పాలక మండలి ఆమోదం తెలిపింది.   బర్డ్ ఆస్పత్రిలో రూ.5.5కోట్లతో అదనపు గదుల  నిర్మాణానికి టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపిన‌ట్లు వైవీ సుబ్బారెడ్డి వెల్ల‌డించారు.  

Back to Top