తాడేపల్లి: వ్యక్తిగత వ్యాఖ్యలను కులానికి అన్వయించడం సిగ్గుచేటని, వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిపై ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాలని డీజీపీకి ఫిర్యాదు చేయడం దుర్మార్గమని వైయస్ఆర్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు ధ్వజమెత్తారు. సాంఘీక సంక్షేమ బోర్డు చైర్మన్ బాలకోటయ్య మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ అంశంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, వాటిని ఖండించిన కారుమూరి వెంకటరెడ్డిపై డీజీపీకి ఫిర్యాదు చేయడం సరికాదని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన తప్పుపట్టారు. వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలను ఒక సామాజిక వర్గానికి అన్వయించడం సరికాదని, ఇది చట్టాలను దుర్వినియోగం చేసే ప్రయత్నంగా ఆక్షేపించారు. ప్రెస్మీట్లో కొమ్మూరి కనకారావు ఏమన్నారంటే.. - పిచ్చి బాలకోటయ్య అంటే సామాజిక వర్గాన్ని అవమానించినట్లా? సాంఘిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య నిన్న డీజీపీకి మా పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిపై ఫిర్యాదు చేశారు. ‘పిచ్చి బాలకోటయ్య’ అన్నందుకు తన సామాజిక వర్గాన్ని అవమానించారంటూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని కోరడం దుర్మార్గం. కారుమూరి వెంకటరెడ్డినే కాదు.. నేను కూడా అంటాను..పిచ్చి బాలకోటయ్య. నీవు పిచ్చి తుగ్లక్ మాదిరిగా మాట్లాడుతున్నావు. - జగన్ను ‘పిచ్చి’ అని వ్యాఖ్యానించలేదా? రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన శ్రీ వైయస్ జగన్ గారిని మీరు గతంలో ‘పిచ్చి’ అని వ్యాఖ్యానించలేదా? మూడు రాజధానులు అన్నందుకు ‘సగం పిచ్చి’, మావిగన్ అన్నందుకు ‘పూర్తి పిచ్చి’ అని మాట్లాడినప్పుడు అది ఏ వర్గాన్ని అవమానించినట్టు. అది కూడా ఆ సామాజిక వర్గానికి అన్వయించాలా?. ప్రజల ఆదరణ పొందిన మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిని అలా విమర్శించిన మీరు, ఇప్పుడు అదే పదం మీపై వాడితే కులానికి అన్వయించడం ఎందుకు?. - రాజధాని పేరుతో దోపిడీ రాజధాని పేరుతో అమరావతిలో 7 సంవత్సరాలుగా చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వైయస్ జగన్ గారు మావిగన్ ప్రతిపాదన చేశారు. మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు కారిడార్గా రాజధాని ఏర్పాటు చేస్తే తక్కువ ఖర్చుతో అభివృద్ధి సాధ్యమని చెప్పారు. దీనికి సమాధానం చెప్పలేక మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో భూ దోపిడీ జరుగుతుంటే, ఎస్సీ, ఎస్టీల భూములు అన్యాక్రాంతం అవుతుంటే బాలకోటయ్య ఎక్కడ ఉన్నారు? 50 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే వాటిని అడ్డుకున్నప్పుడు మీ స్పందన ఏమిటి? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రజల పక్షాన నిలబడి మాట్లాడాలి. - కారుమూరిపై ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టడం సమంజసమా? ఇవాళ కారుమూరి వెంకటరెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడని ఆయనపై ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం? రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నప్పుడు మాట్లాడని మీరు, ఇప్పుడు రాజకీయంగా కేసులు పెట్టడం సిగ్గుచేటు. మావిగన్ ప్రతిపాదనపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి. కారుమూరి వెంకటరెడ్డిపై పెట్టిన కేసును వెంటనే వెనక్కి తీసుకోవాలి అని కొమ్మూరి కనకారావు డిమాండ్ చేశారు.