‘జగనన్నకు చెబుదాం’పై టీడీపీ నీచ రాజకీయం

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి, ఎమ్మెల్యే టీజేఆర్ సుధాక‌ర్‌బాబు

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అమరావతిలో ఇళ్లు ఇవ్వకూడదా?

పేదల ఇళ్లకు ఎందుకు అడ్డుపడుతున్నారు ?

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై మీకెందుకు అంత వ్యతిరేకత

చంద్రబాబుకు అణువణువునా అస్పృశ్య‌త ఉంది

పేదలకు ఇళ్లు ఇస్తుంటే చంద్రబాబు కళ్లలో రక్తకన్నీరు వస్తోంది

ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కుయుక్తులు 

ప్రజల నిజ­మైన ఫిర్యాదుల పరిష్కా­­రానికి అవకాశం ఇవ్వకుండా రాజకీయ డ్రా­మాలు

తాడేప‌ల్లి: ప్రజల సమస్యల్ని పరిష్క­రిం­చడం కోసం ప్రభుత్వం ప్రారంభించిన ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంపై టీడీపీ నీచ రాజకీయాలకు తెరతీసింద‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి, ఎమ్మెల్యే టీజేఆర్ సుధాక‌ర్‌బాబు మండిప‌డ్డారు. మీడియా సాక్షిగా జగనన్నకు చెబుదాం గ్రీవెన్స్‌ సెల్‌కు టీడీపీ నేత వర్ల రామయ్య, కార్యకర్తలు మూ­కుమ్మడిగా ఫోన్లు చేసి వెటకారంగా మాట్లా­డుతూ ఉద్యోగులను వేధింపులకు గురిచేయ‌డాన్ని సుధాక‌ర్‌బాబు తీవ్రంగా ఖండించారు. ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించ‌డం సిగ్గు చేటు అన్నారు. ప్ర‌తిప‌క్షాల‌కు ప్ర‌శ్నించేందుకు స‌మ‌స్య‌లు లేక ప్ర‌భుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా ఇష్టం వచ్చినట్లు వ్యవ­హరిం­చడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల నిజ­మైన ఫిర్యాదుల పరిష్కా­­రానికి అవకాశం ఇవ్వకుండా రాజకీయ డ్రా­మాలాడడం టీడీపీ నైజానికి నిదర్శనమని విమ‌ర్శించారు.  పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాలు ఇస్తుంటే చంద్ర‌బాబు అడ్డుప‌డుతున్నార‌ని, ఆయ‌న క‌ళ్ల‌లో ర‌క్తం కారుతుంద‌న్నారు. బుధ‌వారం వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో టీజేఆర్ సుధాక‌ర్‌బాబు మీడియాతో మాట్లాడారు. 

అమరావతిలో అణగారిన వర్గాలకు నివసించే హక్కు ఎందుకు లేదు?
- అమరావతి రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును టీడీపీ, దాని అనుబంధ సంఘాలు వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లిన విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను పూర్తిగా ఖండిస్తున్నాను.
- 54 వేల మంది పేద వాళ్లకు, నివసించడానికి ఆవాసం లేని అభాగ్యులకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌గారు ఒక గూడును కల్పిస్తుంటే అడ్డుకోవాలని ప్రయత్నించటం దుర్మార్గం. 
- హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించాల్సింది పోయి తిరిగి సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేయడం దారుణం.
- అమరావతి రాజధాని ప్రాంతం అంటే... అదేదో గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాంతంగా, కొంత మంది మాత్రమే నివాసం ఉండే ప్రాంతంగా మీరు అభివర్ణించడం దిక్కుమాలిన రాజకీయం. 
- అక్కడ నారా చంద్రబాబుకు సంబంధించిన వారు మాత్రమే ఉండాల్సిన సామ్రాజ్యంగా మార్చేశారు. 
- అమరావతి ప్రాంతంలో అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదవారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడంపై ఎందుకు మీకు వ్యతిరేకత అని ప్రశ్నిస్తున్నా.
- అంటరానితనం అనే పదాన్ని చంద్రబాబు ఓన్‌ చేసుకుని... అమరావతిని అంటరాని అమరావతిగా మార్చేశాడు.
- పేదవాళ్లెవరూ అక్కడ నివాసం ఉండటానికి యోగ్యత లేదని చెప్పాడు.  పేదవాళ్లు నివసించలేని రాజధానిని మేం ఏవిధంగా చూడాలి..?. ఎందుకు మాకు అక్కడ నివసించడానికి అర్హత లేదని మేం సూటిగా అడుగుతున్నాం. 
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆ ప్రాంతంలో నివసిస్తే నీకు, నీ సామ్రాజ్యానికి వచ్చిన ఇబ్బంది ఏంటని చంద్రబాబును ప్రశ్నిస్తున్నాం. 
- చంద్రబాబు తన సహజసిద్ధ అంటరానితనంతో కూడిన భావజాలంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలపై వ్యతిరేకతను చూపిస్తున్నాడు.
- వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాలకు అండగా నిలవడంతో, చంద్రబాబు, ఆయనకు కొమ్ముకాసే ఈనాడు రామోజీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లాంటి పెత్తందార్లు తట్టుకోలేకపోతున్నారు. 

చంద్రబాబులో అనువణువునా అస్పృశ్యత ఉంది:
- ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి,  ఏ మాత్రం సిగ్గులేకుండా అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వీళ్లేదని చెప్పడం ఆయన చర్యలకు పరాకాష్ట.
- 76 ఏళ్ల స్వతంత్య్ర భారతంలో, ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లోనూ మా అణగారిన వర్గాలకు అమృతం దొరకడం లేదు. 
- చంద్రబాబు లాంటి కుహనా రాజకీయ నాయకులు మాత్రం ఇంకా మాపై విషాన్ని చిమ్ముతూనే ఉన్నారు. 
- ఇది చంద్రబాబు సహజసిద్ధమైన వికృత రాజకీయ చర్య..ఆయనలో అనువణువునా అస్పృశ్యత ఉంది. 
- చంద్రబాబు రాజకీయ జీవితం మొత్తాన్ని చూస్తే కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో చిచ్చు పెట్టడమే
- చంద్రబాబు మమ్మల్ని అంటరాని జాతులుగానే ఇంకా  ఉంచాలనుకుంటున్నాడని భావిస్తున్నాం. 
- అమరావతి ప్రాంతంలో సేకరించిన 50 వేల ఎకరాల సువిశాలమైన ప్రాంతంలో... 50వేల మంది పేదలకు సెంటున్నర స్థలం ఇస్తే, మీకు ఎందుకు అంత ఉక్రోషం వచ్చింది..?
- పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంపై సహేతుకమైన కారణం ఒక్కటీ చూపకుండా అడ్డుకోవాలని చంద్రబాబు చూస్తున్నాడు. 
- సెంటు భూమి కోసం యుద్ధాలు చేసిన కమ్యూనిస్టు పార్టీలు కూడా.. ఇప్పుడు ఎందుకు చంద్రబాబుకు మద్దతిస్తున్నాయో అర్ధం కావడం లేదు. 

నువ్వెన్ని కుట్రలు చేసినా నీ ఆటలు సాగవు బాబూ..:
- మిస్టర్‌ చంద్రబాబు..నువ్వు ఎన్ని కుట్రలు చేసినా నీ ఆటలు ఇక సాగవు. 
- ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ, పేద వర్గాలల నాయకుడిగా, వారి కోసమే పుట్టిన వాడిగా 2019లో శ్రీ వైఎస్‌ జగన్‌ అనే పాలకుడు పుట్టాడు. 
- నీ నీతిమాలిన, వికృత, నికృష్ణ రాజకీయాలకు జగన్‌ గారి సుపరిపాలనే సమాధానం చెబుతోంది. 
- చంద్రబాబు తాను ఊహించుకున్న అమరావతి కోటలు బద్దలు అవుతున్నాయని ఉక్రోషం పట్టలేక జగన్‌ గారిపై మాటలతో దాడి చేస్తున్నాడు. 
- జగన్‌ గారు పేదలకు సాయం చేయాలని ప్రయత్నం చేసిన ప్రతి సారీ చంద్రబాబు దయ్యంలా అడ్డు పడ్డాడు. 
- జగన్‌ గారు అమరావతి ప్రాంతంలో పాదయాత్ర చేస్తే అన్ని కులాలు ఆయనకు బ్రహ్మరథం పట్టాయి. 
- కానీ చంద్రబాబు మాత్రం తన సహజసిద్ధమైన అంటరాని ధోరణితో ఆ ప్రాంతం మొత్తం పసుపు నీళ్లతో కడిగించాడు. 
- మాకు అమరావతి ప్రాంతంలో పాదయాత్రలు చేసే అధికారం లేదా..?
- ఇప్పుడు పేదలు నివసించేందుకే అనర్హులు అని చెబుతున్నావంటే నిన్ను ఏమనాలి చంద్రబాబూ..? 

వ్యవస్థలను భ్రష్టు పట్టించినవాడు చంద్రబాబు:
- బడుగు బలహీన వర్గాలకు ఈ ప్రభుత్వం సాయం చేసేందుకు ముందుకు వచ్చిన ప్రతి సారీ చంద్రబాబు, ఆయన చుట్టూ ఉన్న ఎల్లో కార్పొరేట్‌ శక్తులు అడ్డుపడుతూనే ఉన్నారు. 
- పేదలకు ఇంగ్లీష్‌ మీడియం విద్య నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా.. వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మరోవైపు కోర్టుల ద్వారా అడ్డుకుంటూనే ఉన్నారు.
- ఈ దేశంలో వ్యవస్థలను భ్రష్టు పట్టించిన వాడు నారా చంద్రబాబునాయడు.  వ్యవస్థలను వాడుకోవడం ఎలా అని గ్రంథం రాస్తే చంద్రబాబుపైనే రాయాలి. 
- రాజధానిలో ఇళ్లు ఇస్తే పేద వర్గాల్లో ఆనందభాష్పాలు వస్తున్నాయి.. కానీ చంద్రబాబుకు, ఆయనకు వత్తాసు పలికే ఎల్లో బ్యాచ్ కు మాత్రం రక్త కన్నీరు వస్తోంది. 
- తన కుటిల రాజకీయానికి జగన్‌గారు ఫుల్‌స్టాప్‌ పెట్టాడనే చంద్రబాబుకు ఈ ఉక్రోషం. 

ఆ భూమిని ఇలానే వాడాలనే హక్కు ఎవరికీ లేదు:
- అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ ప్రజాభిప్రాయంతో, అందరి అంగీకారంతో ఏర్పడిందా..? అంటే లేదు.  రైతుల పేరుతో అడ్డుకోవడం ఏంటి..ఎక్కడన్నా ఉందా ఈ చోద్యం. 
- రైతులకు, ప్రభుత్వానికి మధ్య ఉన్న ఒప్పందం ఈ రోజుకీ రద్దు కాలేదు. 
- ప్రభుత్వానికి భూమి ఇచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో ప్రభుత్వం తనకు నచ్చిన విధంగా భూమిని వినియోగించుకునే హక్కు రాజ్యాంగ పరంగా ఉంది. 
- ఆ భూమిని ఇలానే వాడాలి అని చెప్పే అధికారం ఎవరికీ లేదు. 
- అమరావతిలో శాసన రాజధాని ఉండి తీరుతుంది..  విశాఖలో పరిపాలన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఉంటుంది.
- సరైన సమయంలో ఆ బిల్లును శాసనసభలో ప్రవేశ పెడతారు. 
- సెప్టెంబర్‌ నుంచి ముఖ్యమంత్రి గారు విశాఖలో నివసించబోతున్నారు.

సమస్యలు జగనన్నకు చెప్పమన్నా అపహాస్యమేనా..?:
- ప్రజల సమస్యలను మరింత వేగంగా పరిష్కరించటం కోసం.. సీఎంవో నుంచి  స్థానిక అధికారుల వరకు అందర్నీ భాగస్వాములను చేస్తూ,  జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. 
-  వర్ల రామయ్యను టీడీపీ ఆఫీసులో కూర్చోబెట్టి... ఆ కార్యక్రమాన్ని అవహేళన చేసే విధంగా చంద్రబాబు పనికిమాలిన రాజకీయం చేస్తున్నాడు. 
- ఇందుకోసమేనా చంద్రబాబు రాజకీయాల్లో ఉంది. అంతటి మంచి కార్యక్రమాన్ని ఒక ప్రతిపక్ష పార్టీగా ఎందుకు స్వాగతించలేదు..?
- గుడ్‌ గవర్నెన్స్‌ ఇవ్వాలని, ఒక యువ ముఖ్యమంత్రికి  వచ్చిన ఆలోచనను మెచ్చుకోవాల్సిందిపోయి, రాజకీయ విమర్శలు చేయడానికి మీకు సిగ్గు ఎక్కడ లేదు..?
- వర్ల రామయ్య సహేతుకమైన సమస్యలను ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే బాగుండేది. 
- అర్హత కలిగిన ప్రతి వర్గానికీ, పేదవానికి న్యాయం చేయాలనే సంకల్పంతో జగనన్నకు చెప్పండి అన్నాడు. 
- జగన్‌ గారు ప్రతిపక్షానికి ఒక చాలెంజ్‌ కూడా విసిరారు. మీకు చెప్పడానికి సమస్యలు లేక టీడీపీ ఆఫీసులో కూర్చుని గేలి చేయడం అనైతికం. 
- అంటే మీ దగ్గర సమస్యలు లేవని అర్ధం అవుతోంది. 

బాబు అండ్‌ కో ఆర్ధిక పుష్టి తగ్గితే.. రాష్ట్రం దివాళా తీసినట్టా రామోజీ..?:
- ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధిక వ్యవస్థ గురించి ఓ నిపుణుడు చెప్పాడు..ఈనాడు రామోజీ రాశాడు. 
- స్వయం ప్రకటిత ఆర్ధిక నిపుణులు..అలా మాట్లాడటానికి సిగ్గుండాలి. 
- పింఛన్, అమ్మ ఒడి లాంటి అనేక పథకాలు అందించడం తప్పా..? 
- నువ్వు ఎక్కడ చదివావు.. రాష్ట్ర సంపద.. ఆరాష్ట్రంలో నివసించే ప్రజల కోసం కాదా..?
- ఆ నలుగురు సంపాదించుకుంటేనే ఆర్ధిక వ్యవస్థ బాగున్నట్టా...
- పేదవాడికి రూ. 2.08 లక్షల కోట్ల డీబీటీ ద్వారా నేరుగా వారి అకౌంట్లల్లోకి వెళితే అది మీకు నచ్చడం లేదు...
- బుద్ధి ఉన్నవాడు ఎవడైనా.. పేదలకు కడుపునిండా అన్నం పెట్టే జగన్‌ గారి పరిపాలన చూసి హర్షిస్తున్నారు. 
- కోవిడ్‌ మహమ్మరి వస్తే.. పేదవాడికి నేరుగా డబ్బులిచ్చి కొనుగోలు శక్తి పెంచిన మానవతావాది, ముఖ్యమంత్రి జగన్‌ గారు. 
- పచ్చదండు మేథావుల ముసుగులో..  వారి మాటలను మీ ఎల్లో పత్రికల్లో అచ్చేసి, మీ భావజాలాన్ని ప్రచారం చేసుకోవడం దుర్మార్గం. మీ ఎత్తులన్నీ ప్రజలకు తెలుసు. మీకు ఎప్పుడు, ఎలా బుద్ధి చెప్పాలో అప్పుడు చెబుతారు. 

Back to Top