రాజమండ్రి: నకిలీ మద్యం తయారీలో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ప్రభుత్వం, ప్రజలకు సమాధానం చెప్పలేక ఆ బురదను వైయస్ఆర్సీపీ నేతలకు అంటించే ప్రయత్నం చేస్తుందని మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. రాజమండ్రి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... నకిలీ లిక్కర్ వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లు తలూపే సిట్.. టీడీపీ నేతలపై కేసు నమోదు చేసి, సక్రమంగా దర్యాప్తు చేస్తుందన్న నమ్మకం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... ● సీబీఐతో విచారణ చేయించాల్సిందే... ములకల చెరువు దగ్గర చంద్రబాబు ప్రభుత్వం నకిలీ మద్యం తయారు చేసే అతిపెద్ద ఇండస్ట్రీ తీసుకొచ్చింది. ఈ లిక్కర్ కేసులో జనార్ధనారావు అనే నిందితుడు తొలుత ఈ వ్యవహారంలో ఎవరికీ సంబందం లేదని చెప్పారు. తర్వాత టీడీపీ నేతల ఒత్తిడితో రెండున్నర సంవత్సరాలుగా నకిలీ మద్యం తయారు చేస్తున్నామని చెప్పారు. ఈ కేసులో తొలుత ఎక్సైజ్ అధికారులు సైతం నకిలీ మద్యం తయారీ రెండు మూడు నెలలుగా జరుగుతుందని చెప్పారు. అక్టోబరు 6 వతేదీన ఆఫ్రికా నుంచి వీడియో విడుదల చేసిన జనార్ధనరావు విడుదల చేసిన వీడియోలో ప్రకటన, అధికారులు అదుపులోకి తీసుకున్న తర్వాత విడుదల చేసిన వీడియో చూస్తే వాస్తవాలు ఎవరికైనా అర్ధం అవుతాయి. ముంబాయిలో జనార్ధరావు ఫోన్ పోయిందని చెప్పారు. అలాంటప్పుడు వీడియో ఎలా బయటకు వచ్చింది. చంద్రబాబు ప్రజలు చెవిలో క్యాబేజీ పువ్వులు పెట్టుకున్నారని అనుకుంటున్నారా? నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితులు జయచంద్రారెడ్డి. ఆయన వైయస్సార్సీపీ కోవర్ట్ అంటున్నారు. మరి ఎమ్మెల్యే టికెట్ మీరెందుకు ఇచ్చారు. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలి? మీపై ఆరోపణలు వస్తే పక్కవారిపై బురద జల్లడం మీకు అలవాటు. చిన్నపాటి సోషల్ మీడియా కేసులకి దేశం దాటితే లుక్ అవుట్ నోటీసులు ఇచ్చి పాస్ పోర్టు రద్దు చేస్తున్నారు. మరి జయచంద్రా రెడ్డి విషయంలో ఎందుకు చేయలేదు. ఆయన ఫోన్ సంభాషణలు ఎవరితో చేశారో స్పష్టం చేయాలి. ఈ మొత్తం వ్యవహారంపై సిబిఐతో విచారణ చేయించండి అన్ని అంశాలు వెలుగులోకి వస్తాయి. సిట్ వేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. సిట్ అధికారులు టిడిపి నేతలపై కేసు నమోదు చేస్తారా ? ములకలచెరువు, ఇబ్రహీంపట్నం మాత్రమే కాదు పాలకొల్,లు అమలాపురం, ఎక్కడ చూసినా నకిలీ మద్యం కేంద్రాలు బయటపడ్డాయి. 16 నెలలుగా కాలంగా రాష్ట్ర ప్రజలతో నకిలీ మద్యం తాగిస్తున్నారు . ప్రతి నాలుగు బాటిల్లో ఒకటి నకిలీ మద్యమే. ● రింగ్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వైయస్సార్ ఘనత... విజనరీకి, ప్రిజనరీకి తేడా ఉంటుందని మాట్లాడుతున్న నారా లోకేష్ రాజమండ్రి ప్రిజనరీ అనగానే చంద్రబాబు పేరు వస్తుందని తెలుసుకోవాలి . హైదరాబాద్ ను మేమే తయారు చేశామని తండ్రీకొడుకులు పదే, పదే డబ్బా కొట్టుకుంటారు. వాస్తవానికి సైబరాబాద్ కి ఆజ్యం పోసింది నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి. నీ తండ్రి నారా చంద్రబాబు నాయుడు నీ తాతగారు ఎన్టీఆర్ దగ్గర నుంచి పార్టీని లాక్కోవడం కంటే ముందే సైబర్ టవర్స్ కు శంకుస్థాపన జరిగింది. అదే టైంలో చెన్నై, బెంగుళూరు, ముంబాయి తరహాలో హైదరాబాద్ లాంటి మెట్రో పాలిటిన నగరాలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. అందులో చంద్రబాబు చేసిందేం లేదు కానీ... హైటెక్ సిటీ అని బిల్డింగ్ కట్టి దాని చుట్టూ మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు భూములిచ్చారు. మురళీమోహన్ తో పాటు మీ బినామీలు బాగుపడ్డారు. దానికి సంబంధించి చాలామంది విదేశీ విద్యార్ధులు స్డడీ చేసిన పరిస్థితి. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు చంద్రబాబు విజన్ అని పచ్చి అబద్దాలు చెబుతున్నాడు. వాస్తవానికి 16 మార్చి 2005లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైయస్.రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో రాజీవ్ గాంధీ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. ఇందులో మీ ఘనత ఏముంది ? అప్పటికే పదేళ్లుగా మీ పార్టీ ఉన్నా మీరు శంషాబాద్ ఎయిర్ పోర్టు ఎందుకు చేయలేకపోయారు? అది పూర్తిగా వైయస్.రాజశేఖర్ రెడ్డి ఆలోచనతో మాత్రమే తయారైంది. అవుటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు తెలుగుదేశం పార్టీకి ఏమన్నా సంబంధం ఉందా? 1994 తర్వాత తొమ్మిదేళ్లుపాటు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు ఆ ఆలోచన చేయలేదు ? ● పోర్టులు, ఫిషింగ్ హార్భర్లు, మెడికల్ కాలేజీల నిర్మాణం వైయస్.జగన్ ఘనతే... ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణే మా లక్ష్యం అని చెబుతున్నాడు. అభివృద్ధి వికేంద్రీకరణ వైయస్.జగన్ పాలసీ కాదా? గ్రామ సచివాలయ వ్యవస్థ అంటే.. అభివృద్ధి వికేంద్రీకరణ. మీరు మాత్రం అభివృద్ధిని కేంద్రీకృతం చేస్తున్నారు. అమరావతి అనే రాజధానికి రూ.లక్ష కోట్ల శంకుస్థాపనలు చేస్తున్నారు. రాష్ట్రానికి ఆదాయాలు ఎలా ఉన్నా.. అప్పులు చేస్తూ అరాకొర సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. అభివృద్ది కేంద్రీకరణ కోసం అమరావతి లో టెండర్లు పిలిస్తున్నారు. అక్కడ అభివృద్ది ఏం లేదు కానీ... మొత్తం డబ్బులు కాజేసే కార్యక్రమం చేస్తున్నారు. మరోవైపు కోస్తాలో అద్భుతమైన కోస్తా ప్రాంతం ఉంది, పోర్టులు నిర్మాణం చేయాలని చెబుతున్నారు. మీకు కళ్లు మూసుకుపోయాయా? ఐదేళ్ల నుంచి వైయస్.జగన్ చెబుతూనే ఉన్నారు. వందలాది కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న కోస్తాలో పోర్టుల నిర్మాణం చేపట్టారు. 9 ఫిషింగ్ హార్భర్ల నిర్మాణానికి శ్రీకారం చుడితే అవి కూడా దాదాపు పూర్తయ్యే దశకు వచ్చాయి. ఆ రోజు వైయస్.జగన్ ఏం చేసి చూపిస్తున్నారో.. ఇప్పుడు చంద్రబాబు వాటిని కాపీ చేసి అవే మాటలు చెబుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వారంగంలో పెట్టుబడులు తీసుకొస్తామని ఇప్పుడు కొత్తగా చెబుతున్నారు. ప్రకాశం జిల్లాలో రిలయన్స్ పెట్టుబడులు తెస్తామని చెబుతున్నారు. విశాఖలో వైయస్.జగన్ ఇండస్ట్రియల్ సమ్మిట్ పెడితే దేశంలో పెద్ద, పెద్ద వ్యాపారవేత్తలందరూ ఎంఓయూలు కుదుర్చుకున్నారు. అప్పుడు చేసుకున్న ఎంఓయూ ఫలితమే ఇప్పుడు ప్రకాశం జిల్లాలో రిలయన్స్ పెట్టుబడులు. మా పార్టీ అధినేత చెప్పినట్లు మేం చాలా అభివృద్ధి పనులు చేసినా.. వాటిపై తగిన ప్రచారం చేయలేకపోయామన్నది వాస్తవం. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు చెందిన టీడీపీ ఎంపీల మద్ధతుతోనే నిలబడింది. ఏ ప్రాజెక్టు వచ్చినా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రధానిమంత్రి శ్రీకారం చుట్టే విధంగా డిమాండ్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత గొప్పగా మీకు అవకాశం ఇచ్చి మిమ్నల్ని గెలిపిస్తే.. ఏడాది కాలంలోమీరు చేసిందేమిటి? ఇంతవరకు డేటా సెంటర్ ఏర్పాటుపై అటు ప్రధాని, ఇటు గూగుల్ ఎన్ని ఉద్యోగాలు కల్పించబోతున్నారన్న విషయాన్ని ఎక్కడైనా ప్రకటించారా? ● స్ధానిక యువతకు ఉపాధి పై హామీ ఏది? గతంలో వైయస్.జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమలు తమ సంస్థల్లో 75 శాతం ఉద్యోగాలు స్ధానికులకే ఇవ్వాలని ఏకంగా జీవో తీసుకొచ్చారు. అది వైయస్.జగన్ కు ఆంధ్రప్రదేశ్ ప్రజలపట్ల ఉన్న నిబద్ధత. మీరుఇవాళ ఉత్తర ప్రగల్భాలు పలకకుండా... ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి కాకుండా ఆంధ్రప్రదేశ్ కు చెందిన స్థానిక యువతకు 75 శాతం ఉపాధి కల్పించే సత్తా మీకుందా? ఉన్న ఉపాధినే తొలగిస్తున్న మీరు.. ఏ ఆధారంతో ఆంధ్రప్రదేశ్ యువతకు ఉపాధి కల్పిస్తారు. మీ హయాంలో ఓ పెయిడ్ ఆర్టిస్టును పెట్టి జిందాల్ ను తరిమేశారు. అసలు విశాఖలో పెట్టుబడులు, ఉభయగోదావరి జిల్లాల్లో ఆక్వారంగంతో పాటు విశాఖలో పెట్టుబడులు, రాష్ట్రంలో అభివృద్ధికి చిరునామా అయిన పోర్టులు, ఫిషింగ్ హార్భర్లు అన్నీ వైయస్.జగన్ ఆలోచనలే. ఆయన చెప్పిన అంశాలనే మరలా చెబుతున్నారు. ● అడ్డగోలుగా బినామీలకు భూ సంతర్పణ.. టీసీఎస్ కు, కాగ్నిజెంట్ కు భూములిచ్చినందుకు వైయస్సార్సీపీ గగ్గోలు పెట్టిందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఉర్సా వంటి మీరు పనికిమాలిన కంపెనీలు పేరుతో మీ బినామీల ద్వారా భూములు కాజేయాలనే చూస్తున్నారు. దాని గురించి మేం మాట్లాడాం. ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ఖరీదైన భూమి విశాఖ రామకృష్ణాబీచ్ వద్ద 13-15 ఎకరాల భూమిని షాపింగ్ మాల్ నిర్మాణానికి అప్పగిస్తున్నారు. ఆ భూమి విలువలో సగం కూటా పెట్టుబడి పెట్టని లులూకు అప్పనంగా కేటాయిస్తున్నారు. విజయవాడ బస్టాండ్ వద్ద కూడా అడ్డగోలుగా కేటాయిస్తున్నారు. ఇంత దారుణంగా రాష్ట్రాని అమ్మే కార్యక్రమం చేస్తున్నారు. ● మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.4వేల కోట్లు ఖర్చుపెట్టలేరా ? ఇక ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం అత్యంత దుర్మార్గం. పీపీపీకి ప్రైవేటైజేషన్ కి తేడా తెలియదని చెబుతున్నారు. మీరు తీసుకున్న ఆ విధానంలో పబ్లిక్ కు ఏ విధంగా మేలు జరుగుతుందో సమాధానం చెప్పాలి? రూ.4వేల కోట్లు మెడికల్ కాలేజీల నిర్మాణానికి నిధులు లేవని చెబుతున్న మీరు... అమరావతిలో రూ.70 వేల కోట్ల పనులకు ఏ విధంగా శంకుస్థాపనలు చేశారు. వాస్తవానికి మెడికల్ కాలేజీల నిర్మాణానికి నిధుల కొరత లేకుండా వైయస్.జగన్ వాటిని సిద్దం చేసి ఉంచారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో రూ.2వేల కోట్లు పెట్టుబడి పెడితే... ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేకుండా పోతుంది. విశాఖపట్నంలో రుషికొండ ఏపీ టూరిజం భవనాలు నిర్మాణానికి పర్యావరణ అనుమతులు లేవని పదే, పదే అబద్దాలు చెప్పారు. ఇవాళ రుషికొండ భవనాలను అమ్మేయడానికి నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఆశ్చర్యంగా ఉంది. మీరు చేస్తే పుణ్యం, పక్కనోడు చేస్తే పాపమా? ఎల్లో మీడియా అంతా కోడై కూస్తూ ప్రజలకు విషం ఎక్కించే కార్యక్రమం చేస్తుంది. అలా గతంలో రుషికొండకు బోడిగుండు చేశారని పదే పదే అబద్దాలు చెప్పిన మీరు ఈ భవనాలకు కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు కదా? అని భరత్ ప్రభుత్వాన్ని నిలదీశారు.