తాడేపల్లి: జూన్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించదలచిన 'వెన్నుపోటు దినం' నిరసన కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతం చేద్దామని వైయస్ఆర్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు అవసరమైన కార్యాచరణపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర కార్యదర్శులతో సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...ఈ నెల 4న వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం విజయవంతం చేయడంపై అందరూ సమన్వయంతో పనిచేస్తున్నారు, ఇప్పటికే ప్రజల్లోకి బాగా వెళ్ళింది, రేపు మండల స్ధాయిలో కూడా పోస్టర్ రిలీజ్ చేయడం ద్వారా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వం కొన్ని చోట్ల ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటే దానికి తగిన విధంగా వ్యవహరిద్దాం, మనం మాత్రం ప్రశాంతంగా ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన కార్యక్రమం జరుపుతున్నాం, ఎక్కడైనా అడ్డంకులు కల్పిస్తే న్యాయస్ధానాల ద్వారా అధిగమిద్దాం, మనం ముందుగా అనుకున్న విధంగా ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వ అధికారులకు వినతి పత్రం అందజేస్తాం, దీనిని అణిచివేసే ప్రయత్నం చేసినా మీడియాలో వివరిద్దాం, మన కార్యక్రమం విజయవంతం చేయడానికి అవసరమైన పూర్తి ఏర్పాట్లు అందరూ చేసుకోవాలి, ప్రశాంతంగా ర్యాలీలు నిర్వహించి డిమాండ్స్ పత్రం అధికారులకు అందజేసి కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం. సీనియర్ నాయకుల సమన్వయం ఉంటుంది, వారంతా అందుబాటులో ఉంటారు, ఈ కార్యక్రమం సక్సెస్ అయితేనే ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందనేది స్పష్టంగా అర్ధమవుతుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎక్కడైనా ఆపే ప్రయత్నం చేస్తే ఎక్కడ నిలువరిస్తే అక్కడే మీడియాతో మాట్లాడి వివరిద్దాం, ఎలాంటి శషబిషలు లేకుండా కార్యక్రమాన్ని సక్సెస్ చేయడంపై అందరూ దృష్టిసారించాలి. మనం ప్రభుత్వంతో ఘర్షణ పడడానికి కాదు, ప్రజల ఆవేదన ప్రభుత్వానికి తెలియజేయడమే లక్ష్యంగా ఈ వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం అనే విషయాన్ని స్పష్టంగా తెలియజెప్పి అందరం సక్సెస్ చేద్దామని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. అందరు అసెంబ్లీ కో-ఆర్డినేటర్లతో మేం సమన్వయం చేస్తున్నాం, జిల్లా అధ్యక్షులతో కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తున్నాం, వారితో నిరంతరం టచ్ లో ఉండి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తామన్నారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరితోనూ ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాం, మనం ముందుగా అనుకున్న ప్రకారం 4 వ తేది ఉదయం ర్యాలీలు నిర్వహించి అధికారులకు వినతిపత్రాలు అందజేస్తాం. మనం శాంతియుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం, దానికి తగిన విధంగా స్పందించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది. ఎక్కడైనా నిర్ధిష్టంగా ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే పార్టీ కేంద్ర కార్యాలయంలోని లీగల్ సెల్ను సంప్రదించాలన్నారు. మాజీ మంత్రి శ్రీ కారుమూరి నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ మీరు ఇచ్చిన సూచనల ప్రకారం ముందుకెళుతున్నాం, ఎక్కడైనా సమస్య వస్తే వెంటనే దానికి తగిన విధంగా స్పందిస్తామన్నారు.