నెల్లూరు: వైయస్ఆర్ రైతు భరోసా పథకాన్ని ఈ నెల 15వ తేదీన నెల్లూరులో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారని ఇరిగేషన్ శాఖ మంత్రి డాక్టర్ అనిల్కుమార్ యాదవ్ చెప్పారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంచి మనస్సు ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ప్రకృతి, భగవంతుడు సహకరిస్తాడని చెప్పడానికి సీఎం వైయస్ జగన్ పాలన నిదర్శనమన్నారు. సీఎంగా వైయస్ జగన్ ప్రమాణస్వీకారం చేసిన తరువాత అన్ని ప్రాంతాల్లోని ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుందన్నారు. వర్షం అంటే తెలియని అనంతపురం జిల్లాలోని చెరువులు, వాగులు కూడా పొంగిపొర్లుతున్నాయని చెప్పారు. నెల్లూరు రైతాంగం కన్నీరు పెట్టుకుంటుందని టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని, ఎన్నడూ లేని విధంగా సీఎం వైయస్ జగన్ పాలనలో సోమశిలలో రికార్డుల స్థాయిలో నీటిని నింపామని చెప్పారు.