తిరుపతి: వైయస్ఆర్సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని.. ఇష్టానుసారం సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారంటూ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. అధికారం ఉందని అక్రమ కేసులు పెడుతున్నారు పాలనను గాలికొదిలేసి.. దాడులకు పాల్పడుతున్నారంటూ ధ్వజమెత్తారు. సోమవారం తిరుపతిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా నియోజకవర్గాల ఇంచార్జ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్రెడ్డి, మాజీ మంత్రులు నారాయణ స్వామి, ఆర్కే రోజా, నేతలు మధుసూదన్ రెడ్డి, అభినయ్ రెడ్డి, మోహిత్ రెడ్డి, నూకతోటి రాజేష్, వెంకటయ్య గౌడ్, సూనీల్ కుమార్, ఎంఎల్సీ సిపాయి సుబ్రమణ్యం, కుప్పం భరత్, తిరుపతి పార్లమెంటు పరిశీలకుడి మేడ రఘునాథ రెడ్డి, చిత్తూరు చావా రాజశేఖర్ రెడ్డి. మాజీ ఎంపీ రెడ్డప్ప, విజయ నంద రెడ్డి. రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి, కృపా లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మాజీ మంత్రి ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్కు తెర లేపారు. అందులో భాగంగానే ఇవాళ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిని అరెస్టు చేశారు. రోజుకొకరిపై అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది. ఏడాదిలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని మహానాడులో తీర్మానం చేసే దమ్ము టిడిపికి నేతలకు ఉందా?. ఏ హామీలు అమలు చేశారని మహానాడు నిర్వహిస్తున్నారో టిడిపి నేతలు సమాధానం చెప్పాలి. వైయస్ఆర్సీపీ నేతలు పిన్నెల్లి, కాకాణిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఈ అక్రమ కేసులకు భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. రాబోయే రోజుల్లో కూటమి నేతలు చేసిన పనులకు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. వైయస్ జగన్ మళ్లీ సీఎం అయ్యాక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎలా ఉంటుందో చూపిస్తాం. లిక్కర్ స్కామ్ అనేది ఒక పెద్ద అబద్ధం. గత ఐదేళ్లలో ఎక్కడా స్కామ్ జరగలేదు....టిడిపి ప్రభుత్వం మాత్రం స్కామ్ జరిగిందంటూ కేసులు పెట్టి వేధిస్తోంది` అంటూ రోజా మండిపడ్డారు. కాకాణి అరెస్టును ఖండిస్తున్నాం: భూమన కరుణాకర్రెడ్డి వైయస్ఆర్సీపీ నేత కాకాణి గోవర్ధన్రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్రెడ్డి తెలిపారు. సమావేశంలో అరెస్టును ఖండిస్తూ తీర్మానం చేసినట్లు చెప్పారు. డైవర్షన్ కోసమే ఇలాంటి అక్రమ అరెస్టులను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. అక్రమ అరెస్టులు, కేసులపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఏడాది పాలనా వైఫల్యాలపై ప్రజా పోరాటాలకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు.