అమరావతిః ఆర్థి«క శాఖపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష ప్రారంభమయింది. బడ్జెట్ కేటాయింపులపై అధికారులతో సీఎం సమీక్షించనున్నారు. ఈ నెల 12న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బడ్జెట్ ప్రతిపాదనలు అన్ని శాఖల నుంచి తీసుకున్నారు.నవరత్నాలు నుంచి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు దిశగా ప్రతిపాదనలు స్వీకరించారు. ఏ అంశాలను బడ్జెట్లో పొందుపర్చాలి..ఏ రంగాలకు బడ్జెట్ల్లో ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపై సమీక్ష జరుగుతుంది. సీఎం వైయస్ జగన్ ఆదేశాలు,ప్రతిపాదనలు ఆధారంగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి బడ్జెట్ రూపొందించనున్నారు. జనవరి 26 నుంచి అమలు చేసే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అమ్మ ఒడి పథకానికి నిధులు కేటాయింపు,అక్టోబర్ 15న ప్రారంభించబోతున్న రైతు భరోసా పథకానికి కేటాయింపులు,రైతుల బీమా,ధరల స్థిరీకరణ నిధి,సంక్షేమ రంగానికి సంబంధించి బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు సంబంధించి స్కాలర్షిప్లు,ఫీజు రీయింబర్స్మెంట్ వంటి అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు. వచ్చే ఉగాది నాటికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడానికి ఇప్పటికే సీఎం జగన్ నిర్ణయించారు.ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కార్యదర్శి,ఉన్నతాధికారులు పాల్గొన్నారు.