అమరావతి:ఇసుక రవాణా నిలిపివేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు.ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రూ.వేల కోట్ల ఇసుక దోపిడీ జరిగిందన్నారు.కొత్త ఇసుక పాలసీని తేవాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారని తెలిపారు.జులై 1 లోపు కొత్త ఇసుక పాలసీని తీసుకొస్తామని తెలిపారు. కొత్త పాలసీ వచ్చేంత వరుకు ఇసుక రవాణా చేయడానికి వీల్లేదన్నారు.ఇసుక రవాణా ఆపకపోతే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని మంత్రి హెచ్చరించారు.టీడీపీ ప్రభుత్వ హయాంలో యథేచ్చగా ఇసుక దోపిడీ సాగిందని విమర్శించారు. చంద్రబాబు నిర్ణయాలతో ప్రభుత్వం తీవ్రంగా నష్టపోయిందని, టీడీపీ నేతలు ఇసుకను దోచి కోట్ల రూపాయలు కొల్లగొట్టారని మండిపడ్డారు. అందుకే టీడీపీ అధోగతి పాలైందని అన్నారు.ఇసుక స్మగ్లింగ్కి ఈ రోజు నుంచి పుల్స్టాప్ పెట్టాలని ఆదేశాలు జారీచేశాం. స్మగ్లింగ్ ఆపకపోతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తాం. గతంలో ఇసుక దోపిడీని అడ్డుకున్న మహిళా ఎమ్మార్వోని టీడీపీ నేతలు కొట్టారు. సాండ్ స్మగ్లింగ్ జరిగితే అధికారులపై కూడా చర్యలు తీసుకుంటాం. అక్రమంగా లక్షల లారీల ఇసుక దోచేశారు. ఇసుక ర్యాంపు 202 నుంచి 116 మీటర్లకు తగ్గిపోయింది’ అన్నారు.