విశాఖ: రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణకు సీఎం వైయస్ జగన్ గారి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. గతంలో పట్టణాల్లో వేలల్లో ఉన్న కోవిడ్ యాక్టివ్ కేసులు ఇప్పుడు వందల్లోకి తగ్గిపోయాయి. మెజారిటీ పట్టణాల్లో వందకులోపే కేసులున్నాయి. నాలుగు నగరాల్లో మాత్రమే 200కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయని ట్విట్టర్లో ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో వైయస్ జగన్ గారి ప్రభుత్వం దిశ వ్యవస్థ ద్వారా మహిళల భద్రతలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. ప్రభుత్వం రూపొందించిన దిశ యాప్ మహిళలకు అన్నివిధాలా రక్షణ కల్పిస్తోంది. ఇప్పటికే 46,66,841 మంది దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని వినియోగిస్తున్నారని మరో ట్వీట్లో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.