మహిళల మాన ప్రాణాలు రక్షించడంలో ప్రభుత్వానికి శ్రద్ద లేదు 

అనితానా.. విలువల గురించి మాట్లాడేది 

 ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫైర్‌

విశాఖ : మహిళల మాన ప్రాణాలు రక్షించడంలో ప్రభుత్వానికి శ్రద్ద లేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా విభాగం రాష్ట్ర అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ వ‌రుదు క‌ళ్యాణి మండిప‌డ్డారు. హోంమంత్రి అనితపై ఆమె ఫైరయ్యారు.  వైయ‌స్ఆర్‌సీపీ  అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైయ‌స్ భారతికి విలువలు నేర్పాల్సిన అవసరం లేదని,ఆ స్థాయి హోం మంత్రి అనితకు లేదని వ్యాఖ్యానించారు. 

ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయి. మహిళలపై జరుగుతున్న దాడులకు హోం మంత్రి నుంచి స్పందన లేదు. ఇవన్నీ పట్టించుకోకుండా హోం మంత్రి మాపై విమర్శలు చేస్తున్నారు. సాక్షి డిబేట్‌లో ఓ జర్నలిస్ట్ మాట్లాడిన మాటల్ని పట్టుకొని రాజకీయం చేస్తున్నారు. ఆ మాటలు మాట్లాడిన వెంటనే ఆ వ్యాఖ్యలను సాక్షి టీవీ ఖండించింది. జర్నలిస్ట్ కృష్ణంరాజు వ్యాఖ్యలను మా పార్టీ ఎంత మాత్రం సమర్ధించదు.

రెడ్ బుక్ రాజ్యాంగం అమలుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. మహిళల మాన ప్రాణాలు రక్షించడంలో ప్రభుత్వానికి శ్రద్ద లేదు. వైఎస్‌ భారతికి విలువలు నేర్పాల్సిన అవసరం లేదు. ఆ స్థాయి హోం మంత్రి అనితకు లేదు. దళిత బాలికను అత్యాచారం చేస్తే హోం మంత్రి అనిత ఏం చేశారు..? కనీసం స్పందించారా..? ఈ కుటుంబాలను ప్రభుత్వం ఓదార్చిందా..?. విలువలు నేర్పించే అర్హత హోం మంత్రి అనితకు ఉందా..? డైవర్షన్ పాలిటిక్స్ చేయడం మాత్రమే కూటమి ప్రభుత్వ పెద్దలకు తెలుసు. మహిళలకు రక్షణ కల్పించలేని చేతకాని ప్రభుత్వం ఇది. హోం మంత్రి సొంత ఇలాకాలో గంజాయి రవాణా జరుగుతుంది. ఇలాంటి వాటిపై ఎందుకు దృష్టి పెట్టడం లేదు’ అని మండిపడ్డారు. 

Back to Top