శ్రీసత్యసాయి జిల్లా: రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో దళిత బాలికను బెదిరించి అఘాయిత్యానికి పాల్పడిన కామాంధులను కఠినంగా శిక్షించాలని వైయస్ఆర్సీపీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీ చరణ్, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి డిమాండ్ చేశారు. వైయస్ఆర్సీపీనాయకులతో కలిసి వారు సోమవారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. దళిత బాలికపై 14 మంది మృగాళ్లు ఆరు నెలలుగా అత్యాచారం చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో హోంమంత్రిగా అనిత, జిల్లాలో మంత్రిగా సవితమ్మ, రాప్తాడు ఎమ్మెల్యేగా పరిటాల సునీత, జిల్లా ఎస్పీగా రత్న ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలపై ప్రభుత్వం సరిగా స్పందించకపోతే ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. బాధిత దళిత బాలిక కుటుంబానికి పక్కాగృహం, ఐదెకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.