అమరావతి: ఓటింగ్ పెట్టి తిరస్కరించినా బిల్లు పాసైపోతాయని వైయస్ఆర్సీపీ శాసన మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వెల్లడించారు. వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీలతో మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు భేటీ అయ్యారు.బిల్లులు సెలెక్ట్ కమిటీ ఇచ్చే అవకాశం లేదని ఉమ్మారెడ్డి పేర్కొన్నారు.గతంలోనే రూల్ ప్రకారం జరగలేదని మండలి చైర్మన్ చెప్పారన్నారు.కేవలం విచక్షణాధికారం ఉందనే సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నానని చైర్మన్ చెప్పారని గుర్తు చేశారు. సభ అభిప్రాయం తీసుకోకుండా వాయిదా వేసి వెళ్లిపోయారన్నారు. బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్లినట్లు కాదన్నారు. టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఇష్టమొచ్చినట్లు రూల్స్ మార్చి చెబుతున్నారన్నారు. కాగా కాసేపట్లో మండలి ముందుకు సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీలతో ఉమ్మారెడ్డి సమావేశం నిర్వహించారు.