అమరావతి: వాస్తవాలను పక్కన పెట్టి గవర్నర్తో అసెంబ్లీలో అసత్యాలు చదివించారని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్నిఆమె తప్పుపట్టారు.. సభలో గవర్నర్ ప్రసంగమంతా అసత్యాలేనని, అది ప్రజా వ్యతిరేక ప్రసంగమని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు నానా అవస్థపడుతున్నారని, ఉద్యోగులు, నిరుద్యోగులు, వాలంటీర్లు అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం తెచ్చే ఒత్తిడి వల్ల ఉద్యోగులు ప్రాణాలను కోల్పోతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఉద్యోగులకు వేతన బకాయిలను చెల్లించకపోవడం, వాలంటీర్లకు ఇచ్చిన హామీలను విస్మరించడం, నిరుద్యోగులకు భృతి ఇవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయని, ప్రభుత్వ విధానాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కల్పలతారెడ్డి పేర్కొన్నారు.