విశాఖ: నిన్న విశాఖలో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై చెప్పులు వేసింది టీడీపీ శ్రేణులేనని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. టీడీపీ అధినేతపై చెప్పులు వేయడం ఆ పార్టీ సాంప్రదాయమని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి చంద్రబాబు అడ్డుపడటంతోనే విశాఖలో ఆయన్ను అడ్డుకున్నారని, దీన్ని రెండు పార్టీల మధ్య జరుగుతున్న తగాదాగా చిత్రీకరించడం సరికాదన్నారు. శుక్రవారం గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు.
విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిని అడ్డుకుంటున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు. విశాఖ రాజధానిని చంద్రబాబు అడ్డుకుంటున్నారని తెలిసీ ఉత్తరాంధ్ర ప్రజలు నిన్న విశాఖకు వచ్చిన సందర్భంగా గో బ్యాక్ చంద్రబాబు అంటూ నినదించారు. చంద్రబాబును అడ్డుకున్నది వైయస్ఆర్సీపీ శ్రేణులు మాత్రమే అంటూ టీడీపీకి చెందిన మీడియా సంస్థలు బ్యానర్ కథనాలు రాశాయి. ఇదీ వైయస్ఆర్సీపీ, టీడీపీకి మధ్య జరిగే గొడవలా చిత్రీకరించారు. అమరావతిలో ఉద్యమాలు జరిగితే అది జాయింట్ యాక్షన్ కమిటీలు, అక్కడ స్వచ్ఛంద ఉద్యమ సంస్థలు, భూములు ఇచ్చిన రైతులు చేసినట్లు చెబుతున్నారు. అదే విశాఖలో ప్రజలు అడ్డుకుంటే దాన్ని మాత్రం వైయస్ఆర్సీపీకి అంటగడుతున్నారు. ఇంత ఘోరంగా..మీ చేతిలో మీడియా సంస్థలు ఉన్నాయని ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను గుర్తించకుండా, ప్రజల ఆవేదనను, బాధను కనీసం లెక్క చేయకుండా రెండు రాజకీయ పార్టీల మధ్య తగువగా చిత్రీకరించి టీడీపీకి మేలు చేయాలనే ప్రయత్నం చాలా అన్యాయం. ఇంత అన్యాయంగా టీడీపీని కాపాడాలని, చంద్రబాబు నాయకత్వాన్ని పైకి తీసుకురావాలని కొన్ని మీడియా సంస్థలు పడుతున్న తపన చూస్తే చింత చచ్చినా పులుపు చావలేదన్న చందంగా ఉంది. మిమ్మల్ని ప్రజలు తిరస్కరించినా ఎలాంటి మార్పు రావడం లేదు. ఇంకా మీరే అధికారంలో ఉన్నట్లు..మీరు చెప్పినట్లుగానే అంతా జరగాలని అనుకోవడం సరికాదు. చలి చీమకు రెక్కలొచ్చినా..ముసలివాడికి పిచ్చి వచ్చినా ఎక్కువ కాలం భూమి మీద నిలబడవన్న సామెత ఉంది. ఆ సామెతలు మీరు చేస్తున్న కార్యక్రమాలు చూస్తే గుర్తుకు వస్తున్నాయి. ఉత్తరాంధ్ర ప్రజలు ఉద్యమాలు చేయడానికి పనికి రారా? ఈ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన అల్లూరి సీతారామారాజు పుట్టిన గడ్డ ఈ ప్రాంతం. దేశమంటే మట్టి కాదోయ్..దేశమంటే మనుషులోయ్ అని నినదించిన గురజాడ అప్పారావు పుట్టిన గడ్డ ఇది. ఎంతో మంది వీరమరణం పొంది విశాఖ ఉక్కును సాధించుకున్న నేల ఇది. ఎంతో మంది నాయకులున్న ప్రాంతం. ఎంతో మంది ఈ ప్రాంత బాగోగుల కోసం ముందుండి పోరాటం చేసిన ప్రాంతం ఇది. మీరేమో పులివెందుల నుంచి మనుషులను తీసుకొచ్చారని అంటున్నారు. ఈ ఉద్యమానికి రాయలసీమకు ఏం సంబంధం. నాకు ఆకలెస్తే నేను అడుగుతాను..ఉత్తరాంధ్ర ప్రాంతం ఇంకా పురిటి నొప్పులతో బాధపడుతోంది. ఉత్తరాంధ్ర ఉత్తి ఆంధ్రగా మార్చారు..దీన్ని ఉత్తమ ఆంధ్రాగా తీర్చిదిద్దాలన్నదే సీఎం వైయస్ జగన్ ఆలోచన. ఈ ప్రాంతానికి మేలు చేస్తుంటే..మీరోచ్చి లేనిపోని మాటలు చెప్పి ప్రజల తాలుక ఆలోచన, దృష్టి మరల్చాలని పులివెందుల నుంచి వచ్చారని లోకేష్ అంటున్నారు. ఈ ఉత్తరాంధ్ర ప్రజలు కడుపు కాలి ఉద్యమిస్తున్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబును అడ్డుకోక ముద్దు పెట్టుకుంటారా?. పూలు జల్లి స్వాగతిస్తారా? . ఉత్తరాంధ్రకు అన్యాయం చేస్తున్న ఏ వ్యక్తినైనా అడ్డుకుంటారు. అటువంటి పరిస్థితిలో పులివెందుల నుంచి మనుషులు వచ్చారని చెప్పడం సిగ్గు చేటు. ఎవరైనా పులివెందుల నుంచి ఏ ఒక్కరు వచ్చినట్లు నిరూపించినా కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..ఇందుకు లోకేష్ సిద్ధమా?. పాపం లోకేష్ ఇలాంటి చాలెంజ్ స్వీకరించడానికి కూడా అవకాశం లేదు. నేడో, రేపో ఆయన ఎమ్మెల్సీ పదవి పోవడం ఖాయం.ఆయనకు ఏమని సవాలు విసురాలో కూడా తెలియదు. చేసిన ఆరోపణలపై నిలబడటం లేదు. గతంలో తునిలో రైలుకు నిప్పుపెడితే పులివెందుల నుంచి వచ్చారని ఆరోపించారు. అమరావతిలో అరటి తోటలకు నిప్పుపెడితే దానికి పులివెందుల నుంచి వచ్చారని ఆరోపించారు.
గోదావరి పుష్కరాల్లో 29 మంది మరణానికి చంద్రబాబు కారణమైతే దానికి కూడా పులివెందుల పేరు చెబుతున్నారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా..ఎలాంటి అసాంఘీక కార్యకలాపాలు జరిగినా పులివెందులనే కారణమా?. చంద్రబాబు, ఆయన కుమారుడు మాట్లాడుతున్న తీరు చూస్తే..మిమ్మల్ని ఏమనాలో తెలియని పరిస్థితి. మీ కంటే ఒక ఊరు లేదు..ఒక జిల్లా లేదు..నియోజకవర్గం లేదు. చంద్రబాబు పుట్టిన నియోజకవర్గం చంద్రగిరి, 1983లో అక్కడ చిత్తు చిత్తుగా ఓడిస్తే..కుప్పంలో పడ్డారు. లోకేషేమో మంగళగిరి..మీరేమో చంద్రగిరి..అడ్రస్ ఏమో హైదరాబాద్. ఇవన్నీ మీకున్న మచ్చలు మానేసి..1978 నుంచి వైయస్ఆర్ కుటుంబంతో ఆ ప్రాంత ప్రజలు కలిసి నడుస్తున్నారు. దాదాపు 42 సంవత్సరాలుగా వైయస్ఆర్ కుటుంబంతో పెనవేసుకున్న ప్రజలు పులివెందుల ప్రజలు. నమ్మకానికి, విశ్వాసానికి, ప్రేమకు, ఆ ప్రాంతానికి వైయస్ఆర్ కుటుంబం చేసిన అభివృద్ధికి పులివెందుల ప్రజలు తోడుగా ఉన్నారు. అలాంటి వారిని మీరు కించపరిచి మాట్లాడటం బాధాకరం. పులివెందుల ఈ రాష్ట్రం కాదా? వారు ఈ రాష్ట్ర ప్రజలు కాదా?. ఈ రాష్ట్రంలో వారు భాగస్వాములు కాదా?. చంద్రబాబుకు ఆయన కుటుంబం, అమరావతి, ఆ మూడు గ్రామాలు, 33 వేల ఎకరాలు మాత్రమే. ఇవి ఇస్తే చాలు మీకు. రాష్ట్రం ఏమైనా ఫర్వాలేదు. ప్రజలు ఏమైపోయినా చంద్రబాబుకు ఫర్వాలేదు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి ఆయనకు పట్టడం లేదు.
చంద్రబాబు విశాఖలో పెళ్లిళ్లు చూసేందుకు వచ్చి ఉంటే బాగుండేది. అది మానేసి మీ అంతు చూస్తా..అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ..ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బకొట్టేలా వ్యవహరించడం దుర్మార్గం కాదా?. 2017 మేలో ఈనాడులోనే విశాఖలో 20 వేల ఎకరాల భూ స్కామ్ జరిగిందని బ్యానర్ కథనాలు రాసింది గుర్తు లేదా? మీరు భూదందాలు చేసి ఎదుటివారిపై ఆ నెపం నెట్టితే..ఇలాంటి స్వాగతాలే ఇస్తారు. అధికార పార్టీపై ఏదో ఒక బురద జల్లేద్దామన్న ఆలోచనతో మీరు చేసిన కార్యక్రమాలు ఇవన్నీ మరచిపోయి మాట్లాడుతున్నారు. చంద్రబాబు 14 సంవత్సరాలు సీఎంగా పని చేశారు. 11 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పని చేసిన వ్యక్తి. ఆయనంటే అపారమైన ప్రేమ ఉంది. ఆయనకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మా ప్రభుత్వంపై ఉంది. అపారమైన గౌరవంతో ఆయనకు రక్షణ కల్పించాలని పోలీసులు కోరారు. వారి మాటలు లెక్క చేయకుండా ముందుకు వెళ్తానని మొండికేయడం సరికాదు. పోలీసు వ్యవస్థలు ఏరకంగా పని చేస్తాయో మీకు తెలియదా?. 70 ఏళ్ల వయసులో ఎంత దూరం పాదయాత్ర చేస్తారు. మిమ్మల్ని మోయడానికి మీ కొడుకు కూడా రాలేదే?. గుడ్లు, టమాటలు విసిరింది వైయస్ఆర్సీపీ కార్యకర్తలే అంటున్నారు..ఈ పని చేసింది టీడీపీకి చెందిన ఓ వర్గమే ఈ పని చేసింది. విశాఖ నుంచి పార్లమెంట్ మెంబర్గా పోటిపడిన ఆయన కొడుకు తోడళ్లుడు భరత్..జనసేనతో చంద్రబాబుకు ఉన్న ఒప్పందం వల్ల గాజువాకాలో ప్రచారానికి రాలేదని ఆయనే చెప్పారు. విశాఖలో, గాజువాకాలో మా పార్టీ అభ్యర్థులకు 15 వేల మెజారిటీ వచ్చింది. ఆ కోపంతో భరత్ వర్గం చంద్రబాబుపై ఈ చెప్పులు, గుడ్లు, టమాటాలు విసిరిందని విశాఖలో అనుకుంటున్నారు. ఈ మాటలు టీడీపీకి చెందిన వారే చెప్పుకుంటున్నారు. నిన్న చంద్రబాబు విశాఖకు వస్తున్నారంటే ఆయన పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఎయిర్పోర్టుకు రాలేదు. టీడీపీ ఎమ్మెల్యే ఒకరితో నేను మాట్లాడితే..ఆయన ఏమన్నారంటే..తెలంగాణలో ఈ రకంగానే టీడీపీని మూయించాడు ఈ ముసలోడు. ఈ రోజు ఉత్తరాంధ్రలో మా జీవితాలు ముంచేయడానికి వచ్చాడని అన్నాడు. ఇలాంటి మాటలు టీడీపీలో ఉండి బయటకు అనలేరు కదా?. ఈ రకమైన పరిస్థితిలో మీ పార్టీ నాయకులు ఉన్నారు. ఈ విషయాలను చంద్రబాబు గ్రహించి తప్పు తెలుసుకొని ఉత్తరాంధ్ర ప్రాంతంలో రాజధానిగా విశాఖ ఏర్పాటు చేస్తే మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవని, స్వాగతిస్తున్నామని ప్రకటిస్తే..అప్పుడే ఈ ప్రాంతంలో మీ పార్టీ నాయకులకు భవిష్యత్తు ఉంటుంది. ఈ ప్రాంతానికి మంచి చేయాలన్న తపనతో సీఎం వైయస్ జగన్ ముందుకు వెళ్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో చెప్పులు విసిరారు, రాళ్లు, గుడ్లు విసిరారని చెప్పుకుంటున్నారు. ఇది మీకు కొత్త కాదు కదా? మీరు ఎన్టీఆర్పై చెప్పులు, గుడ్లు విసరలేదా?. పార్టీ అధ్యక్షుడిపై రాళ్లు, చెప్పులు విసరడం మీ సాంప్రదాయమేమో?.దీన్ని ఖర్మ సిద్ధాంతం అంటారు. జనాలు పెరిగిపోవడంతో దేవుడు కూడా కొత్త సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నారు. ఎవరు చేసిన తప్పులకు వాళ్లకే శిక్షలు విధిస్తున్నారు. దీన్ని కర్మ సిద్ధాంతం అంటారు. మా పార్టీ నుంచి గతంలో 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను చంద్రబాబు కొనుగోలు చేశారు. 23 మంది మళ్లీ టీడీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు గెలవడానికి వైయస్ఆర్సీపీ కారణం కాదు. ఈ రాష్ట్ర ప్రజలే.
వైయస్ జగన్ 2017 జనవరి 26న విశాఖలో క్యాండిల్ ర్యాలీకి వస్తే ఆ రోజు అడ్డుకున్నది పోలీసులు..ఈ రోజు చంద్రబాబును అడ్డుకుంది పోలీసులు కాదు..ప్రజలే. ఇకనైన చంద్రబాబు తాను చేసిన తప్పులు గ్రహిస్తే బాగుంటుంది. లోకేష్ ఇంట్లో దూరి తంతాడట. ఇప్పటికే ఆయన్ను మంగళగిరిలో ప్రజలు తంతే అమరావతి కరకట్టపై పడ్డారు. లా అండ్ ఆర్డర్ను లోకేష్ చేతుల్లోకి తీసుకుంటారట..నీవేమైనా ఐపీఎస్ ఆఫీసర్వా?. ఎందుకు ఈ రకమైన మాటలు..ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఉత్తర కుమార ప్రగల్భాలు పలకడం మానేసి..ఇప్పటికైనా రాష్ట్రంలోని 13 జిల్లాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉంటే బాగుంటుంది. మళ్లీ విశాఖలో పర్యటిస్తానని చంద్రబాబు అంటున్నారు. మేం కాదనడం లేదు. కాకపోతే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు క్షమాపణ చెప్పి..తప్పు చేశానని ఒప్పుకుంటే స్వాగతిస్తారు. అమరావతిలో భూముల కోసమే నా ఆరాటమని, ప్రజల కోసం పోరాటం చేయడం లేదని ఒప్పుకుంటే ఈ ప్రాంత ప్రజలు స్వాగతిస్తారు. అధికారంలో ఉన్న మేం కూడా నిన్న జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. ఇప్పటికైనా చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇది రెండు పార్టీల మధ్య జరుగుతున్న పోరాటం కాదు..ఉత్తరాంధ్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై పోరాటంగా మాత్రమే చూడాలని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కోరారు.