ఆడబిడ్డల మరణాలను రాజకీయ లబ్ధికోసం వాడుకుంటారా..?

 వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే  గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి  

వర్థంతికి, జయంతికి తేడా తెలియని లోకేష్... చనిపోయిన 7 నెలల తర్వాత పరామర్శలు దేనికోసం..!?

అనూష ఘటనలో.. 4 గంటల్లో అరెస్టు.. 7 రోజుల్లో చార్జిషీట్.. 2 రోజుల్లోనే ఆర్థిక సాయం.. 21న కోర్టులో విచారణ.

ముఖ్యమంత్రి జగన్ గారిని తిడితే లోకేష్ బాహుబలి కాలేడు.. లోకేష్ ఎప్పటికీ పులకేసీనే..

 రాజకీయాల్లో జగన్ గారు ఎప్పటికీ బాహుబలే..

ప్రభుత్వ ప్రేరేపిత ఘటనలు అంటే.. తహసీల్దార్ వనజాక్షిని మీ పార్టీ ఎమ్మెల్యే చింతమనేనితో దాడి చేయించడం.

రిషితేశ్వరి, వనజాక్షి, కాల్ మనీ రాకెట్ వరకు.. టీడీపీ హయాంలో ఏ ఒక్క మహిళకు అయినా న్యాయం జరిగిందా..?

టీడీపీ కోరితే.. దిశ చట్టం తేలేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే దిశ యాప్ ను ప్రతి ఒక్కరూ డౌన్ లోడ్ చేసుకోవాలని చెప్పండి

 గుంటూరు:  ఉన్మాదుల చేతుల్లో హత్యకు గురైన ఆడబిడ్డల మరణాలను రాజకీయ లబ్ధికోసం వాడుకుంటారా..? అంటూ వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీ‌నివాస‌రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వర్థంతికి, జయంతికి తేడా తెలియని లోకేష్.. చనిపోయిన 7 నెలల తర్వాత పరామర్శ పేరుతో  శవ రాజకీయం చేస్తామంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా.. ? అని  మండిపడ్డారు.  మీ రాజకీయ లబ్ధి కోసం.. బాధిత కుటుంబాలను రోడ్డు మీదకు లాగుతారా.. అని గోపిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నరసరావుపేటలో మీడియా సమావేశంలో గోపిరెడ్డి మాట్లాడారు. 

మహిళలు, యువతులపై దురదృష్టవశాత్తూ అనుకోని ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు.. ప్రభుత్వం వేగంగా స్పందించి, దిశ చట్టం స్ఫూర్తితో నిందితులను కొన్ని గంటల్లోనే అరెస్టు చేసి, విచారణ  పూర్తి చేసి, న్యాయస్థానాల్లో నిలబెట్టడంతోపాటు, బాధితులను అన్నివిధాలా ఆదుకునేందుకు, ఆ కుటుంబానికి న్యాయం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ చేపడుతుందన్నారు.  అదే టీడీపీ హయాంలో రిషితేశ్వరి నుంచి కాల్ మనీ సెక్స్ రాకెట్ వరకూ.. లెక్కలేనన్ని ఘటనలు జరిగితే.. ఏ ఒక్కరికైనా న్యాయం చేశారా.. అని గోపిరెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రేరేపిత చర్యలంటే.. మీ హయాంలో మీ  పార్టీకే చెందిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరరావును ఉసిగొల్పి తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేయించడం, రిషితేశ్వరి ఆత్మహత్యకు కారకులవ్వడం.. పెందుర్తిలో మీ  పార్టీ నేతలే ఓ దళిత మహిళను వివస్త్రను చేసి రోడ్డు మీద దాడి పడేయడం.. అని ఉదాహరణలతో సహా గోపిరెడ్డి వివరించారు. 

  నర్సరావుపేట పట్టణంలో 7 నెలల క్రితం హత్య గావించబడిన అనూష కేసులో నాలుగు గంటల్లోనే నిందితుల్ని అరెస్ట్‌ చేయడం జరిగింది. ఏడు రోజుల్లోనే ఛార్జ్‌షీట్‌ ఫైల్‌ అయ్యింది.  బాధితురాలి కుటుంబానికి అండగా ఉండేందుకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి, రెండు రోజుల్లోనే ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. ఇంకా వారికి ఇంటి స్థలం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చి, అన్నిరకాలుగా ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడింది. ఈ కేసు ఈ నెల 21 నుంచి కోర్టులో విచారణకు రానుంది. ఒక యువతి విషయంలో అనుకోకుండా జరిగిన సంఘటనలో, ప్రభుత్వం బాధ్యతగా తక్షణమే స్పందించి నిందితుల్ని అరెస్ట్‌ చేసింది. ఈ సంఘటన ఈ ఏడాది ఫిబ్రవరి 24న జరిగితే.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు వేగంగా స్పందించి,  ఒకవైపు జిల్లా అధికారులను, మరోవైపు ప్రజాప్రతినిధులను పంపి, ఆ కుటుంబానికి ఒక భరోసా కల్పించారు.  ఫిబ్రవరి 25న నాతో పాటు ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు, జిల్లా కలెక్టర్‌ బాధితురాలి ఇంటికి వెళ్లి రెండ్రోజుల్లోనే పదిలక్షల పరిహారాన్ని అందించడం జరిగింది. అనూష పోస్ట్‌మార్టం జరిగినరోజు నేనే స్వయంగా హాస్పటల్‌కు వెళ్లి ఆమె కుటుంబ సభ్యుల్ని పరామర్శించాను. న్యాయం జరుగుతుంది, ప్రభుత్వం తరపున రావాల్సిన బెనిఫిట్స్‌ ఇస్తామని.. అనుకోకుండా జరిగిన ఈ సంఘటన దురదృష్టకరమని వారికి భరోసా ఇవ్వడం జరిగింది. నర్సరావుపేట ఆర్డీవో, ఎమ్మార్వోలతో మాట్లాడి ఇంటి స్థలం పట్టా సిద్ధం చేశాం. అయితే తమకు తమ స్వగ్రామం గోళ్లపాడులోనే స్థలం కావాలని కోరడంతో అక్కడే ఇవ్వడం జరుగుతుంది. అనూష సోదరుడికి బీటెక్‌ పూర్తయ్యాక ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చాం.

  ఇంతకన్నా ఏ ప్రభుత్వం అయినా న్యాయం చేయగలుగుతుందా?.  మీ హయాంలో ఎప్పుడైనా చేశారా లోకేష్‌? టీడీపీ హయాంలో కూడా ఇలాంటి సంఘటనలు లెక్కలేనన్ని జరిగాయి. నాగార్జున యూనివర్శిటీలో రిషితేశ్వరి, గుంటూరులో మెడికల్‌ కాలేజీ పీజీ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య, ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని దాడి.. ఇలాంటివి ఎన్నో జరిగాయి. అప్పుడు ఏ ఒక్క ఘటనలో అయినా మీరు  స్పందించారా? 
- ప్రభుత్వం ఇంత సత్వరమే స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకుంటే మీరు మాత్రం తీరిగ్గా ఏడు నెలలు తర్వాత పరామర్శకు వస్తారా? హిందూ సంప్రదాయం ప్రకారం ఎవరైనా చనిపోతే వారం, పదిరోజుల్లో పరామర్శించడం మన సంప్రదాయం. ఏడు నెలల తర్వాత కేవలం రాజకీయ లబ్ధి, మీ పార్టీ ఉనికి కోసం.. నర్సరావుపేట వచ్చి అనూష కుటుంబాన్ని పరామర్శించడం న్యాయమేనా? ఇది సమంజమేనా? అని సూటిగా అడుగుతున్నాం. 

  లోకేష్‌ను ప్రజల్లో తిప్పితేనైనా కాస్త మెరుగుపడతాడు అని ఓ టీవీ ఇంటర్వ్యూలో ఒకరుచెబితే.. అది చూసి లోకేష్‌ పరామర్శలు మొదలుపెట్టారేమో.  హైదరాబాద్‌ నుంచి ఫ్లైట్‌లో రావడం.. రెండు గంటలు హడావుడి చేయడం.. పార్టీ నేతలను, కార్యకర్తలను పది మందిని పోగేసి శవ రాజకీయం చేసి, సాయంత్రం మళ్లీ ఫ్లైట్‌ ఎక్కి హైదరాబాద్‌ వెళితే.. లోకేష్ నాయకుడు అయిపోతాడని చంద్రబాబు కలలు కంటున్నారు. జయంతికి, వర్థంతికి తేడా తెలియని లోకేష్.. నాయకుడు కాలేడు సరికదా.. రాజకీయాల్లో పులకేసీ నంబర్ 1గానే ఎప్పటికీ మిగిలిపోతాడు. 

 మహిళలపై దాడులను ఆపేందుకు ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకు వచ్చింది. హైదరాబాద్‌లో ఒక  దురదృష్టకర సంఘటన చూసి ముఖ్యమంత్రిగారు చలించిపోయి.. అసెంబ్లీ సమావేశాల్లో దిశ బిల్లు పెట్టి... చట్టం చేసేందుకు ఆమోదం కోసం కేంద్రానికి పంపాం. దిశ స్ఫూర్తితో ఇవాళ.. వారంలో ఛార్జ్‌షీట్‌ వేసి 21 రోజుల్లో విచారణ చేయిస్తుంటే ప్రభుత్వానిది నిర్లక్ష్యం ఎలా అవుతుంది.
-  కోవిడ్‌ కారణాల వల్ల కోర్టుల్లో విచారణ ఆలస్యం అయితే అది ప్రభుత్వం తప్పు, నిర్లక్ష్యం ఎలా అవుతుంది? ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరిగినప్పుడు.. ప్రభుత్వం కావాలని చేయించదు. ఇలాంటివి ఎవరికీ చెప్పిరావు. అనుకోకుండా జరిగిన ఘటనలకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలంటే ఎలా? 24 గంటలూ ఏం జరుగుతుందని ప్రభుత్వమే ప్రతి ఒక్కరికీ కాపలా కాస్తుందా?. అదే మా పార్టీ నాయకుడో, శాసనసభ్యుడో చేస్తే తప్పుపట్టండి, మేం శిక్షిస్తాం.

  మీ ప్రభుత్వ హయాంలో అధికార దుర్వినియోగంతో,  టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని ప్రభాకర్‌ .. మహిళా ఎమ్మార్వోపై దాడి చేస్తే మీరేమి చేశారు. పెందుర్తిలో ఓ ఎస్సీ దళిత మహిళను జుట్టు పట్టుకుని లాక్కుని వస్తే మీ ప్రభుత్వం ఏం చేసింది. ప్రభుత్వ ప్రేరేపిత ఘటనలు అంటే అవి. విజయవాడలోని కాల్‌మనీ సెక్స్ రాకెట్  విషయంలో మీ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల  ప్రమేయం ఉన్నా మీ హయాంలో వారిపై ఏం చర్యలు తీసుకోలేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, మీ పార్టీ ఎమ్మెల్యేలు చేసిన నిర్వాకానికి మీరు ఏమి చర్యలు తీసుకోలేదు. 
- కానీ అనూష ఘటన వ్యవస్థ చేయించింది కాదు... సమాజంలో కొంతమంది ఉన్మాదులు, దుర్మార్గుల వల్ల,  అనుకోని దురదృష్టకర సంఘటనలు జరిగితే ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితుల్ని అరెస్ట్‌ చేసి, కోర్టుల్లో హాజరుపరచడమే కాకుండా.. బాధిత కుటుంబానికి అండగా నిలబడుతోంది. 

  ఉన్మాదుల చేతుల్లో హత్యకు గురైన ఆడబిడ్డల మరణాలను మీ రాజకీయ లబ్ధికోసం వాడుకుంటూ, బాధిత కుటుంబాలను  రోడ్డు మీదకు తీసుకురావడం... అదీ ఏడు నెలల తర్వాత పరామర్శకు రావడం సమజంసమేనా?  బాధిత కుటుంబం ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చింది. ఇలా చనిపోయినవారికి మీ పార్టీ తరపున ఏమైనా సాయం చేశారా? ఇది కేవలం రాజకీయం కోసం కాదా...?. మీరు చేస్తున్నది శవాల మీద పేలాలు ఏరుకోవాలన్న రాజకీయమే తప్ప, మరొకటి కాదు.

 ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారిని దూషిస్తే.. లోకేష్‌ ఏదో రాజకీయ నాయకుడిగా ఎదుగుతాడనుకోవడం భ్రమ.  జగన్ రెడ్డి.. అంటూ కులాలను రెచ్చగొట్టేలన్న కుట్ర  బుద్ధితో మాట్లాడుతున్న లోకేష్‌ కు ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారు. చంద్రనాయుడు అని మేము ఎప్పుడూ మాట్లాడలేదు. మేము హుందాగా మాట్లాడుతున్నాం. ముఖ్యమంత్రిగారిపై మాట్లాడే  భాషను లోకేష్ మార్చుకోవాలి.

  వర్థంతికి... జయంతికి లోకేష్ కు తేడా తెలియదు. చదువుకోమని పంపిస్తే.. అమెరికాలో అమ్మాయిలతో స్విమ్మింగ్‌ పూల్‌ లో చేసిన చేష్టల గురించి మేం మాట్లాడం లేదు. నీ విన్యాసాలతో రాజకీయాల్లో బాహుబలి అయిపోతావని అనుకుంటే అది పొరపాటే. నువ్వు రాజకీయాల్లో బాహుబాలివి ఎన్నటికీ కాలేవు. లోకేష్.. పులకేశి నెంబర్‌ వన్‌. శవ యాత్రలు చేసినంతమాత్రాన హీరోవి కాలేవు, మరింత నవ్వుల పాలు అవ్వడం తప్ప. 

  రాజకీయాల్లో జగన్‌గారు ఎప్పటికీ బాహుబాలే.  సోనియాగాంధీని ఎదిరించి, సొంతపార్టీ పెట్టుకుని అధికారంలోకి వచ్చారు. అదే నారా లోకేష్‌ తండ్రిచాటు బిడ్డగా, దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయి, మంత్రి పదవి అనుభవించాడు. ఒక ఎలక్షన్‌లో గెలిచి అప్పుడు ముఖ్యమంత్రిగారి గురించి మాట్లాడితే బాగుంటుంది. చనిపోయిన ఆర్నెలు తర్వాత.. దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్లు.. ఇప్పుడా పరామర్శకు రావడం.
అది పరామర్శ కాదు రాజకీయ లబ్ధి మాత్రమే. ఇటువంటి రాజకీయాలను ప్రజలెవరూ హర్షించరు. 

 దిశ ఎక్కడుంది అని మాట్లాడుతున్నారు.. రాష్ట్రంలో సుమారు 47లక్షల మంది మహిళలు దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. 1645 కేసులు ఈ చట్టం స్ఫూర్తితో నమోదు చేశారు. మీకు చేతనైతే మహిళలను ఎడ్యుకేట్‌ చేసి దిశ యాప్‌, చట్టాన్ని ఉపయోగించుకునేలా ప్రచారం కల్పించి, ప్రతిపక్ష పార్టీగా నిర్మాణాత్మకంగా పనిచేస్తే స్వాగతిస్తాం. మహిళల రక్షణ కోసం ముఖ్యమంత్రిగారు దిశ చట్టాన్ని తీసుకువస్తే దాన్ని అపహాస్యం చేసేలా మాట్లాడతారా? ఆడబిడ్డల చావును టీడీపీ రాజకీయం కోసం వాడుకోవడం దుర్మార్గం, నీచం. వైయస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళల రక్షణ కోసం బాధ్యతగా పని చేస్తోంది. రానున్న రోజుల్లోనూ దిశ చట్టాని పటిష్టంగా అమలు చేస్తామ‌ని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు.

Back to Top