అమరావతి: బాబు వస్తే జాబు వస్తుందని, ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి చంద్రబాబు నిరుద్యోగులను మోసం చేశాడని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి అన్నారు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాల కల్పనపై సభలో ప్రవేశపెట్టిన బిల్లుపై ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి బిల్లు దేశ చరిత్రలోనే ఎవరూ ప్రవేశపెట్టలేదని, ఈ ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం శాసనసభలో ఏ బిల్లు ప్రవేశపెట్టినా టీడీపీ సభ్యులు రాద్ధాంతం చేస్తున్నారన్నారు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ ఏమీ చేయలేకపోయానని చంద్రబాబు కడుపు మండిపోతున్నట్లుగా ఉందన్నారు. ‘పాత రోజుల్లో మా నాన్నకు బుల్లెట్ వాహనం తెప్పించాం. ఈ మధ్య కాలంలో కూడా బుల్లెట్ తోలుతానని వెళ్లి ప్రమాదానికి గురయ్యాడు. వయస్సు అయిపోయింది కళ్లు కూడా కనిపించక యాక్సిడెంట్ జరిగింది’. చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా ఇదే మాదిరిగా ఉందని, వయస్సు అయిపోయినా కూడా నా కంటే అనుభవం లేదని మాట్లాడుతున్నాడని సభలో మధుసూదన్రెడ్డి నవ్వులు పూయించారు. ప్రజలకు మేలు చేయాలంటే వయస్సుతో సంబంధం లేదని చేయాలనే తపన ఉంటే మా నాయకుడు వైయస్ జగన్లా ప్రజలకు మేలు చేశారన్నారు.